గెయిల్ విషాదం: బాధితులకు వైయస్ జగన్ పరామర్శ
తూర్పుగోదావరి: జిల్లాలోని మామిడికుదురు మండలం నగరం గ్రామంలో గ్యాస్పైప్ పేలుడు ఘటనలో మృతి చెందిన వారి కుటుంబసభ్యులను, క్షతగాత్రులైన వారి కుటుంబ సభ్యులను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి శనివారం పరామర్శించారు. శుక్రవారం తెల్లవారుజామున ఓఎన్జిసి గ్యాస్ స్టేషన్ సమీపంలో గెయిల్ గ్యాస్ పైప్లైన్ పేలుడు సంభవించి 14 మంది సజీవం దహనం కాగా, మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు.
ఈ ప్రమాదంలో మరో 30 మంది గాయాల పాలయ్యారు. ప్రమాద బాధిత కుటుంబాలను జగన్మోహన్ రెడ్డి శనివారం పరామర్శించి, వారిని ఓదార్చారు. తమ దగ్గరికి వచ్చిన జగన్కు బాధితులు తమ గోడును వెళ్లబోసుకున్నారు. అంతకుముందు పేలుడు ఘటనపై జిల్లా అధికారులతో జగన్ మాట్లాడారు. గ్రామంలోని పరిస్థితులను, తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారి గురించి ఆయన అడిగి తెలుసుకున్నారు.
విచారణ ప్రారంభించిన ఉన్నతస్థాయి కమిటీ
నగరంలో గ్యాస్పైప్లైన్ పేలుడు ప్రమాదంపై ఉన్నతస్థాయి కమిటీ శనివారం విచారణను ప్రారంభించింది. కేంద్ర ప్రభుత్వం నియమించిన పెట్రోలియం శాఖ సంయుక్త కార్యదర్శి ఆర్పీసింగ్ నేతృత్వంలోని కమిటీ ఘటనాస్థలికి చేరుకుని ఓఎన్జిసి, గెయిల్ అధికారుల నుంచి పేలుడుకు గల కారణాల వివరాలను సేకరించారు.
పేలుడు వెనుక నిర్లక్ష్యం ఉంటే చర్యలు తీసుకుంటామని ఆర్పీసింగ్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. తాటిపాక రిఫైనరీని జనావాసాల నుంచి తరలించే అంశాన్ని పరిశీలిస్తామని ఆయన తెలిపారు. పైప్లైన్కు ఇరువైపులా 18 కి.మీ వరకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదని ఆర్పీసింగ్ పేర్కొన్నారు.