ఏలూరు వింతవ్యాధి కారణాలు తేల్చేందుకు హైపవర్ కమిటీ- సీఎస్ నేతృత్వంలో 21 మందితో
ఏలూరులో వింతవ్యాధి ప్రభావం ఇంకా కొనసాగుతోంది. వ్యాధి బయటపడి వారం రోజులు కావస్తున్నా ఇంకా బాధితులు ఆస్పత్రులకు క్యూ కడుతూనే ఉన్నారు. దీంతో అంతు చిక్కని వ్యాధి కారణాలను తేల్చేందుకు ఏపీ ప్రభుత్వం ఓ హై పవర్ కమిటీని ఏర్పాటు చేసింది. సీఎస్ నేతృత్వంలో 21 మందతో ఏర్పాటు చేసిన ఈ కమిటీ వింతవ్యాధికి గల కారణాలను తేల్చబోతోంది.
ఏలూరులో అంతు చిక్కని వ్యాధికి కారణాలు తెలుసుకునేందుకు నగరంలో ఇప్పటికే ఎయిమ్స్తో పాటు ప్రపంచ ఆరోగ్యసంస్ధకు చెందిన బృందం కూడా పర్యటించింది. బాధితుల నుంచి వివరాలు సేకరించింది. బాధితుల శాంపిల్స్తో పాటు స్ధానికంగా తాగునీరు, పాలు, కూరగాయల శాంపిల్స్ కూడా ఢిల్లీ, మంగళగిరి ఎయిమ్స్లతో పాటు సీసీఎంబీ, ఎన్ఐఎన్తో పాటు పలు ప్రతిష్టాత్మక సంస్ధలు, ల్యాబ్లలో పరీక్షిస్తున్నారు. వీటి ఫలితాలు త్వరలో వెలువడాల్సి ఉంది.
ఏలూరులో అంతుచిక్కని వ్యాధికి సంబంధించి తాము గుర్తించిన కారణాలను ప్రభుత్వంతో పంచుకునేందుకు ఇవాళ సీసీఎంబీతో పాటు పలు పరిశోధనా సంస్దల నిపుణులు సీఎం జగన్తో సమావేశం కానున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కూడా తమ వంతు బాధ్యతగా సీఎస్ నేతృత్వంలో 21 మంది అధికారులతో ఓ హైపవర్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ అంతు చిక్కని వ్యాధికి దారి తీసిన కారణాలను క్షేత్రస్దాయిలో పర్యటించి తెలుసుకోనుంది. ఈ కమిటీ తమ నివేదికలో వ్యాధికి దారితీసిన కారణాలతో పాటు భవిష్యత్తులో ఇది పునరావృతం కాకుండా పలు చర్యలను కూడా ప్రభుత్వానికి సూచించనుంది.
Recommended Video
ప్రభుత్వం నియమించిన హై పవర్ కమిటీలో సీఎస్ నీలం సాహ్నీతో పాటు పశు సంవర్ధకశాఖ, పర్యావరణ, శాస్త్రసాంకేతికశాఖ, జలవనరులశాఖ స్పెషల్ ఛీఫ్ సెక్రటరీలు, పురపాలకశాఖ సెక్రటరీ, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్, పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్, మంగళగిరి ఎయిమ్స్ డైరెక్టర్ ముకేష్ త్రిపాఠీ, ఢిల్లీ ఎయిమ్స్ క్లినికల్ టాక్సాలజీ హెచ్వోడీ అహ్మదుల్లా షరీఫ్, సీసీఎంబీ డైరెక్టర్ రాకేష్ మిశ్రా, ఐఐసీటీ డైరెక్టర్ చంద్రశేఖర్, ఎన్ఐఎన్ శాస్త్రవేత్త జే బాబు, ఢిల్లీ ఎయిమ్స్ ఎమర్జెన్సీ మెడిసిన్ అసోసియేట్ ప్రొఫెసర్ జంషెడ్ నాయర్, ఢిల్లీ ఎన్సీడీసీ డిప్యూడీ డైరెక్టర్ సంకేత్ కులకర్ణి, పూణే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ శాస్త్రవేత్త అవినాష్, డబ్ల్యూహెచ్వో సౌత్ రీజియన్ నేషనల్ ప్రొఫెషనల్ ఆఫీసర్ ఆశిష్ కే సత్పతి, ఏపీకి చెందిన న్యూరో ఫిజిషియన్ చంద్రశేఖర్రెడ్డి, సిద్దార్ధ మెడికల్ కాలేజ్ ఫిజిషియన్ మాలతి, ఏలూరు ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ మోహన్, ఏపీ వైద్యారోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఇందులో ఉన్నారు.