ఏపీలో జగన్ దళం.. ఆయన కోసం దేనికైనా సిద్ధం .. వైసీపీ ఎమ్మెల్యే సంచలనం
ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చి రెండు నెలలే .. కానీ వైసీపీ రాష్ట్రంలో అరాచకాలకు పాల్పడుతుంది అని ప్రతిపక్ష పార్టీలు అగ్గి మీద గుగ్గిలం అవుతున్నాయి. ఇక ఆమాటలకు ఊతమిస్తూ టీడీపీ , బీజేపీ కార్యకర్తలపై దాడులు జరిగాయి. అధికార పార్టీపై ఇప్పటికే పలు విషయాలపై విమర్శలు వెల్లువెత్తుతున్న సమయంలో కడప జిల్లా ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసి జగన్ పార్టీని మరింత కాంట్రవర్సీలోకి నెట్టారు. ఇంతకీ ఆయన ఏమన్నారంటే
పోలవరం ప్రాజెక్ట్ లో అవినీతి నిజమే.. తేల్చేసిన నిపుణుల కమిటీ.. చంద్రబాబుకు కష్టాలు షురూనా
జగన్ కోసం దేనికైనా సిద్ధం అని వీరాభిమానం చాటుకున్న ఎమ్మెల్యే .. సంచలన వ్యాఖ్యలతో కలకలం
ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మొదట నుండీ వివాదాస్పదుడే . ఆయన వ్యవహార శైలి చాలా భిన్నంగా ఉంటుంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార టీడీపీపై సంచలన వ్యాఖ్యలతో ఎమ్మెల్యే రాచమల్లు వార్తల్లో నిలిచిన వ్యక్తి . ఇప్పుడు అధికార పార్టీలో కూడా ఆయన వైఖరి మారలేదు . తాజాగా, అసెంబ్లీ లాబీలో ఇష్టాగోష్ఠిగా మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి కోసం తలలు తీసి యజ్ఞగుండంలో వేసేందుకు కూడా తాము సిద్ధంగా ఉన్నామని ఎమ్మెల్యే శివప్రసాదరెడ్డి వ్యాఖ్యానించారు. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి వ్యాఖ్యలు అటు రాజకీయ వర్గాలు, ఇటు ప్రజలకు షాకింగ్ అనిపించాయి.
60 మంది ఎమ్మెల్యేలం జగన్ దళం... ఆయన కోసం దేనికైనా రెడీ
అంతేకాదు ఆయన ఇందు కోసం మొత్తం 60 మంది ఎమ్మెల్యేలం దళంగా ఏర్పడ్డామని తెలిపారు.టీడీపీ హయాంలో బాబు పెట్టిన ఇబ్బందుల్ని మరచిపోలేమన్నారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ చంద్రబాబు, లోకేష్ సీఎం కాకూడదని 60 మంది ఎమ్మెల్యేలం దళంగా ఏర్పడ్డామన్న ఆయన గతంలో పోరాట వీరులం.. ఇప్పుడు పరిపాలన దక్షులమని చెప్పుకున్నారు . తనకు పదవుల మీద ఆశ లేదని.. జగన్ కోసమే పనిచేస్తున్నాను అని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు . అరవై మంది ఓకే .. మరి మిగతా 90మంది ఎమ్మెల్యేల సంగతేంటని మీడియా ప్రశ్నించగా ఆసక్తికర సమాధానం ఇచ్చారు రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి . జగన్పై ప్రేమ అందరికీ ఉన్నా అందులో హెచ్చుతగ్గులుంటాయని పేర్కొన్నారు.
ఎన్నికలకు ముందు కూడా సంచలన వ్యాఖ్యలు చేసిన రాచమల్లు
ఇక ఎన్నికలకు ముందు కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రాకపోతే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని ప్రకటించారు. నాటి మంత్రి ఆదినారాయణ రెడ్డికి సవాల్ విసిరిన రాచమల్లు శివప్రసాద్ రెడ్డి వైసీపీ ఓడిపోతే ఎన్నికలలో పోటీచేయనని, టీడీపీ ఓడిపోతే మీరు పోటీ నుంచి తప్పుకుంటారా అని సవాల్ విసిరారు . అంతేకాదు సంచలన నిర్ణయాలు తీసుకుని ప్రొద్దుటూరు నియోజకవర్గంలో వైసీపీ పటిష్టతకు ఆయన కృషి చేస్తున్నారు. కానీ తాజా వాఖ్యలు ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేలా వున్నాయి.