విజయ్ చందర్ కే ఆ పదవి : సీఎం జగన్ కీలక నిర్ణయం : వారందరి ఆశలు..ఇక..!
ముఖ్యమంత్రి జగన్ మరో కీలక పదవి భర్తీ పైన నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల సమయంలో అనేక మంది సినీ ప్రముఖులు జగన్ కు మద్దతుగా రంగంలోకి దిగారు. అదే విధంగా జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత వారు అంత యాక్టివ్ గా కనిపించటం లేదు. ఇదే సమయంలో పార్టీలో తొలి నుంది ఉన్న వారికి పదవుల కేటాయింపులో వరుసగా నిర్ణయాలు తీసుకుంటున్న జగన్..
ఏపీలో అయిదేళ్లల్లో రూ.2 లక్షల కోట్లకుపైగా పెట్టుబడులు: కేంద్ర మంత్రి..సీఎం జగన్ కీలక భేటీ..!
తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకు న్నారు. అందులో భాగంగా..లక్ష్మీపార్వతికి తెలుగు అకాడమి ఛైర్మన్ పదవి కట్టబెట్టిన ముఖ్యమంత్రి...ఇప్పుడు ఫిలిం డెవలప్ మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్ పదవిని సీనియర్ యాక్టర్ విజయ్ చందర్ కు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ పదవి కోసం అనేక మంది పేర్లు వినిపించాయి. పోసాని..మోహన్ బాబు.. ఆలీ.. జయసుధ వంటి పేర్లు ప్రచారం జరిగాయి. అయితే ఎన్నికల ముందు వచ్చిన వారు కాదు..పార్టీ ఏర్పాటు నుండి తనతోనే ఉన్న విజయ్ చందర్ కు ఈ పదవి ఇవ్వాలని జగన్ నిర్ణయించారు.
తొలి నుండి పార్టీలో విజయ్ చందర్...
సాయిబాబాగా..కరుణామయుడుగా నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించిన విజయ్ చందర్ జగన్ పార్టీ ప్రకటన నాటి నుండి ఆయనతోనే వెన్నంటి ఉన్నారు. జగన్ జైలులో ఉన్న సమయంలోనూ.. షర్మిళ పాదయాత్ర వేళ..ఎన్నికల ప్రచారంలోనూ వైసీపీకి మద్దతుగా పని చేసారు. జగన్ పాల్లొనే అనేక కార్యక్రమాల్లో కార్యకర్త లాగానే హాజరై.. జగన్ పట్ల తన విధేయత చాటుకున్నారు. తొలి నుండి తనతో పాటే ఉన్న విజయ్ చందర్ కు పదవి ఇవ్వాలని నిర్ణయించారు. అందులో భాగంగా టీడీపీ ప్రభుత్వంలో అంబికా కృష్ణ కు ఇచ్చిన ఫిలిం డెవలప్ మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్ పదవిని విజయ్ చందర్ కు ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. టంగుటూరు ప్రకాశం కుటుంబానికి చెందిన వ్యక్తిగా..విజయ్ చందర్ వైయస్ కుటుంబానికి విధేయుడు. దీంతో.. జగన్ ఆయనకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు. ఇప్పటికే సినీ రంగానికి చెందిన బలిరెడ్డి పృథ్వీరాజ్ కు ఎస్వీబీసీ ఛైర్మన్ పదవి అప్పగించారు. దీంతో..ఇప్పుడు సినీ పరిశ్రమకు చెందిన రెండో వ్యక్తి జగన్ ప్రభుత్వంలో పదవి దక్కించుకుంటున్నారు.
వారి ఆశలు అన్నీ..అంతేనా..
ఇక, విజయ్ చందర్ తో పాటుగా పోసాని సైతం జగన్ కు మద్దతుగా చంద్రబాబు మీద అనేక సార్లు ఫైర్ అయ్యారు. జగన్ ను సమర్ధిస్తూ..సినీ పరిశ్రమలోని కొందరి పైన విమర్శలు చేసారు. పోసాని తనకు పదవి దక్కుతుందనే అంచనాలతో ఉన్నారు. అనారోగ్యంతో ఉన్న తాను పూర్తిగా కోలుకున్నానని..జగన్ తన అవసరం ఉందనుకుంటే పదవి ఇస్తారంటూ గతంలో పోసాని కామెంట్ చేసారు. అయితే, పాదయాత్రలో పోసాని జగన్ కు మద్దతుగా కలిసి నడిచారు. ఇక, అధికారంలోకి వచ్చిన తరువాత పోసాని పైన జగన్ నిర్ణయం తీసుకోలేదు. దీంతో..ఆయన కొద్ది రోజులుగా మౌనంగా ఉంటున్నారు. తనకు గుర్తింపు ఇవ్వకవపోటం పైనా ఆయన మనస్థాపానికి గురైనట్లుగా తెలుస్తోంది. అదే విధంగా సినీ ప్రముఖులు జగన్ ను కలవటానికి ఇష్టపడటం లేదంటూ పృథ్వీ చేసిన వ్యాఖ్యలకు పోసాని కౌంటర్ ఇచ్చారు.
మోహన్ బాబు..ఆలీ..జయసుధకు దక్కేదేంటి..
తాజాగా జరిగిన ఎన్నికల్లో జగన్ కు మద్దతుగా ప్రముఖ సినీ నటలు మోహన్ బాబు..ఆలీ ప్రచారం చేసారు. జయసుధ వైసీపీలో చేరారు. జగన్ అధికారంలోకి వస్తే ఈ ముగ్గురిలో ఒకరికి ఫిలిం డెవలప్ మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్ పదవి దక్కుతుందని అంచనా వేసారు. అయితే, జగన్ ఇప్పుడు విజయ్ చందర్ కు ఆ పదవి ఇవ్వాలని నిర్ణయించంటంతో వీరికి ఎటువంటి ప్రాధాన్యత ఇస్తారనే చర్చ మొదలైంది. అయితే, ఆలీ పార్టీ చేరే సమయంలో పార్టీ కోసం పని చేయాలని..తన సంగతి తాను చూసుకుంటానంటూ జగన్ హామీ ఇచ్చారని ఆలీ అప్పట్లోనే చెప్పారు. ఇక, మోహన్ బాబు తాను పదవుల కోసం రాలేదని.. జగన్ ను ముఖ్యమంత్రిగా చూడాలని అనుకున్నా..అది నెరవేరిందని..తనకు పదవుల గురించి ఆలోచన లేదని చెబుతున్నారు. అయితే, జయసుధకు మాత్రం పదవి ఇచ్చేందుకు పరిశీలనలో ఉన్నట్లుగా చెబుతున్నారు.