ఏపీ ముఖ్యమంత్రి డిమాండ్ ఇదే: కేసీఆర్ అంగీకరిస్తారా: తెర పైకి వివాదాస్పద అంశాలు!
Recommended Video
మరోసారి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశం అవుతున్నారు. గత రెండు సార్లు జరిగిన సమావేశాల్లో నిర్ణయించిన రూట్ మ్యాప్ లో భాగంగా రెండు రాష్ట్రాల అధికారులు ముఖ్యమంత్రులకు నివేదికలు ఇవ్వనున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు ఫోన్ చేసి ప్రాధమికంగా ఈ రోజు చర్చించే అంశాల పైన విశ్లేషించారు. ఏపీ అధికారులను సైతం పూర్తి సమాచారం తో సిద్దంగా ఉండాలని సీఎం ఆదేశించారు. అయితే..ఈ సారి సమావేశంలో ముఖ్యమంత్రి జగన్ రెండు కీలక అంశాలను ప్రస్తావించి..వాటి నుండి కేసీఆర్ నుండి స్పష్టత కోరనున్నట్లు విశ్వసనీయ సమాచారం.
రాయలసీమ ను గోదావరి నీటి వినియోగం గురించి ప్రతిపక్ష టీడీపీ ఆరోపణలు చేస్తోంది. దీనికి సంబంధించి ఈ సమావేశంలో స్పష్టత ఇవ్వనున్నారు. అదే సమయంలో ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రి ప్రస్తావించాలని నిర్ణయించిన అంశాల పైన కేసీఆర్ ఎలా స్పందిస్తారనేది ఆసక్తి కరంగా మారింది. ఈ నిర్ణయాల ఆధారంగానే రాజకీయంగా జగన్ ఏపీలో పైచేయి సాధించే అవకాశం ఉంటుంది. దీంతో..ఇప్పుడు ఈ సమావేశంలో చర్చించే అంశాలు..నిర్ణయాల పైన రాజకీయంగానూ ఆసక్తి నెలకొని ఉంది.
పోలవరం మీద స్పష్టత ఇవ్వాలంటూ..
ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చి జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేసారు. పోలవరం ప్రాజెక్టు పైన తమకు అభ్యంతరాలు లేవని స్పష్టం చేసారు. అయితే.. పోలవరం పైన కోర్టులో కేసులు వేసిన కేసీఆర్ తో జగన్ స్నేహం ఎలా చేస్తారంటూ టీడీపీ నిలదీసింది. ఇక, ఇప్పుడు అదే అంశాన్ని ప్రస్తావిస్తూ ఏపీ ప్రయోజనాలను కేసీఆర్ కు ముఖ్యమంత్రి జగన్ తాకట్టు పెడుతున్నారని విమర్శలు చేస్తోంది. ఇక, నవంబర్ లోగా పోలవరం రివర్స్ టెండరింగ్ పూర్తి చేసి పనులు ప్రారంభించాలని భావిస్తున్న ముఖ్యమంత్రి జగన్ తాను కేసీఆర్ తో కలిసి రాయలసీమకు గోదావరి నీరు అందించే అంశాల పైన ఫోకస చేసారు.
ఇదే సమయంలో కేసీఆర్ ఏపీ ప్రయోజనాలకు వ్యతిరేకంగా కాదనే విషయాన్ని స్పష్టం చేసే దిశగా కేసీఆర్ నుండి స్పస్టమైన ప్రకటన కోరాలని నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. అందులో భాగంగా పోలవరం పైన తాజాగా అసెంబ్లీలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యల పైన టీడీపీ నేతల రియాక్షన్ సైతం వారి మధ్య చర్చకు వచ్చే అవకాశం ఉంది. దీంతో.. పోలవరం ప్రాజెక్టు విషయంలో గతంలో తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రకంగా అయితే సానుకూలంగా స్పందించారో..అదే విధంగా అధికారికంగా ప్రకటన కోసం జగన్ కోరనున్నట్లు సమాచారం. అవసరమైతే ఒడిశా ముఖ్యమంత్రితోనూ మాట్లాడుతానని గతంలో కేసీఆర్ ముందుకు వచ్చారు. ఇప్పుడు అదే విషయాన్ని జగన్ మరోసారి స్పష్టత ఇచ్చేలా కేసీఆర్ వద్ద ప్రస్తావించనున్నారు. దీనికి ఇప్పుడున్న పరిస్థితుల్లో కేసీఆర్ ఏ రకంగా స్పందిస్తారో..గతంలో చెప్పిన విధంగా ఇప్పుడు స్పష్టత ఇస్తారా లేదా అనేది చూడాల్సి ఉంది.
పోతిరెడ్డిపాడు మీద కీలక చర్చలు..రాజీ కుదిరేనా
ఇక, గతంలో కేసీఆర్ పదే పదే ప్రస్తావించి..విమర్శలు చేసిన పోతిరెడ్డిపాడు గురించి తాజాగా ఇరిగేషన్ సమీక్షలో ముఖ్యమంత్రి జగన్ కీలక వ్యాఖ్యలు చేసారు. పోతిరెడ్డి పాడు కెపాసిటీని 80 వేల క్యూసెక్కులు ఉండేలా డిపీఆర్ రెడీ చేయాలని జగన్ ఆదేశించారు. అయితే..అక్కడ తెలంగాణతో ఉన్న సమస్యలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. దీని పైన తాను కేసీఆర్ తో మాట్లాడుతానని జగన్ స్పష్టం చేసారు. ఈ రోజు జరిగే సమావేశంలో ఈ అంశం సైతం ప్రస్తావించాలని జగన్ నిర్ణయించారు. ఇప్పుడు తెలంగాణలో ఇరిగేషన్ వ్యవహారాలను సైతం ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా చూస్తున్నారు. ఏపీలో జరిగిన సమీక్షలో జగన్ చేసిన వ్యాఖ్యల పైన ఇప్పటి వరకు టీఆర్ యస్ నేతలు ఎక్కడా రియాక్ట్ కాలేదు.
అయితే.. గతంలో ఇదే అంశాన్ని చూపిస్తూ
పాలమూరుకు నష్టం చేసే విధంగా నాటి సీఎం వైయస్సార్ వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ టీఆర్ యస్ మంత్రులు కాంగ్రెస్ ప్రభుత్వం నుండి బయటకు వచ్చారు. గత ఏడాది జరిగిన తెలంగాణ ఎన్నికల ప్రచార సమయంలోనూ కేసీఆర్ ఈ అంశాన్ని గుర్తు చేసారు. మరి..ఇప్పుడు తన మాట కాదనరనే నమ్మకంతో ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి వద్ద పోతిరెడ్డి పాడుకు 80 వేల క్యూసెక్కుల దక్కేలా ప్రతిపాదన చేయనున్నారు. ఇప్పటికే కేసీఆర్ జగన్ మధ్య ఉన్న సన్నిహిత సంబంధాల కారణంగా కేసీఆర్ ఏపీ ముఖ్యమంత్రి ప్రతిపాదన పైన సానుకూలంగా రియాక్ట్ అవుతారా..లేక మధ్యే మార్గం ప్రతిపాదిస్తారా అనేది చూడాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్కు రావాల్సిన పెండింగ్ విద్యుత్తు బిల్లులు తదితర అంశాలపై వీరిద్దరూ కీలక నిర్ణయం తీసుకున్నారు.