AndhraPradesh:గవర్నర్ కోటాలో జగన్ ఆప్తులకు ఎమ్మెల్సీ .. మరొకటి ఎవరికి..?
అమరావతి: ఏపీ నుండి ఖాళీ అయిన గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాల భర్తీ పైన ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం తీసుకున్నారు. అనేక తర్జన భర్జనల తరువాత ఇద్దరి పేర్లను అధికారికంగా ఖరారు చేసారు. కంతేటి సత్యానారాయణ రాజు..రత్నాబాయి పదవీ కాలం ముగియటంతో వారి స్థానంలో కొత్త వారిని భర్తీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. వీరి స్థానంలో ఎస్సీ..మైనార్టీ వర్గాలకు అవకాశం ఇవ్వాలని సీఎం డిసైడ్ అయ్యారు.
Recommended Video
కేబినెట్ లో ఇద్దరు మంత్రులు రాజ్యసభకు వెళ్లటంతో మంత్రివర్గంలో ఆ రెండు స్థానాలను బీసీలతోనే తిరిగి భర్తీ చేయాలని సీఎం నిర్ణయించారు. అదే వీరు ఖాళీ చేసిన రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో మాత్రం ఒకటే భర్తీకి అవకాశం ఉండటంతో..ఆ స్థానం ఎవరికి ఇస్తారనేది ఇంకా పార్టీలో చర్చలు సాగుతున్నాయి. గవర్నర్ కోటాలో చివరి వరకు పలు పేర్లు ప్రచారంలోకి వచ్చినా..ఇద్దరి పేర్లు ఖరారు చేసినట్లుగా విశ్వసనీయ సమాచారం. ఈ రెండు పేర్లను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా గవర్నర్ కు సిఫార్సు చేయాల్సి ఉంది.
మోషేన్ రాజు.. జరీనా ఖానుంలకు...
గవర్నర్ కోటాలో ముఖ్యమంత్రి జగన్ ఎస్సీ..మైనార్టీ వర్గాలకు అవకాశం కల్పించాలని తొలుత నిర్ణయించారు. దీంతో..ఎస్సీ వర్గం నుండి అమలాపురం మాజీ ఎంపీ..టీడీపీ నుండి వైసీపీలో చేరిన పండుల రవీంద్ర బాబు పేరు ప్రచారంలో ఉంది. అయితే,వైసీపీలో చాలా కాలంగా పని చేస్తూ..2014 ఎన్నికల్లో కోవూరు నియోకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయిన జిల్లా నేత కొయ్య మోషేన్ రాజుకు అవకాశం ఇవ్వాలని సీఎం జగన్ నిర్ణయించారు. 2019 ఎన్నికల సమయంలోనే జగన్ హామీ ఇచ్చారు.
దీంతో..ఎస్సీ మాదిగ వర్గానికి చెందిన డొక్కా మణిక్య వరప్రసాద్ కు ఆయన స్థానమే తిరిగి ఎమ్మెల్సీగా కేటాయించటంతో..ఇప్పుడు ఎస్సీ మాల వర్గానికి చెందిన కొయ్యే మోషన్ రాజు పేరును జగన్ ఖరారు చేసారు. ఇక, మైనార్టీ కోటాలో సుదీర్ఘ కాలంగా వైయస్ కుటుంబానికి విధేయులుగా ఉన్న రాజంపేట నియోజకవర్గానికి చెందిన మహిళ మైనా జరీనా ఖానుంలకు కేటాయించారు. ఈ రెండు పేర్లను అధికారికంగా ప్రభుత్వం గవర్నర్ కు సిఫార్సు చేయనుంది. పండుల రవీంద్రబాబుకు సైతం తగిన ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.
మరో ఎమ్మెల్సీ సీటు ఎంపికపై తుది కసరత్తు..
ఎమ్మెల్సీలుగా ఉంటూ మంత్రులుగా కొనసాగుతూ రాజ్యసభకు ఎంపికైన పిల్లి సుభాష్ చంద్రబోస్..మోపిదేవి వెంకట రమణ తమ ఎమ్మెల్సీ పదవులకు సైతం రాజీనామా చేసారు. అయితే, పిల్లి సుభాష్ చంద్ర బోస్ ఎమ్మెల్సీగా కాల పరిమితి మరో 9 నెలలు మాత్రమే ఉండటంతో ఆ స్థానాన్ని ఇప్పుడు భర్తీ చేసే అవకాశం లేదు.
ఇక, మోపిదేవి స్థానంలో పలువురు పేర్లను పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది. మోపిదేవి రాజీనామాతో ఆయన సొంత జిల్లాకు చెందిన మర్రి రాజశేఖర్ పేరు ప్రచారంలోకి వచ్చింది. కమ్మ వర్గానికి చెందిన రాజశేఖర్ కు 2019 ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. చిలకలూరిపేట సీటు బీసీ వర్గానికి చెందిన రజనీకి కేటాయించటంతో రాజశేఖర్ కు ఎమ్మెల్సీ హామీ ఇచ్చారు.
తోట త్రిమూర్తులకు ఛాన్స్..?
ఇక, ఇప్పుడు కేబినెట్ విస్తరణలో రామచంద్రాపురం ఎమ్మెల్యే వేణుకు మంత్రిగా అవకాశం దక్కితే అదే జిల్లాకు చెందిన కాపు నేత తోట త్రిమూర్తులకు ఎమ్మెల్సీగా ఛాన్స్ దక్కే అవకాశం ఉంది. ఇక, చీరాల నియోజకవర్గానికి చెందిన మరో కాపు నేత ఆమంచి క్రిష్ణ మోహన్ పేరు సైతం రేసులో ఉంది. చీరాల నుండి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన కరణం బలరాం అదే విధంగా పోతుల సునీత వైసీపీకి దగ్గరయ్యారు. దీంతో ఆమంచికి ప్రాధాన్యత ఇచ్చేందుకు ఆయనకు ఎమ్మెల్సీ ఇస్తారని చెబుతున్నారు. ఈ ఒక్క సీటు పైన ముఖ్యమంత్రి జగన్ ఒకటి లేదా రెండు రోజుల్లో తుది నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది.