జగన్ సీట్ల మార్పిడి నిర్ణయాలు...వైసిపి అభ్యర్థుల పాలిట శరాఘాతాలు:ఇప్పుడేం చేయాలనే నిర్వేదం!
గుంటూరు:ఎన్నికలు ఇంకా దరి చేరకముందే వైసిపిలో సీట్ల కేటాయింపు ప్రక్రియ పెనుదుమారం రేపుతోంది. కారణాలు ఏమైనప్పటికీ తమ పార్టీ అధినేత జగన్ తీసుకుంటున్న అనూహ్య నిర్ణయాలు తమకు శరాఘాతాల్లా పరిణమిస్తుండటంతో అభ్యర్థులు షాక్ కు గురవుతున్నారు.
సీట్ల కేటాయింపు విషయమై జగన్ తీసుకున్న అతి కొద్ది నిర్ణయాలపైనే ఆ పార్టీ లో పెను ప్రకంపనలు రేగుతున్నాయి. పార్టీ అధ్యక్షుడు జగన్ తీసుకునే నిర్ణయంతో ఎప్పుడు ఏ అభ్యర్థికి మూడుతుందోనని బిక్కుబిక్కుమంటున్నారు. నియోజకవర్గం ఇన్ ఛార్జ్ ల నియామకం అనే పరోక్ష అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ మిగతా చోట్ల ఏ విధంగా రచ్చకు కారణమైందో గుంటూరులోనూ అదేవిధంగా కనబడని చిచ్చుపెట్టింది. అదెలాగో?...ఏంటో?...చూద్దాం!
అభ్యర్థులకు...షాక్ లే షాక్ లు
నియోజకవర్గం పార్టీ ఇన్ ఛార్జ్ ల నియామకాలకు సంబంధించి వైసిపి అధినేత జగన్ తీసుకున్న నిర్ణయాలు కొండపి,ఉభయ గోదావరి జిల్లాలు,తాజాగా విజయవాడ, ఇంకా తాజాగా గుంటూరు...జిల్లాల్లో వైకాపాను కుదిపివేశాయనడంలో అతిశయోక్తి లేదు. మిగతా జిల్లాల సంగతి అటుంచితే రాజకీయ చైతన్యంలో రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు పొందిన గుంటూరు జిల్లాకు సంబంధించి వైసిపి అధినేత జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు ఆ పార్టీలో తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి.
ఇక్కడి నుంచే...రచ్చ స్టార్ట్
గుంటూరు జిల్లాకు సంబంధించి చిలకలూరిపేట అసెంబ్లీ నియోజకవర్గానికి రజనీ కుమారి అనే మహిళా ఎన్నారైను ఇన్ ఛార్జ్ గా నియమించడం ఇక్కడి వైకాపాను కుదిపేసింది. కారణం వైసిపిలో చిలకలూరిపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలో ఉంటారనుకున్న మర్రి రాజశేఖర్ ఆ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే, స్థానికంగా రాజకీయ వారసత్వం ఉన్న నేతే కాకుండా ఇటీవలి కాలంవరకు గుంటూరు జిల్లా వైకాపా అధ్యక్షుడిగా కూడా వ్యవహరించడం గమనార్హం. అయితే అటువంటి అభ్యర్థినే జగన్ నిస్సంకోచంగా పక్కకు తప్పించడం వైసిపిలోనే కాదు అన్ని రాజకీయ పార్టీల్లో చర్చనీయాంశం అయింది.
ఆయనకు...అనుకోని వరం...
ఇక తాజాగా గుంటూరు జిల్లాకు పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇన్ ఛార్జ్ ల నియామకంకు సంబంధించి జగన్ వెలువరించిన రెండు నిర్ణయాల్లో ఒకటి ఒక అభ్యర్థికి అనుకోనివరంలా పరిణమించగా, మరొకరికి పిడుగుపాటునే తలపించింది. ఆ రెండు నిర్ణయాలు...ఒకటి గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గానికి కిలారి రోశయ్య నియామకం కాగా రెండవది నర్సరావుపేట నియోజకవర్గం ఇన్ ఛార్జ్ గా లావు శ్రీకృష్ణదేవరాయల నియామకం. గుంటూరు ఎంపి సీటు విషయానికొస్తే ఇక్కడ ఇన్ ఛార్జ్ గా అనూహ్యంగా ఖరారైన కిలారి రోశయ్య గతంలో ప్రజారాజ్యం పార్టీ తరపున తెనాలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తరువాత ఆయన వైసీపీలో చేరారు. చిల్లీస్ మర్చంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడే కాకుండా ప్రముఖ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అల్లుడు అయిన కిలారి రోశయ్య... వైకాపా తరుపున అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని తహతహలాడుతున్న తరుణంలో జగన్ ఆయనకు ఏకంగా గుంటూరు ఎంపి సీటు రూపంలో బంపర్ ఆఫరే ఇచ్చారు.
ఈయనకు మాత్రం...శరాఘాతం
అయితే జగన్ తీసుకున్న ఈ నిర్ణయం గుంటూరు వైసిపి ఎంపి సీటు నూటికి నూరు శాతం తనదేనని ధీమాతో ఉన్న విజ్ఞాన్ విద్యా సంస్థల అధినేత లావు రత్తయ్య కుమారుడు శ్రీకృష్ణదేవరాయలుకు అక్షరాలా శరాఘాతంలా పరిణమించింది. కారణం ఈ నియోజకవర్గానికి శ్రీకృష్ణదేవరాయలు పేరును నాలుగేళ్ళ క్రితమే ఖరారు చేయగా...ఆ క్రమంలో ఈ లోక్సభ స్థానం కోఆర్డినేటర్గా చురుకుగా వ్యవహరిస్తూ కృష్ణదేవరాయలు విస్తృతంగా పర్యటిస్తున్నారు. అలాంటిది ముందుగా తనకు మాటమాత్రం చెప్పకుండా అనూహ్యంగా తనను నర్సరావుపేట ఎంపి సీటుకు తరలించడం ఆయనకు దిగ్భ్రాంతి కలిగించినట్లు తెలిసింది. ఇన్నాళ్లు గుంటూరు ఎంపీ అభ్యర్థిలాగా స్థానికంగా కష్టపడిన తాను ఇప్పుడు ఈ కష్టాన్నంతా బూడిదలో పోసి వేరే నియోజకవర్గానికి అపరిచితుడిలా వెళ్లడం ఇష్టం లేకున్నా గత్యంతరం లేని పరిస్థితుల్లో అందుకు కూడా అంగీకరించారని తెలుస్తోంది. పార్టీ అభ్యర్థులకు,ఆశావాహులకు అధినేత జగన్ ఇస్తున్న వరుస ఝలక్ లు మిగిలిన అభ్యర్థులను విపరీతమైన కలవరపాటుకు గురిచేస్తున్నాయని సమాచారం.