జగన్ ఢిల్లీ పర్యటనల ఎఫెక్ట్ .. ఎన్డీఏలోకి వైసీపీ ... జోరందుకున్న ప్రచారంపై కన్నా ఏం చెప్పారంటే
ఏపీలో జగన్ ఢిల్లీ పర్యటనల నేపధ్యంలో ఆసక్తికర చర్చ మొదలైంది . మూడు రోజుల వ్యవధిలో రెండుసార్లు ఢిల్లీ వెళ్ళి, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అధినేతలను కలిశారు జగన్ . మొన్న మోడీతో భేటీ అయ్యి వచ్చిన వెంటనే మళ్ళీ రెండు రోజులలో హస్తినకు వెళ్ళటం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని కలిగించింది . ఏం జరుగుతుంది అన్న ఉత్కంఠకు కారణం అవుతుంది .
ఢిల్లీలో న్యాయశాఖా మంత్రితో భేటీ అయిన ఏపీ సీఎం జగన్... ఎందుకంటే
ఎన్డీఏ ప్రభుత్వంలోకి వైసీపీ చేరుతుందన్న ఊహాగానాలు
కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంలోకి వైసీపీ చేరుతుందన్న ఊహాగానాలు మిన్నంటాయి .అందుకు ఊతం ఇస్తూ పురపాలక శాఖా మంత్రి బొత్సా చేసిన వ్యాఖ్యలు కూడా రాజకీయ వర్గాల్లో దుమారం రేపాయి. ఇక కేంద్ర మంత్రి పదవులు ఖరారయ్యాయని , రాజ్యసభ సీట్ల విషయంలో కూడా రెండు పార్టీల మధ్య ఒప్పందం కుదిరిందంటూ జరుగుతున్న ప్రచారం ఏపీ రాజకీయ వర్గాల్లో విమర్శలకు కారణం అవుతుంది. ఒక పక్క టీడీపీ అక్రమాస్తుల కేసుల నుండి తప్పించుకోటానికి సీఎం జగన్ ఎన్డీఏ పంచన చేరుతున్నారా అని విమర్శలు గుప్పిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది.
స్పందించిన ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ
ఈ ప్రచారంపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ స్పందించారు. ఎన్డీఏలో వైసీపీ పార్టీ చేరడంపై తమకు సమాచారం లేదని కన్నా పేర్కొన్నారు. టిడిపి, వైసీపీలకు సమాన దూరంలో ఉండాలనేది బీజేపీ విధానమని తేల్చి చెప్పారు కన్నా లక్ష్మీనారాయణ. ఈ విషయం మా పార్టీ ఇంఛార్జులు ఇప్పటికే ప్రకటన చేశారని, మరి మంత్రి బొత్స ఎందుకలా మాట్లాడారో తెలియడం లేదని కన్నా అన్నారు. బొత్సా వ్యాఖ్యల వల్లే ఈ గందరగోళం నెలకొందని ఆయన పేర్కొన్నారు.
జగన్ భేటీలకు రాజకీయాలకు సంబంధం లేదన్న కన్నా
ఇక సీఎం జగన్ పరిపాలనా పరమైన అంశాలపై మాత్రమే ప్రధానితో, కేంద్ర హోం మంత్రితో భేటీ అయ్యారని , ఈ భేటీలకు రాజకీయాలకు సంబంధం వుండి వుండదని కన్నా అభిప్రాయపడ్డారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీల నేతలు, కార్యకర్తలపై దాడులు పెరిగాయని పేర్కొన్న కన్నా తాజా పరిణామాలతో వైసీపీ బీజేపీతో జత కట్టే పరిస్థితి లేదని చెప్తున్నా కేంద్ర పెద్దల అభిప్రాయం ఏంటో తెలియాల్సి ఉంది.
రాజకీయ అనివార్యత దృష్ట్యా ఎవరేం చేస్తారో అన్న టెన్షన్
ఒక పక్క రాజధాని అమరావతి విషయంలో రాష్ట్ర నేతలు అమరావతి రైతులకు మద్దతు ప్రకటించి రాజధానిగా అమరావతినే ఉండాలని డిమాండ్ చేస్తే అందుకు భిన్నంగా రాజధాని నిర్ణయం రాష్ట్రాల పరిధిలోనే ఉంటుందని తేల్చి చెప్పింది కేంద్రం , ఇక ఈ వ్యవహారంలో మాత్రం రాజకీయ అనివార్యత దృష్ట్యా రాష్ట్రనాయకుల నిర్ణయాలను పక్కన పెట్టి బీజేపీ, వైసీపీలు పొత్తు పెట్టుకున్నా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు అన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం .