26న దీక్ష: వైఎస్ జగన్పై మంత్రుల మూకుమ్మడి దాడి
విజయవాడ: ప్రత్యేక హోదా కోసం ఈ నెల 26వ తేదీన గుంటూరు జిల్లాలో దీక్ష చేపట్టనున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై మంత్రులు తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఆయన లక్ష్యంగా చేసుకుని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బిజెపి పార్లమెంటు సభ్యుడు గోకరాజు కూడా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులపై విరుచుకుపడ్డారు.
జగన్ ప్రతిపక్ష నేతగా ఉండడం ప్రజల దౌర్భాగ్యమని మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు అన్నారు. ప్రజల సంక్షేమాన్ని పట్టించుకోకుండా జగన్ బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. పట్టిసీమ ప్రాజెక్టుకు వ్యతిరేకమని చెప్పిన జగన్, ఇప్పుడేం సమాధానం చెబుతారని మంత్రి ప్రశ్నించారు.
ఈ నెల 15న నదుల అనుసంధానంపై సెమినార్ నిర్వహించనున్నట్లు నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమ తెలిపారు. ఈ నెల 16న పట్టిసీమ మొదటి పంపును సీఎం ప్రారంభిస్తారని మంత్రి చెప్పారు. 16న పట్టిసీమ వద్ద భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని అన్నారు.
ఈ సభకు ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరవుతారని మంత్రి తెలిపారు. పోలవరం ఎడమ కాలువ పనులు వేగవంతం చేస్తామని అన్నారు. ఈ నెల 25 వరకు 6 వేల నీటి సంఘాలకు ఎన్నికలు జరుగుతాయని మంత్రి ఉమ తెలిపారు.
ప్రత్యేక హోదా కోసం జగన్ దీక్ష చేయడం పెద్ద జోక్ అని మరో మంత్రి రావెల కిషోర్బాబు అన్నారు. బుధవారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడారు. జగన్ దీక్షలు దొంగ దీక్షలు అన్నారు. కేసులు నమోదు కార్యక్రమం చేపట్టిన కాంగ్రెస్ నేతలపై ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలు నీచ రాజకీయాలు చేస్తున్నారని, రాష్ట్రాన్ని నాశనం చేసి కేసులు పెడుతున్నారని అన్నారు.
జగన్కు ఆస్తులపై ఉన్న మమకారం ప్రజలపై లేదని , జగన్కు చంద్రబాబుకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని మంత్రి పల్లె రఘునాథ్రెడ్డి అన్నారు. బుధవారం శ్రీకాకుళం జిల్లాలో ‘రైతు కోసం చంద్రన్న' యాత్ర సందర్భంగా ఆయన ఆ వ్యాఖ్యలు చేశారు.
దేశాన్ని నాశనం చేసిన కాంగ్రెస్ నేతలు ప్రధాని మోదీపై కేసులు పెట్టడం సిగ్గుచేటని నర్సాపురం బిజెపి పార్లమెంటు సభ్యుడు గోకరాజు విమర్శించారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు ఫ్యాక్షనిస్టుల్లా మాట్లాడుతున్నారని ఆరోపించారు. పట్టిసీమ ప్రాజెక్టు రాయలసీమకు వరమని ఆయన అన్నారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏపీ అభివృద్ధికి కృషి చేస్తున్నారని చెప్పారు. విశాఖ స్టేడియానికి త్వరలో టెస్ట్ హోదా వస్తుందని గోకరాజు ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే టెస్ట్ కమిటీ కొన్ని మార్పులు సూచించిందని ఆయన తెలిపారు.