శుక్రవారం సీబీఐ కోర్టుకు హాజరు కాని జగన్ .. ఊరటనిచ్చిన కోర్టు .. ఎందుకంటే
ఏపీలో జరిగిన ఎన్నికల్లో గెలుపొంది ఇటీవల ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి . అయితే ఒక ముఖ్య మంత్రిగా తనకు ఉన్న బిజీ షెడ్యూల్ నేపధ్యంలో సీబీఐ కోర్టుకు విచారణ కోసం హాజరు కాలేకపోతున్నానని ఆయన సీబీఐ ప్రత్యేక కోర్టుకు విన్నమించారు. ఇక ఈ విషయంలో జగన్, విజయసాయి రెడ్డి దాఖలు చేసిన పిటీషన్ల పైన విచారణ జరిపిన కోర్టు వారికి ఊరటనిచ్చింది.
శుక్రవారం సీబీఐ ప్రత్యేక కోర్టుకు హాజరు కాని జగన్ .. ఆబ్సెంట్ పిటీషన్ దాఖలు
ఏపీ సీఎం జగన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గా బాధ్యతలు చేపట్టి చాలా బిజీ బిజీగా ఉంటున్నారు. నేడు వైఎస్. జగన్ మోహన్ రెడ్డి శనివారం ఆ రాష్ట్ర సచివాలయంలోకి తొలిసారి అడుగుపెట్టారు. ఆ తర్వాత ఆయనకు సీబీఐ ప్రత్యేక కోర్టు ఊరటనిచ్చింది . ఆయనపై ఉన్న అక్రమ ఆస్తుల కేసులో హైదరాబాద్లోని ప్రత్యేక సీబీఐ కోర్టులో విచారణ సాగుతోంది. ఈ కేసులో విచారణకు ఆయన ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరవుతూ వస్తున్నారు. కానీ ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయన తానూ సీఎంగా బాధ్యతలు చేపట్టానని, అందువల్ల విధుల నిర్వహణలో భాగంగా కోర్టుకు హాజరుకాలేక పోతున్నానని, కోర్టులో హాజరు మినహాయింపు ఇవ్వాలని ఆయన తరపు న్యాయవాది కోర్టులో ఆబ్సెంట్ పిటిషన్ దాఖలు చేశారు. సీఆర్పీసీ సెక్షన్ 317 కింద జగన్ న్యాయవాది అశోకరెడ్డి పిటిషన్లో పేర్కొన్నారు.
విజయసాయి రెడ్డి కూడా కోర్టుకు పిటీషన్ దాఖలు .. విచారించి ఇరువురికీ ఊరట నిచ్చిన కోర్టు
ఇక ఇదే కేసులో రెండవ నిందితుడుగా ఉన్న విజయసాయి రెడ్డి తాను కోర్టుకు విచారణకు హాజరుకాలేనని పిటిషన్ దాఖలు చేశారు. తాడేపల్లిలో ఎమ్మెల్యేలు, పార్లమెంట్ సభ్యులతో వరుస సమావేశాలు ఉన్నందున కోర్టుకు హాజరుకాలేకపోతున్నట్టు ఆయన తన పిటీషన్ లో పేర్కొన్నారు. ఈ పిటిషన్లను కోర్టు విచారణకు స్వీకరించింది. అంతే కాదు సీబీఐ కూడా అభ్యంతరం చెప్పలేదు. దీంతో జగన్తో పాటు విజయసాయి రెడ్డికి కూడా ఊరట లభించినట్టు అయ్యింది. వీరిద్దరి పిటిషన్లను న్యాయమూర్తి బీఆర్ మధుసూదన్రావు అనుమతించటంతో పాటు ఈ కేసులో తదుపరి విచారణను ఈనెల 21కి వాయిదా వేశారు.
జగన్ పై ఉన్న చార్జ్ షీట్లలో పేర్కొన్న ఆరోపణలు ఒకే విధంగా ఉన్నందున అన్నీ కలిపి విచారించాలని కోరిన న్యాయవాది
అంతే కాదు జగన్ పై సీబీఐ పెట్టిన కేసుల్లో ఇప్పటివరకు సీబీఐ 11చార్జిషీట్లు దాఖలు చేసిందని, ఇందులో మొదటి 5 చార్జిషీట్లలో దాఖలు చేసుకున్న డిశ్చార్జ్ పిటిషన్లను కలిపి విచారించేందుకు ఈ కోర్టు అనుమతిస్తూ గతంలో ఉత్తర్వులు జారీచేసిందని జగన్ తరఫు న్యాయవాది నివేదించారు. అన్ని చార్జిషీట్లలో పేర్కొన్న ఆరోపణలు ఒకేవిధంగా ఉన్నాయని, ఈ నేపథ్యంలో మిగిలిన 6 చార్జిషీట్లకు సంబంధించిన డిశ్చార్జ్ పిటిషన్లను కలిపి విచారించాలని తాము దాఖలు చేసిన పిటిషన్ను అనుమతించాలని కోరారు జగన్ తరపు న్యాయవాది . దీనిపై పూర్తిగా విచారించాక నిర్ణయం తీసుకుంటామని న్యాయమూర్తి పేర్కొన్నారు.