పోలవరమంటే జగన్కు తెలియదు...జైలు తలుపుకు ఎన్ని ఊచలుంటాయో బాగా తెలుసు:టిడిపి మంత్రులు
పశ్చిమగోదావరి:వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్కు పోలవరం ప్రాజెక్టు అంటే ఏమిటో తెలియదు...కానీ జైలు తలుపుకు ఎన్ని ఊచలుంటాయో బాగా తెలుసని మంత్రి అయ్యన్నపాత్రుడు ఎద్దేవా చేశారు.
బుధవారం పోలవరం ప్రాజెక్టు స్పిల్వే గ్యాలరీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న అయ్యన్నపాత్రుడు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ప్రతిపక్ష నేత జగన్ పై విమర్శల వర్షం కురిపించారు. జగన్ కు సీఎం అవ్వాలన్న కోరిక తప్ప ఆయనకు వేరే ధ్యాసే లేదు. అలాంటివారిని రాష్ట్రం నుంచి తరిమికొట్టాలన్నారు. నాలుగు దశాబ్దాల కలగా ఉన్న పోలవరాన్ని కేవలం నాలుగేళ్లలో 60 శాతానికి పైగా పూర్తిచేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు అని మంత్రి అయ్యన్న కొనియాడారు.
పోలవరం ప్రాజెక్ట్ స్పిల్వే గ్యాలరీ వాక్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావు, కాల్వ శ్రీనివాసులు, ఆదినారాయణరెడ్డి, కేఎస్ జవహర్, దేవినేని ఉమామహేశ్వరరావు,లోకేష్ లతో పాటు సభాపతి కోడెల శివప్రసాదరావు, బీజేఎల్పీ నేత విష్ణుకుమార్ రాజు హాజరయ్యారు.
దేవి నేని ఉమ మాట్లాడుతూ..."పోలవరం నిర్మించాలన్న కల 1941లో తెరపైకి వచ్చినా.. ఆరు దశాబ్దాలపాటు కలగానే ఉండిపోయింది. చంద్రబాబు పవిత్ర సంకల్పంతో పోలవరాన్ని చేపట్టి బుధవారం గ్యాలరీ ప్రారంభించారు. కిలోమీటరు మేర కుటుంబ సభ్యులతోపాటు మనవడు దేవాన్ష్తో కలసి నడవడం ఒక చరిత్ర. 2019 కల్లా పోలవరాన్ని పూర్తి చేయాలని అధికారులు, కాంట్రాక్టర్లు కృషి చేస్తున్నారు" అని చెప్పారు.
మంత్రి కాల్వ శ్రీనివాసులు మాట్లాడుతూ..."స్పిల్వేలో గ్యాలరీ ప్రారంభోత్సవ కార్యక్రమం చరిత్రాత్మక ఘట్టం...ఈ మహాయజ్ఞంలో పాలుపంచుకోవడం మా అదృష్టం"...అని చెప్పారు. మరో మంత్రి ఆదినారాయణ రెడ్డి మాట్లాడుతూ..."పోలవరంపై విమర్శలు చేస్తున్న జగన్కు బుద్ధి ఉండాలి. చంద్రబాబు రాయలసీమను సస్యశ్యామలం చేసేందుకు కృషి చేస్తున్నారు. కేంద్ర సహకారం లేకపోయినా పనులు వేగంగా జరుగుతున్నాయి"...అన్నారు. మంత్రి జవహర్ మాట్లాడుతూ పోలవరంను నిర్మిస్తున్న సీఎం చంద్రబాబు అపర భగీరథుడు అని అభివర్ణించారు.