కవిత ఓటమిలో ఆయనే కీలకం: జగన్కు సన్నిహితుడే : మరి..కేసీఆర్ ఏమన్నారంటే..!
తెలంగాణ ముఖ్యమంత్రికి తాజాగా జరిగిన లోక్సభ ఎన్నికల ఫలితాలు షాక్ ఇచ్చాయి. అందులోనూ తన కుమార్తె కవిత ఓడిపోవటం కేసీఆర్కు ఊహించని దెబ్బ. తెలంగాణలో తనకు తిరుగు లేదనుకుంటున్న సమయంలో బీజేపీ ఏకంగా సీట్లు గెలిచింది. అయితే, తాజాగా జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్యస్ బలం చాటుకుంది. అయితే ప్రత్యేకంగా నిజామాబాద్ నుండి కవిత ఓడటం..ధర్మపురి అర్వింద్ గెలవటం వెనుక చాలా జరిగింది. ఎలాగైనా కవిత ను ఓడించాలని..దానికి తగినట్లుగా వ్యూహాలు..ఎత్తులు వేసే బాధ్యత ఓ కీలక వ్యక్తికి అప్పగించారు. ఆ వ్యక్తి అయిష్టం గానే ఆ బాధ్యత తీసుకున్నారు. జగన్కు సైతం ఆయన అత్యంత సన్నిహితుడు. ఏపీలో జగన్ గెలుపుకు సహకరించిన కేసీఆర్..ఇప్పుడు తన కుమార్తెను ఓడించటానికి జగన్ సన్నిహితుడు సహకరించటాన్ని ఎలా స్వీకరించారు..
కవిత ఓటమి..బీజేపీ గెలుపు..
2014లో కేసీఆర్ కుమార్తె నిజామాబాద్ నుండి ఎంపీగా తొలి సారి గెలిచారు. పార్లమెంట్లో యాక్టివ్గా వ్యవహరించారు. తెలంగాణలో కేసీఆర్ కుమార్తెగా..వ్యక్తిగతంగా పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించారు. తాజా ఎన్నికల్లో నిజామాబాద్ లోక్సభ స్థానంలో బీజేపీ నుండి పోటీ చేసిన ధర్మపురి అర్వింద్ చేతితో కవిత ఓడిపోయారు. అందరూ అక్కడ రైతులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండటం వలనే ఓడారని విశ్లేషించారు. అదే సమయంలో అదే రైతులు వారణాసి వెళ్లి మరీ మోదీ పైన పోటీకి నామినేషన్లు దాఖలు చేసారు. మరి..అటువంటి రైతాంగా బీజేకి మద్దతుగా నిజామాబాద్లో పని చేసిందా అంటే..కాదనే చెబుతున్నారు. తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ ..మోదీ హవా స్పష్టంగా కనిపించింది. కేసీఆర్ తనకు తెలంగాణలో తిరుగు లేదనుకుంటున్న సమయంలోనే బీజేపీ ఏకంగా నాలుగు సీట్లు సాధించింది. కానీ, కవిత ఓడిపోవటం వెనుక బీజేపీ అభ్యర్దికి సహకారం అందించిన వారి విషయమే ఇప్పుడు ఆసక్తి కరంగా మారింది.
బీజేపీ అభ్యర్దికి పీకే సహకారం..
నిజామాబాద్లో కవితను ఓడించాలని బీజేపీ అధి నాయకత్వం దృష్టి సారించింది. అందులో భాగంగా.. అప్పటికే ఏపీలో జగన్ కోసం పని చేస్తున్న ప్రశాంత్ కిషోర్నను సంప్రదించింది. అయితే, ఒక రాష్ట్రం లేదా..ఒక పార్టీ కోసం పని చేస్తాం కానీ... ఒక నియోజకవర్గం కోసం తాము పని చేయలేమని స్పష్టం చేసారు. అయినా..బీజేపీలోని కొందరు ముఖ్య నేతలు ఒత్తిడి చేయటంతో ప్రశాంత్ కిషోర్ నిర్వహిస్తున్న ఐ ప్యాక్ సిబ్బంది నుండి 20 మందిని నిజామాబాద్లో బీజేపీ అభ్యర్ది గెలుపు కోసం కేటాయించారు. వారు అక్కడ కేసీఆర్..కవితకు ఉన్న అనుకూలతలు..వారికి ఉన్న ఫాలోయింగ్ ను గుర్తించారు. అదే సమయంలో అక్కడ వారి పైన ఎవరు వ్యతిరేకంగా ఉన్నారో పసి గట్టారు. వీటి ద్వారా ఒక వ్యూహం తో అర్వింద్ ప్రచారానికి దిగారు. ఎట్టకేలకు ఊహించని విధంగా కవితను ఓడించి బిజేపీ జెండా ఎగురవేసారు. పికె టీం వ్యూహాలు ఫలించాయని బీజేపీ నేతలు సైతం అంగీకరించారు.
పీకే..జగన్..కేసీఆర్..
ప్రశాంత్ కిషోర్ ఏపీలో జగన్ గెలుపు కోసం వ్యూహకర్తగా పని చేసారు. అదే సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం జగన్ గెలవాలని తన వంతు సహకారం అందించారు. ఇదే సమయంలో కేసీఆర్ కుమార్తెను మాత్రం జగన్ సన్నిహితుడు పికే ఓడించటం కోసం పని చేసారు. దీని పైన కేసీఆర్ ఏ రకంగా స్పందిస్తారనే చర్చ వైసీపీలో జరిగింది. అయితే, కేసీఆర్ మాత్రం ఈ విషయం తేలిగ్గా తీసుకున్నారు. కేవలం నిజామాబాద్లో మాత్రమే కాదు.. మరో మూడు చోట్ల బీజేపీ గెలిచిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ప్రశాంత్ కిషోర్ వృత్తి రీత్యా రాజకీయ వ్యూహకర్త. ఎవరు అగ్రిమెంట్ చేసుకుంటే వారి కోసం పని చేస్తారు..అందులో జగన్కు ఏం ప్రమేయం ఉంటుందని వ్యాఖ్యానించినట్లు సమాచారం. ఇందులో పీకే..జగన్..కేసీఆర్ ముగ్గురూ ప్రాక్టికల్గానే ఉన్నట్లు స్పష్టవవుతోంది. ఎందుకంటే జగన్ ఏపీలో అధికారంలోకి వచ్చిన తరువాత కూడా..ఐ పాక్ టీం సేవలు వినియోగించుకుంటున్నారు.