జైలుకెళ్ళిన ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి జగన్ ప్రోత్సాహం... పారదర్శక పాలన అంటే ఇదేనా? టీడీపీ వ్యూహం
ఓబులాపురం గనుల అవినీతి కేసులో రెండేళ్ల జైలు శిక్ష అనుభవించిన ఐఏఎస్ అధికారిని శ్రీలక్ష్మి విషయంలో జగన్ తీసుకునే నిర్ణయం ప్రతిపక్షాలకు ఆయుధంగా మారనుందా? ఒకపక్క పారదర్శక పాలన అందిస్తాం అని చెప్పిన జగన్, అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న శ్రీ లక్ష్మి వంటి అధికారిణికి ఏపీ ప్రభుత్వంలో అవకాశం కల్పిస్తే అది జగన్ సర్కార్ మెడకు చుట్టుకుంటుందా ? అంటే అవుననే సంకేతాలు కనిపిస్తున్నాయి.
ఏపీ అసెంబ్లీలో ఏం జరుగుతోంది ? ప్రజా సమస్యల పరిష్కారమా ? ప్రతీకారమా ?
జగన్ ను కలిసిన ఐఏఎస్ అధికారిణి శ్రీ లక్ష్మీ .. ఏపీ ప్రభుత్వంతో పని చేస్తానని కోరిన శ్రీ లక్ష్మీ
వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో మైనింగ్ శాఖ కార్యదర్శిగా పనిచేసిన శ్రీ లక్ష్మి అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు. వైయస్ మరణం తర్వాత జగన్ పై నమోదైన అక్రమాస్తుల కేసుల సమయంలో శ్రీ లక్ష్మీ పై ఓబులాపురం గనుల అవినీతి కేసు సిబిఐ నమోదు చేసింది. ఇక ఈ కేసులో శ్రీలక్ష్మి రెండేళ్ల పాటు జైలు శిక్ష అనుభవించింది. దీంతో ఆమె ఆరోగ్యం సైతం క్షీణించి అనారోగ్యం పాలైంది. ఆ తర్వాత ఆమెను రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ రాష్ట్రానికి కేటాయించారు. ఆ తర్వాత తెలంగాణాలో పనిచేస్తున్న శ్రీ లక్ష్మీ పెద్దగా వార్తల్లో లేరు , ఏపీలో జగన్ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తానని జగన్ ను కలిశారు శ్రీ లక్ష్మి .
సానుకూలంగా స్పందించిన జగన్ .. డిప్యుటేషన్ పై పని చేసే అవకాశం
ఆమె విషయంలో సానుకూలంగా స్పందించిన జగన్ ఏపీ ప్రభుత్వంలో అవకాశం కల్పించేందుకు నిర్ణయం తీసుకున్నారు. తన తండ్రి వై ఎస్సార్ సీఎం గా ఉన్న సమయంలో ఆమె వైఎస్ కు అనుకూలంగా పని చేసిన, చెప్పింది చేసిన అధికారిణి అన్న ఆరోపణలు ఉన్నాయి. అవినీతి ఆరోపణల కేసులో కూడా నోరు మెదపకుండా జైలు శిక్ష అనుభవించారు శ్రీ లక్ష్మీ .
ఇక దాంతో ఆమెపై ఆ సాఫ్ట్ కార్నర్ ఉన్న జగన్ ఆమెకు ఏపీ ప్రభుత్వంలో స్థానం కల్పించాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో ఇది తెలంగాణ నుండి, అటు కేంద్ర డీఓపీటీ నుండి క్లియరెన్స్ తీసుకుని ఏపీలో బాధ్యతలు చేపట్టాలని ప్రయత్నం చేస్తున్నారు శ్రీలక్ష్మి. ఏపీ ప్రభుత్వంలో డిప్యూటేషన్ పై ఆమె పని చేసే వీలుంది. ఇక కేంద్రం నుండి క్లియరెన్స్ కోసం వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయ్ సాయి రెడ్డి కూడా స్టీఫెన్ రవీంద్ర, శ్రీలక్ష్మి ల విషయంలో తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే జగన్ ప్రభుత్వం శ్రీ లక్ష్మి విషయంలో తీసుకుంటున్న ఈ నిర్ణయం ప్రతిపక్ష పార్టీ అయినా టిడిపికి ఆయుధంగా మారనుంది అన్న విషయం తెలుస్తోంది.
టీడీపీ ఆయుధంగా శ్రీలక్ష్మీ పోస్టింగ్ వ్యవహారం .. అవినీతి ఆరోపణలున్న అధికారిణితో పారదర్శక పాలన సాధ్యమా ?
అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న, రెండేళ్ల పాటు జైలు శిక్ష అనుభవించిన అధికారిణి శ్రీలక్ష్మి కి అవకాశం ఇవ్వడం, ఏపీ ప్రభుత్వం లోకి ఆమెను తీసుకోవడం పై తెలుగుదేశం పార్టీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేసే అవకాశం ఉంది. అవినీతి అధికారులను ప్రోత్సహించడం ద్వారా వైయస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఎలాంటి పారదర్శక పాలన అందిస్తారు అని ప్రశ్నించడానికి సిద్ధమవుతున్నారు టిడిపి నేతలు. జగన్ అనుకున్నట్టు శ్రీ లక్ష్మిని ఏపీ ప్రభుత్వంలోకి తీసుకుంటే తప్పనిసరిగా జగన్ కు ప్రతిపక్షాల నుండి శ్రీలక్ష్మి విషయంలో విమర్శలు వెల్లువెత్తటం ఖాయం.
మరి శ్రీ లక్ష్మి జగన్ సర్కార్ లో స్థానం సంపాదించుకుంటారా... శ్రీ లక్ష్మి విషయంలో జగన్ నిర్ణయం ఆయనను ఇబ్బంది పెడుతుందా .. లేదా అనేది మాత్రం చూడాల్సి వుంది.