ఓదార్చడానికి వెళితే జగన్ కే ఝలక్ ఇచ్చారా..!!
నందిగామ : ఓదార్పును ఇవ్వడానికి వెళ్లి.. ప్రతిపక్ష నేత జగన్ చేసిన రాజకీయాల ప్రస్తావన.. ఆయనకు ఓ వింత అనుభవం ఎదురయ్యేలా చేసింది. కృష్ణ పుష్కరాల్లో దొర్లిన అపశృతులకు ప్రభుత్వమే కారణమంటూ జగన్ విమర్శిస్తోన్న సమయంలో.. బాధిత కుటుంబ పెద్ద అడ్డుపడ్డట్లుగా తెలుస్తోంది.
కృష్ణా పుష్కరాలకు వెళ్లి.. మృత్యువాత పడ్డ విద్యార్థుల కుటుంబాలను పరామర్శించేందుకు గురువారం అర్థరాత్రి జగన్ నందిగామ వెళ్లిన విషయం తెలిసిందే. ఈ సందర్బంగా.. మృతుడు కూచి లోకేష్ విద్యార్థి కుటుంబాన్ని జగన్ ఓదార్చిన జగన్.. విద్యార్థుల మృతికి ప్రభుత్వ అలసత్వ వైఖరే కారణమంటూ విమర్శలు చేయడం మొదలుపెట్టారు. దీంతో మధ్యలో జోక్యం చేసుకున్న లోకేశ్ బాబాయి హనుమంతరావు .. ఇలాంటి సమయంలో రాజకీయాలెందుకు? అని సున్నితంగా వారించినట్లు తెలుస్తోంది.
జరిగిన దుర్ఘటనలో ప్రభుత్వ వైఫల్యమేమి లేదని.. ఘటనపై మంత్రి దేవినేని ఉమ, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య తక్షణమే స్పందించి సహాయక చర్యలు చేపట్టారని చెప్పుకొచ్చారట హనుమంతరావు. ఇప్పటికే రూ.3లక్షలు ఎక్స్ గ్రేషియాను సీఎం ప్రకటించారని, ఘటన జరిగిన మరుసటి రోజే మంత్రి దేవినేని మొత్తం డబ్బును అందజేశారని చెప్పినట్లు సమాచారం.
ప్రమాదానికి కారణమైన ఇసుక గుంతలు ఈనాటివి కాదని.. వైఎస్ హయాంలో ఇసుక వేలం నిర్వహించడంతో.. ప్రవైటు వ్యక్తులు యథేచ్చగా తవ్వకాలు చేశారని, అందువల్లే గుంతలు ఏర్పడ్డాయని జగన్ తో వివరించారట హనుమంతరావు. అంతేకాదు, బాధిత కుటుంబాలను ఆదుకుంటామని చెబుతోన్న మీరు ఎలాంటి సహాయం అందిస్తారని సదరు బాధిత కుటంబ సభ్యులు జగన్ ను ప్రశ్నించారట.
దీనికి జగన్ వివరణ ఇస్తూ.. అధికారంలోకి వచ్చాక తప్పకుండా ఆదుకుంటామని చెప్పారట. అంతకంటే ముందు తమ పార్టీ నేతలు వచ్చి సహాయం అందిజేస్తారని తెలిపారట జగన్. అయితే ఈ మొత్తం వ్యవహారంలో ఎంతవరకు వాస్తవముందో తెలియదు గానీ ప్రతిపక్ష నేత జగన్ తో మ్రుతుడి బాబాయి ఇలా మాట్లాడంటూ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.