జగన్ ఫెయిల్యూర్, బాబుదే పైచేయి: తెలంగాణతో పోల్చి జోగయ్య ఫైర్
రాజమండ్రి: ఏపీలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి చేరికల పైన మాజీ మంత్రి చేగొండి హరిరామజోగయ్య తనదైన శైలిలో స్పందించారు. జగన్ వైఫల్యంగా, చంద్రబాబు భ్రమలుగా ఆయన అభివర్ణించారు. తెలంగాణలో ఇలాంటి చేరికలు సానుకూల ఫలితాన్ని ఇచ్చినా, ఏపీలో అలా లేదన్నారు.
రెండు రోజుల క్రితం వైసిపి నలుగురు వైసిపి ఎమ్మెల్యేలు, ఓ ఎమ్మెల్సీ టిడిపిలో చేరారు. దీనిపై ఆయన మంగళవారం ఓ లేఖ విడుదల చేశారు. ఈ లేఖలో ఆయన జగన్ పైన ఘాటు వ్యాఖ్యలు చేస్తూ, చంద్రబాబును హెచ్చరించారు.
జగన్ చేతకానితనం వల్లే ఆయన పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు, ఓ ఎమ్మెల్సీ గోడ దూకారన్నారు. తన తండ్రి దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డిలో ఉన్న రాజకీయ చతురత, లక్షణాలు జగన్లో లేనందువల్లే టిడిపి ఆపరేషన్ ఆకర్ష్ కార్యరూపం దాల్చిందన్నారు.
రాజకీయ ఎత్తుగడల్లో జగన్ కంటే చంద్రబాబుదే పైచేయిగా నిలిచిందన్నారు. అదే సమయంలో వైసిపి నుంచి వస్తున్న వలసల కారణంగా తన పార్టీ బలపడుతోందని చంద్రబాబు భావిస్తే అది భ్రమే అవుతుందన్నారు. పార్టీ ఫిరాయింపుల మంత్రం తెలంగాణలో అధికార పార్టీకి సత్ఫలితాలు ఇచ్చిందన్నారు.
అయితే, ఏపీలో ఆ తరహా ఫలితాలు ఉండకపోవచ్చని చెప్పారు. తెలంగామ మాదిరి ఇక్కడ చంద్రబాబు ఆ విధానాలను అనుసరించకపోవడం వల్ల బోల్తాపడుతున్నారన్నారు. వృద్ధులు, వితంతులువులు, వికలాంగుల పింఛన్లు పెంచడం లాంటి కొద్దిపాటి సౌకర్యాలతో కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలకే చంద్రబాబు ప్రాధాన్యమిస్తున్నారన్నారు.
వైయస్ జగన్ అవినీతి ఊబిలో కూరుకుపోయారని చెబుతున్న చంద్రబాబు.. రాష్ట్రంలో అభివృద్ది ముసుగులోను, పట్టిసీమ, రాజధాని పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న విధానం, పెండింగ్ నీటి పారుదల ప్రాజెక్టులను పూర్తి చేసే ముసుగులో అంచనాలు పెంచి కోట్లాది రూపాయలు ఆర్జిస్తున్నారనే అపవాదులు ఎదుర్కొంటున్ననారన్నారు.