వచ్చేస్తోంది జగన్ వదిలిన బాణం: పోటీ అక్కడి నుంచే..?
ఏడాది కాలంగా పాదయాత్ర ముగించుకుని తొలిసారిగా సొంత జిల్లా కడప జిల్లాలో ఏపీ ప్రతిపక్షనేత వైసీపీ అధినేత వైయస్ జగన్ అడుగుపెట్టారు. 2019 సార్వత్రిక ఎన్నికలకు తక్కువ సమయం ఉండటంతో జగన్ అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించారు. ఇప్పటికే పలు చోటు అభ్యర్థులను తానే స్వయంగా ప్రకటించారు. మరికొన్ని చోట్ల అభ్యర్థులపై సమీక్ష జరుపుతున్నట్లు తెలుస్తోంది. కడపలోనే ఉండి జగన్ అభ్యర్థుల కసరత్తు పూర్తి చేస్తారనే సమాచారం. అయితే ముందుగా కడప జిల్లాతోనే అభ్యర్థుల ఎంపికను ప్రారంభించినట్లు తెలుస్తోంది.
కడప జిల్లాపై జగన్ ఫోకస్..జమ్మలమడుగు నుంచి అవినాష్ రెడ్డి?
కడప జిల్లాపై వైసీపీ అధినేత వైయస్ జగన్ ఫోకస్ పెంచారు. సొంత జిల్లాలో 10 అసెంబ్లీ నియోజకవర్గాలు, రెండు పార్లమెంటరీ స్థానాలు ఉండగా... పదికి పది అసెంబ్లీ స్థానాలు, రెండు లోక్సభ స్థానాలు వైసీపీ ఖాతాలోకి చేరాలన్న కృతనిశ్చయంతో కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. 2014 ఎన్నికల్లో కడప జిల్లాలో వైసీపీ 9 అసెంబ్లీ స్థానాలు సొంతం చేసుకోగా రెండు పార్లమెంటు స్థానాల్లో విజయం సాధించింది. కడప జిల్లాలో జమ్మలమడుగు నియోజకవర్గం చాలా ఆసక్తికరంగా మారింది. 2014లో వైసీపీ నుంచి గెలిచి ఆ తర్వాత టీడీపీలోకి జంప్ అయిన మంత్రి ఆదినారాయణ రెడ్డి ఇక్కడ ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. దీంతో జమ్మలమడుగు నియోజకవర్గ ఇంఛార్జిగా ఎంవీ సుధీర్ రెడ్డి బాధ్యతలు తీసుకున్నారు. తాజాగా జమ్మలమడుగు నియోజకవర్గం పై జగన్ దృష్టి సారించినట్లు సమాచారం. బలమైన ఆదినారాయణ రెడ్డి కుటుంబాన్ని ఢీకొట్టేందుకు బరిలోకి జగన్ సోదరుడు కడప మాజీ ఎంపీ అవినాష్ రెడ్డిని బరిలో దింపనున్నట్లు సమాచారం.
కడప లోక్సభ స్థానం నుంచి వైయస్ షర్మిళ..?
అవినాష్ రెడ్డి జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గానికి పరిమితమైతే ఇప్పుడు కడప లోక్సభ స్థానం నుంచి ఎవరు పోటీచేస్తారనే ప్రశ్న ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలోనే తెరపైకి వైయస్ కుటుంబానికి చెందిన మరో వ్యక్తి పేరు రాజకీయ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. కడప పార్లమెంటు స్థానం నుంచి వైయస్ షర్మిళను పోటీ చేయించేందుకు జగన్ రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. అదే సమయంలో షర్మిళకు రాయలసీమ బాధ్యతలు అప్పగించాలని జగన్ భావిస్తున్నారట. ఇటు షర్మిళను పార్లమెంటుకు పంపడం ద్వారా అక్కడ ఒక మహిళకు ప్రాధాన్యం కల్పించడమే కాకుండా రాష్ట్ర ప్రజల వాయిస్ ఆమె బలంగా వినిపిస్తారని కొందరు వైసీపీ సీనియర్లు జగన్కు సూచించడంతో ఆయన ఇందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.
పార్లమెంటుకు షర్మిళ వెళితే ప్లస్ పాయింట్
మరోవైపు ఢిల్లీలో పార్టీ వ్యవహారాలు కూడా షర్మిళ చక్కబెడతారనే ఒపీనియన్తో జగన్ ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఢిల్లీ వ్యవహారాలను రాజ్యసభ సభ్యులు విజయ్ సాయిరెడ్డి ఒక్కరే చూస్తున్నారు. ఒకవేళ 2019 ఎన్నికల తర్వాత వైసీపీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో జగన్, ఢిల్లీలో షర్మిళ ఉంటారనే మాటను కూడా వైసీపీ నేతలు చెబుతున్నారు. ఇక ముఖ్య విషయం ఏమిటంటే కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో తెలియదు కాబట్టి పెండింగ్లో ఉన్న జగన్ కేసులు భవితవ్యం ఎలా ఉంటుందో ఇప్పుడప్పుడే చెప్పలేని పరిస్థితి. కేసుల విషయంలో ఏదైనా జరిగినా ఆ సమయంలో షర్మిళ ఉంటారు కాబట్టి అది కూడా పార్టీకి కలిసి వస్తుందనే అంచనా వేస్తున్నారు సీనియర్లు.
పోటీకి ఆసక్తి కనబర్చని షర్మిళ..కన్విన్స్ చేసే ప్రయత్నంలో జగన్
అదే సమయంలో షర్మిళ, జగన్ల మధ్య పొరపొచ్చాలు వచ్చాయని టీడీపీ ప్రచారం చేస్తున్న నేపథ్యంలో షర్మిళను కడప పార్లమెంటరీ స్థానం నుంచి బరిలోకి దింపి ఇలాంటి ప్రచారాలకు చెక్ పెట్టాలని వైసీపీ అధినేత భావిస్తున్నట్లు సమాచారం. ఇంతవరకు బాగానే ఉన్నా... అసలు పోటీపై షర్మిళ ఆసక్తిగా లేరని సమాచారం. కానీ అన్న మాట ఎప్పుడూ జవదాటనని షర్మిళ పలు ఇంటర్వ్యూలలో చెప్పారు. జగన్ కూడా పోటీపై ఆమెను కన్విన్స్ చేస్తారనే ప్రచారం వైసీపీ వర్గాల్లో జోరుగా జరుగుతోంది. జగన్ జైలులో ఉన్న సమయంలో షర్మిళ పార్టీ బాధ్యతలు భుజాన వేసుకుని పాదయాత్ర చేశారు. జగనన్న విసిరిన బాణాన్ని, రాజన్న బిడ్డను అని చెబుతూ తన పాదయాత్రను ప్రారంభించారు. రెండువేలకు పైగా ఆమె పాదయాత్ర చేశారు. ప్రజలతో మమేకమయ్యారు కాబట్టి షర్మిళను ప్రజలు ఆదరిస్తారని వైసీపీ సీనియర్ నాయకులు వెల్లడిస్తున్నారు.