కేసీఆర్ మద్దతు దేనికి : బేరాలు అడిందెవరు : పవన్ ఎన్ని సార్లు కలిసాడు : జగన్ ఫైర్..!
తనకు..కేసీఆర్ మధ్య ఒప్పందం ఉందని..తనకు వెయ్యి కోట్లు ఇచ్చారనే చంద్రబాబు ఆరోపణల పై వైసిపి అధినేత జగన తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ఓట్ల కోసం ప్రజల్లో భావోద్వేగాలు రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. తెలంగాణ లో ఏపి ప్రజలు ఉన్నారనే స్పృహ లేకుండా వ్యవహరిస్తున్నారన్నారు. హరికృష్ణ మృతదేహం వద్ద కేటీఆర్ తో బేరాలు ఆడిందెవరని ప్రశ్నించారు.
నాకు వెయ్యి కోట్లు ఇచ్చారా..
కొద్ది రోజులుగా టిడిపి అధినేత చంద్రబాబు వైసిపి అధినేత జగన్ కు తెలంగాణ ముఖ్యమంత్రి వెయ్యి కోట్లు ఇచ్చారని చేస్తున్న ప్రచారం పై తొలి సారిగా స్పందించారు. తాడిపత్రి లో ఎన్నికల ప్రచార సభలో జగన్ దీని పై చంద్రబాబును నిలదీసారు. కేసీఆర్ తనకు వెయ్యి కోట్లు ఇచ్చారని చంద్రబాబు..ఆయన పార్టనర్ మాట్లాడుతున్నారని అసలు వారికి సిగ్గు ఉందా అని నిలదీసారు. ఆయన వెయ్యి కోట్లు ఇస్తే మీరు చూసారా...లేక, మీకు కేసీఆర్ ఫోన్ చేసి చెప్పారా అని ప్రశ్నించారు. వయస్సుకు గౌరవం లేకుండ నిస్సిగ్గుగా అబద్దాలు ఆడుతున్నారని విరుచుకుపడ్డారు. దిక్కుమాలిన రాజకీయాలు చంద్రబాబు చేస్తున్నారని..తాను అయిదేళ్ల కాలంలో చేసిన అభివృద్దిని చెప్పుకోలేక అబద్దాలు..కుట్రలు ..మోసాలను నమ్ముకున్నారని ఆరోపించారు.
హోదాకు మద్దతిస్తుంటే ఏంటి బాధ..!
కేసీఆర్ హోదాకు మద్దతిస్తుంటే ఎందుకు ఈ బాధ అని జగన ప్రశ్నించారు. దీని పై చంద్రబాబుకు అభ్యంతరం ఎం దుకని నిలదీసారు. హోదా కు పొరుగు రాష్ట్ర ప్రభుత్వాలు మద్దతివ్వకూడదా అని ప్రశ్నించారు. హరికృష్ణ మృతదే హం వద్ద కేటీఆర్ తో పొత్తుల బేరాలు ఆడిందెవరని నిలదీసారు. మీతో పొత్తు పెట్టుకుంటే వారు మంచివాళ్లు..లేకుంటే ద్రోహులా అన్నారు. జాతీయ స్థాయిలో ఒకరికి ఒకరు తోడు ఉంటే రాష్ట్ర హక్కులు కాపాడుకోవచ్చని ఫెడరల్ ఫ్రంట్ పై చర్చలు చేసారని గుర్తు చేసారు. ఓటుకు నోటు లో హైదరాబాద్ నుండి పారిపోయి వచ్చారని విమర్శించారు. అక్కడ ఏపి ప్రజలు ఉన్నారనే జ్ఞానం లేకుండా చంద్రబాబు మాట్లాడుతున్నారని ఆరోపించారు.
పవన్..కేసీఆర్ ను ఎన్నిసార్లు కలిసాడు..
ముఖ్యమంత్రి మాట్లాడగానే..యాక్టర్ సైతం మాట్లాడుతారని అసలు యాక్టర్ కేసీఆర్ ను ఎన్ని సార్లు కలిసారో తెలుసా అని ప్రశ్నించారు. ఏపి ప్రజలను ..పారిశ్రామిక వేత్తలను బెదిరిస్తున్నారని బాబు చెబుతున్నారని..రామోజీరావు తో పాటుగా రాధాకృష్ణ ను బెదిరించారా అని నిలదీసారు. రాజకీయాల కోసం భావోద్వేగాలు సృష్టిస్తున్నారని..అక్కడ మన వాళ్లకు అపకారం చేస్తున్నారని మండిపడ్డారు. అయిదేళ్లు సీయంగా ఉన్న వ్యక్తి పాలన గురించి చెప్పి ఓట్లు వేయమని అడగలేని దుస్థితిలో ఉన్నారని ఎద్దేవా చేసారు. జగన్ అధికారంలోకి వస్తే ఏదో జరిగిపోతుందని అబద్దాలు చెబుతూ పాలన మీద నుండి దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. తన చిన్నాన్న ను చంపించి..తన పోలీసులతో విచారణ చేయిస్తాడని..వక్రీకరించి బురద జల్లుతున్నారని ఆరోపించారు. ప్రజలను రెచ్చగొట్టి ఓట్లు దండుకొనే దిక్కు మాలిన ఆలోచనలు చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు.