యువతను మెప్పించిన జగన్: నాలుగు లక్షల మందికి ఉపాధి.. గ్రామాల్లో వైసీపీ బలోపేతమే లక్ష్యమా?
ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన జగన్ ఆ వెంటనే గ్రామ వాలంటీర్లను..గ్రామ సచివాలయంలో ప్రభుత్వ ఉద్యోగుల నియామకం గురించి కీలక ప్రకటన చేసారు. నాలుగు లక్షల మందికి గ్రామాల్లో వాలంటీర్లుగా నియమిస్తూ వారి ద్వారా పధకాల డోర్ డెలివరీ ఇస్తామని ప్రకటించారు. అదే విధంగా ప్రతీ గ్రామ సచివాలయంలో పది మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని వెల్లడించారు. ఇందులో ఇప్పుడు రాజకీయ వ్యూహమూ ఉంది.
నాలుగు లక్షల ఉద్యోగాలు..డోర్ డెలివరీ..
ప్రభుత్వం అమలు చేసే పధకాలను నేరుగా లబ్దిదారులకు అందించేందుకు ప్రతీ యాభై ఇళ్లకు ఒక వాలంటీర్ను నియమిస్తామని జగన్ ప్రకటించారు. గ్రామాల్లో చదువుకున్న వారిని గ్రామాల్లో గుర్తించి అక్కడి యువతకు గ్రామ వాలంటీర్లుగా రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు లక్షల మందిని నియమిస్తామని స్పష్టం చేసారు. వ్యవస్థల్లో లంచాలు లేకుండా చేసేందుకే వీరి నియామకమన్నారు. సేవా దృక్పథం ఉన్న పిల్లలకు వేరే చోట ఉద్యోగం వచ్చేదాకా గ్రామ వాలంటీర్లుగా పని చేయవచ్చని వివరించారు. ప్రభుత్వ పథకాలు ఎవరికీ అందకపోయినా.. పొరపాటునైనా లంచాలు తీసుకుంటున్నారని తెలిసినా, వివక్ష కనిపించినా నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫోన్ చేయవచ్చని స్పష్టం చేసారు.
గ్రామ సచివాలయాల్లో పది మందికి..
తమ పాలనలో అవినీతికి చోటు ఉండదని జగన్ ధీమా వ్యక్తం చేసారు. పెంచిన పెన్షన్లను ఈ జూన్ నుండే అమల్లోకి తెస్తామని ప్రకటించిన జగన్..ఆగస్టు 15 నాటికి గ్రామ వాలంటీర్లుగా నాలుగు లక్షల మందిని నియమిస్తామని ప్రకటించారు. ప్రతీ గ్రామంలో సచివాలయం పది మంది చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ 2 నాటికి మరో లక్షా అరవై వేల ఉద్యోగాలు ఇస్తామని స్పష్టం చేసారు. వీరి ద్వారా దరఖాస్తు చేసుకున్న వారికి 72 గంటల్లోనే అర్హులకు పధకాలు అందిస్తామని వెల్లడించారు. వీరి కోసం సీఎం కార్యాలయంలో కాల్ సెంటర్ ఏర్పాటు చేస్తామని స్పష్టం చేసారు. జగన్ తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా ఉద్యగ కల్పనతో పాటుగా రాజకీయ ప్రయోజనమూ ఉంది.
గ్రామాల్లో పూర్తి పట్టు..రాజకీయంగా
జగన్ తీసుకున్న ఈ రెండు నిర్ణయాల ద్వారా వాలంటీర్లు..గ్రామ సచివాలయాల ద్వారా గ్రామాల్లో ప్రతీ ఇంటి తోనూ ..లబ్ది దారుడి తోనూ వీరికి ప్రత్యక్ష సంబంధాలు ఏర్పడుతాయి. రాజకీయాలకు అతీతంగా వీరిని ఎంపిక చేయటం ద్వారా ప్రస్తుతం లబ్ది చేస్తున్న వారి వైపే ఎక్కువా మొగ్గు చూపుతారు. వారంతా ఒక రకంగా అధికా పార్టీకి వాలంటీర్లుగా మారుతారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు..క్షేత్ర స్థాయిలో బలమైన కేడర్ ఉన్న టీడీపీని దెబ్బ తీయటానికి ఈ కొత్త నిర్ణయాలు..నియామకాలు దోహదం చేస్తాయని అంచనా వేస్తున్నారు. జగన్ తన ప్రమాణ స్వీకారం నాటి నిర్ణయాల ద్వారానే టార్గెట్ 2023 ప్రారంభించారు.