బాలయ్య టార్గెట్ గా రాయలసీమపై ఫోకస్ పెట్టిన జగన్ ... టీడీపీలో టెన్షన్
గత సార్వత్రిక ఎన్నికల్లో రాయలసీమలో వైసీపీ హవా కొనసాగింది. కడప, కర్నూలు జిల్లాలలో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. ఇక చిత్తూరు జిల్లాలోని మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, హిందూపూర్ లో నందమూరి బాలకృష్ణ, ఉరవకొండ లో పయ్యావుల కేశవ్ లు మినహాయించి మిగతా దాదాపు అన్ని స్థానాలను వైసిపి కైవసం చేసుకుంది. టిడిపి ఊహించని విధంగా వచ్చిన ఫలితాలను చూస్తే రాయలసీమలో టిడిపి పరిస్థితి ఏ విధంగా తయారయిందో అర్థం చేసుకోవచ్చు. గత ఎన్నికల ఫలితాలు కాదు, భవిష్యత్ ఎన్నికల్లో కూడా రాయలసీమలో టీడీపీ లేకుండా చేయడానికి వైసిపి అధినేత, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కంకణం కట్టుకున్నారు. అందుకోసం సీమ పైన ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు జగన్మోహన్ రెడ్డి.
ఎన్నికల ప్రచారంలోకి బాలకృష్ణ: హుజూర్ నగర్ లో సందడి: బావ మాట కోసం..!
గత ఎన్నికల్లో టీడీపీకి రాయలసీమలో ఎదురు దెబ్బ
గత ఎన్నికల్లో చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం నుండి పోటీచేసిన ఏపీ మాజీ సీఎం చంద్రబాబు సైతం ఊహించని విధంగా అతి తక్కువ మెజార్టీతో గెలుపొందారు. ఆయన సైతం అక్కడ ఎదురీదాల్సివచ్చింది. ఇక ప్రతి చోటా అభాసు పాలైన టిడిపి నేతలు ఇప్పుడు సైలెంట్ గా ఉన్నారు. వారిలో ఏమాత్రం కనిపించలేదు. ప్రస్తుత రాయలసీమలో టిడిపి అస్తిత్వం కోసం పోరాడుతున్న పరిస్థితి. ఇకపోతే వైసీపీ అధినేత జగన్ రాయలసీమ హస్తగతం చేసుకోవాలని తీవ్రంగా ప్రయత్నాలు సాగిస్తున్నారు. టీడీపీ శ్రేణుల నైరాశ్యాన్ని ఆయన తమ పార్టీకి అనుకూలంగా మార్చుకుంటున్నారు.
ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావులను టార్గెట్ చేసిన వైసీపీ
గతంలోనే ఉరవకొండ టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ను టీడీపీకి గుడ్ బై చెప్పించాలని అనుకున్నారు. ఆయన సైతం పార్టీ మారేందుకు సంసిద్దులు అయ్యారనే వార్తలు వినిపించాయి. అయితే పయ్యావుల కేశవ్ పార్టీ మారకుండా చంద్రబాబు చాలా చాకచక్యంగా ప్రవర్తించారు. చంద్రబాబు పయ్యావుల కేశవ్ కు ప్రోట్కాల్ ఉండే ప్రతిపక్షానికి ఇచ్చేటువంటి పీఏసీ ఛైర్మన్ పదవిని కట్టబెట్టారు. దీంతో పయ్యావుల కేశవ్ సైలెంట్ గా ఉన్నారు. ప్రస్తుతం ఆయన టిడిపికే జై కొడుతున్నారు.
బాలయ్య టార్గెట్ గా పావులు కదుపుతున్న వైసీపీ
ఇకపోతే ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ పరిస్థితి బాగోకపోయినా, జిల్లాలో పార్టీ పరిస్థితి మరీ దయనీయంగా మారినా అవేమీ పట్టనట్టు సినిమాల్లో బిజీగా ఉన్న హిందూపూర్ ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ ను టార్గెట్ అంటున్నారు వైసిపి నాయకులు. ఎమ్మెల్యేగా బాలయ్య నియోజకవర్గంపై పెద్దగా దృష్టి పెట్టకపోవడం, పైగా హిందూపూర్ నియోజకవర్గంలో మైనార్టీల ప్రాబల్యం ఎక్కువగా ఉండడం వంటి అంశాలు వైసిపికి కలిసి వచ్చేలా ఉన్నాయి.గత ఎన్నికల్లో బాలకృష్ణపై పోటీకి మైనార్టీ వర్గానికి చెందిన, రాయలసీమ రేంజ్ మాజీ ఐజీ మహమ్మద్ ఇక్బాల్ను నిలబెట్టినప్పటికీ ఆయన ఓటమి పాలయ్యారు.
మైనార్టీలకు ప్రాధాన్యత ఇస్తూ బాలయ్యకు చెక్ పెట్టే వ్యూహం
ఈ నేపథ్యంలో అక్కడ మైనార్టీలకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చాలా ప్రాధాన్యతను ఇస్తుంది అని తెలియజేయడం కోసం ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇక్బాల్కు ప్రజాప్రతినిధుల కోటాలో ఎమ్మెల్సీ పదవిని ఇచ్చి సముచిత స్థానం ఇచ్చారు. ఇక అంతే కాదు ఇక్బాల్ కు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం ద్వారా స్థానికంగా ఉన్న ముస్లిం మైనారిటీ లలో ఒక సానుకూల దృక్పధాన్ని తీసుకువచ్చారు. దీంతోపాటు టీడీపీలో ఉండే ద్వితియ శ్రేణి కార్యకర్తలను సైతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు. ఎక్కడికక్కడ వ్యూహాత్మకంగా బాలయ్య బాబుకు చెక్ పెట్టడానికి సీఎం జగన్మోహన్ రెడ్డి పావులు కదుపుతున్నారు.
సినిమాల్లో బాలయ్య బిజీ .. టీడీపీ శ్రేణుల్లో టెన్షన్
బాలయ్య మాత్రం అవేవీ పట్టనట్టుగా సినిమాల్లో తెగ బిజీ అయిపోయారు. ఇప్పటికైనా బాలయ్య స్పందించకుంటే, నియోజకవర్గంపై దృష్టి సారించకుంటే రాజకీయ భవితవ్యం దెబ్బతినే పరిస్థితి కనిపిస్తోంది. ఇక త్వరలోనే మున్నిపల్ ఎలక్షన్స్ రానున్నాయి. ఈ నేపథ్యంలో వైసిపి రాయలసీమలో క్లీన్ స్వీప్ చేయాలని పక్కా వ్యూహంతో ముందుకు వెళుతోంది. ఇందుకోసం బాలయ్య బాబుకు చెక్ పెట్టాలని చూస్తోంది. మరి రాయలసీమలో గత చారిత్రక వైభవాన్ని తిరిగి దక్కించుకోవడానికి ప్రయత్నం చేస్తుందా? లేక మరోమారు వైసీపీ చేతిలో చావు దెబ్బ తింటుందా అనేది త్వరలోనే తేలనుంది. ఇక జగన్ రాయసీమపై ఫోకస్ పెట్టిన నేపధ్యంలో టీడీపీ నేతల్లో టెన్షన్ మొదలైంది.