మీడియా మేనెజ్ మెంట్.. జగన్ వర్సెస్ టీడీపీ : "త్వరలో కొత్త న్యూస్ ఛానెల్స్"
విజయవాడ : ప్రధాన రాజకీయ పార్టీలన్ని ఈరోజుల్లో పత్రికలను, ఛానెల్స్ ను మెయింటెయిన్ చేయడం సర్వసాధారణంగా మారిపోయింది. ముఖ్యంగా పార్టీ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి, జనంలో పార్టీ మైలేజ్ ను పెంచడానికి, ప్రతికూల పరిస్థితుల్లో ప్రజల్లో పార్టీల పట్ల స్థిరభిప్రాయం చెదిరిపోకుండా ఉండడానికి ఆయా పార్టీల తరుపున పత్రికలు, చానెల్స్ చాలానే కసరత్తులు చేస్తాయి.
ఒకరకంగా, ఆయా పార్టీల గొంతుకగా వ్యవహరిస్తాయి సదరు మీడియా సంస్థలు. ఏపీ రాజకీయాలను పరిశీలిస్తే, అధికార పక్షం టీడీపీకి ఉన్న మీడియా మేనెజ్ మెంట్, వైసీపీకి లేదు. దీంతో ప్రతిపక్ష వాదనలకు మీడియాలో అంతగా ఫోకస్ ఉండట్లేదన్న అసంతృప్తిలో ఉన్నారట జగన్. ఈ పరంపరకు ఫుల్ స్టాప్ పెట్టి టీడీపీ మీడియా మేనేజ్ మెంట్ కు గట్టి పోటీ ఇవ్వడానికి ఇప్పుడున్న సాక్షికి తోడుగా మరో మూడు కొత్త న్యూస్ ఛానెల్స్ ను ప్రారంభించాలనే యోచనలో ఉన్నారట.
ఈ నేపథ్యంలోనే జగన్ కొత్త ఛానెళ్ల ఏర్పాటుకు సంబంధించిన కసరత్తులు కూడా ఇప్పటికే మొదలయ్యాయన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పటిదాకా తెలియవస్తున్న వివరాల ప్రకారం మాజీ కేంద్రమంత్రి దాసరి నారాయణరావు, ఎంపీ మిథున్ రెడ్డి, మరో ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి కుమారుడు గౌతం రెడ్డి ఆధ్వర్యంలో ఈ కొత్త ఛానెల్స్ ఆవిర్భవించబోతున్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి.
చాలాకాలంగా వైసీపీ తరుపున ఒంటరి పోరాటం చేస్తోన్న సాక్షి కోవలో ఇప్పుడు ఈ కొత్త ఛానెల్స్ కూడా జగన్ తరుపున గొంతెత్తనున్నాయని తెలుస్తోంది. ఏదేమైనా కొత్త ఛానెల్స్ ఏర్పాటు ద్వారా ఏపీలోని కొంతమంది నిరుద్యోగ యువతకైనా ఉపాధి లభించే అవకాశం కలగనుంది.