వైఎస్ బాటలో జగన్, ప్రజల సమస్యలు వినేందుకు ‘ప్రజా దర్బార్’
అమరావతి : రాజన్న కొడుకు జగన్ అచ్చం తండ్రి పోలికే. తండ్రి రాజకీయాన్ని నరనరాన ఒంటబట్టించుకున్న జగన్ .. ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషిచేస్తుంటారు. ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు గడప గడప తిరిగి మరీ ప్రజల సమస్యను తెలుసుకున్నారు. ఇటీవల భారీ మెజార్టీతో అధికారం చేపట్టారు జగన్. కానీ ప్రజలతో మాత్రం తన అనుబంధాన్ని ఎప్పటిలానే కొనసాగిస్తున్నారు. సీఎంగా ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకునేందుకు వారిని కలువాలని నిర్ణయించుకున్నారు.
ప్రజాదర్బార్ ..
జగన్ ప్రజాకర్షక నేత. అందులో ఇసుమంతైన సందేహం లేదు. ఓదార్పు యాత్రతో ప్రజలను కలిసి వారి బాగోగులు తెలుసుకున్నారు జగన్. అప్పటినుంచి ప్రజలతో ఏదో అంశం మీద కలుస్తూనే ఉన్నారు. ప్రజా సంకల్ప యాత్రతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా తిరిగి ప్రతి ఇంట్లో ఉన్న సమస్యను అర్థం చేసుకున్నారు. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టే ప్రజలు పట్టం కట్టారు. తాను సీఎం అయ్యాక .. అధికారులతో సమీక్షలు అని హడావిడి చేయకుండా ప్రజలతో తన అనుబంధాన్ని కొనసాగించాలని భావించారు. అందుకోసం ప్రజాదర్బార్ నిర్వహించాలని నిర్ణయించారు జగన్. అమరావతిలోని సీఎం క్యాంపు ఆఫీసులో ప్రతిరోజు అరగంట పాటు ప్రజలు కలిసే అవకాశాన్ని కల్పిస్తారు. దీంతో పౌరులు తమ ఇబ్బందులు, సమస్యలను వెంటనే పరిష్కారం చేసే వీలవుతుంది. అక్కడికక్కడే అధికారులకు ఆదేశాలు జారీచేసి సమస్య పరిష్కారం అవడంతో ప్రజలకు సుపరిపాలన అందుతుందని జగన్ భావిస్తున్నారు. ఏవైనా ఇబ్బందులు ఉంటే వాటిని సంబంధితత శాఖ అధికారులు పరిష్కరించాలని ఆదేశిస్తారు.
అంతకుముందు కూడా..
జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో కూడా పులివెందులలో ప్రజాదర్బార్ నిర్వహించేవారు. అక్కడికి పులివెందులతోపాటు ఇతర ప్రాంతాలకు చెందిన వారు కూడా వచ్చి తమ సమస్యను చెప్పుకునేవారు. ఇప్పుడు సీఎం అయ్యాక ప్రజాదర్బార్ను పులివెందుల నుంచి అమరావతికి మార్చారు జగన్.
వైఎస్ఆర్ కూడా ..
ఇదివరకు వైఎస్ఆర్ సీఎంగా ఉన్న సమయంలో కూడా ప్రజాదర్బార్ నిర్వహించారు. ఉమ్మడి రాష్ట్రంలో క్యాంపు ఆఫీసులో ప్రజలకు అందుబాటులో ఉండేవారు వైఎస్ఆర్. ప్రతిరోజు ఉదయం 6 గంటలకు ప్రజలను కలుసుకునేవారు రాజశేఖర్ రెడ్డి. వారి సమస్యలను సావధానంగా విని .. పరిష్కారమయ్యే ఇష్యూను వెంటనే సాల్వ్ చేసేవారు. రాజన్న లానే జగన్ కూడా ప్రజాదర్బార్ నిర్వహిస్తూ తండ్రిని మించిన కుమారుడు అనే పేరు తెచ్చుకోనున్నారు. ఇప్పటికే పాలనపరంగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్న జగన్ .. ప్రజాదర్బార్ మరింత మంచి నిర్ణయమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఆద్యుడు ఎన్టీఆర్
దేశంలో అత్యంత ప్రజాధారణ కలిగిన నేతల్లో వైఎస్ఆర్, ఎన్టీఆర్. నందమూరి తారకరామారావు సినీరంగం నుంచి వస్తే .. ప్రజల నుంచి వచ్చిన రాజశేఖర్ రెడ్డి ప్రజాకర్షక గల నేతగా ఒదిగారు. ప్రజాదర్బార్ కార్యక్రమానికి ఆద్యుడు ఎన్టీఆర్. ఆయన సీఎంగా ఉన్న సమయంలో ప్రజలను కలిసేవారు. అయితే అప్పటి సమయం, టెక్నాలజీ తక్కువగా ఉండటంతో సీఎంను కలిసే జనం కూడా తక్కువే. కానీ వైఎస్ఆర్ హయాంలో ప్రజాదర్బార్ పేరొందింది. ఇప్పుడు జగన్ దానికి పూర్వపు స్థితిని తీసుకొస్తున్నారు. వైఎస్ఆర్ తర్వాత రాష్ట్రంలో ప్రజాదర్బార్ అనే పేరే లేకుండా పోయింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న .. తమ సీటును కాపాడుకునేందుకు నేతలు ప్రిపరెన్స్ ఇచ్చారే తప్ప .. ప్రజా సమస్యలను పరిష్కరించే ఓపిక వారికి లేకుండా పోయింది.
నో ఏపీ, నో తెలంగాణ
రాష్ట్ర విభజన తర్వాత కూడా ప్రజాదర్బార్ అనే మాటను మరచిపోయారు నేతలు. ఏపీలో చంద్రబాబు అధికారం చేపట్టి ఐదేళ్లు పాలించారు. కానీ ప్రజలతో ఎప్పుడూ ప్రత్యక్షంగా మమేకం కాలేదు. పార్టీ నేతలు, మంత్రులు, అధికారులతో సమీక్షలు మాత్రం చేశారు. పార్టీపరంగా యాక్టివ్గా ఉన్న ప్రజలను క్యాంపు ఆఫీసు వద్దకు పిలిపించుకొని మాట్లాడిన దాఖలాలు లేవు. ఇటు తెలంగాణలో కూడా దాదాపు అలాంటి పరిస్థితే. సీఎం కేసీఆర్ తన క్యాంపు ఆఫీసులో జనంతో కలిసిన సందర్భాలు తక్కువే. కాకుంటే సీఎం క్యాంపు ఆఫీసు వద్ద ప్రజలు మాత్రం క్యూ కడుతుంటారు. ఎందుకంటే ఇక్కడ ఆరోగ్యశాఖ అధికారులు ఉంటారు. తెల్లరేషన్ కార్డు లేని పేదలకు ఏదైనా అనారోగ్యం వాటిల్లితే ఇక్కడ ఆరోగ్య శ్రీ తాత్కాలిక కార్డు ఇస్తారు. దీంతో ఇక్కడికి రోగులు, బంధువులు వస్తుంటారు. వారికి అధికారులు సాయం అందిస్తారు. కానీ సీఎం మాత్రం ప్రజలతో కలిసి మాట్లాడలేదు.