300 కీలక పదవులన్నీ సొంత సామాజిక వర్గానికే .. జగన్ నినాదం వంచనే : యనమల
ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. అసెంబ్లీలో అధికార వైసిపి, ప్రతిపక్ష టీడీపీ ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఏపీ అసెంబ్లీ లో అధికార పార్టీ తీరుపై టిడిపి నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏపీ శాసన సభ జరుగుతున్న తీరు సీఎం జగన్మోహన్ రెడ్డి అహంభావానికి అద్దం పడుతుందని విమర్శలు గుప్పిస్తున్నారు. టిడిపి సీనియర్ నేత మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు శాసనసభ సమావేశాలను ఉద్దేశించి మాట్లాడుతూ జగన్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు.
జగన్ నినాదం వంచన అని విమర్శించిన యనమల
జగన్ నినాదం వంచన చేయడమని ఆయన దుయ్యబట్టారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో పాలనా వైఫల్యాలను అసెంబ్లీ వేదికగా టీడీపీ ఎండగట్టిందని యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి తమ ప్రభుత్వంలోని కీలక పదవులు అన్నీ సొంత సామాజిక వర్గానికి కేటాయించి, బలహీన వర్గాలకు ప్రాధాన్యత లేని పదవులను అప్పగించారని యనమల ఆరోపించారు.
300కు పైగా పదవులు రెడ్డి సామాజిక వర్గానికి ఇచ్చారని జీవోలే చెప్తున్నాయన్న యనమల
300కు పైగా పదవులు రెడ్డి సామాజిక వర్గానికి ఇచ్చారని జీవోల ద్వారా వెల్లడి అవుతుందని ఆయన పేర్కొన్నారు. 50 శాతం పదవులు బడుగు బలహీన వర్గాలకు కేటాయిస్తానని చెప్పిన జగన్ మోహన్ రెడ్డి బడుగులను వంచించారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దిశ బిల్లు తెచ్చాక కూడా రాష్ట్రంలో అత్యాచారాలు జరగడం హేయమైన చర్య అని ఆయన పేర్కొన్నారు. ఇక అత్యాచారాలకు పాల్పడిన వారిపై ప్రభుత్వ ఏం చర్యలు తీసుకుందో చెప్పాలని ఆయన నిలదీశారు .
చంద్రబాబు హయాంలో అన్ని సామాజిక వర్గాలకు న్యాయం
ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగులు వేస్తున్నారని, మీడియా పైన కూడా ఆంక్షలు విధిస్తూ జీవోలు ఇస్తున్నారని పేర్కొన్న యనమల రామకృష్ణుడు మీడియాపై ఆంక్షల జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సొంత సామాజిక వర్గానికి అత్యంత ప్రాధాన్యతనిస్తున్నారని జగన్ తీరును యనమల రామకృష్ణుడు ఎండగట్టారు. ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్న సమయంలో అన్ని సామాజిక వర్గాలకు చంద్రబాబు న్యాయం చేశారని చెప్పారు యనమల .
సొంత సామాజిక వర్గానికే కీలక పదవుల పట్టం కడుతున్నారని మాజీమంత్రి విమర్శలు
గతంలో చంద్రబాబు హయాంలో ఇచ్చిన కొన్ని పదవులను లక్ష్యంగా చేసుకుని కమ్మ సామాజిక వర్గానికి న్యాయం చేస్తున్నారని పదే పదే జగన్ ఆరోపణలు గుప్పించారు. ఏకంగా కమ్మ సామాజికవర్గ అధికారులకు పదోన్నతులు ఇచ్చారని ఢిల్లీ వెళ్లి మరీ జగన్ ఆరోపించిన రోజులు ఉన్నాయని ఇప్పుడు జగన్ చేస్తుంది ఏంటి అని ప్రశ్నించారు యనమల. మరి ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీలో, ప్రభుత్వంలో కీలక పదవులను ఆయన సొంత సామాజికవర్గానికి చెందిన రెడ్డి సామాజిక వర్గానికే అప్పగిస్తున్నారని యనమల పేర్కొన్నారు.