ఒక్క విజయం..ఒకటే సమాధానం : ఢిల్లీ నుండి గల్లీ నేతల వరకూ : జగన్ ప్రత్యర్దుల్లో టెన్షన్..!
జగన్. రాజకీయాల్లో ఇప్పుడు ఒక సంచలనం. 40 ఏళ్ల అనుభవానికి చుక్కలు చూపించిన యువనేత. తండ్రి మరణం తరువాత రాజకీయంగా ప్రతీ అడుగు ముళ్లబాటలోనే సాగించారు. తండ్రి ఛరిష్మాతో తమకు వైయస్ తరహాలో ఎక్కడ పోటీ వస్తారో అనే భయంతో ఎంతో మంది అడడిని చుట్టు ముట్టారు. అందరికీ ఒకటే సమాధానం చెప్పాడు. ఢిల్లీ నుండి గల్లీ వరకు ఉన్న తన ప్రత్యర్ధులకు మైండ్ బ్లాక్ అయ్యేలా చేసాడు. ఇదీ తన సత్తా అని చాటాడు..
2009లో తండ్రి మరణం తరువాత..
ముఖ్యమంత్రిగా ఉన్న వైయస్ రాజశేఖరెడ్డి మరణం తరువాత ఓదార్పు యాత్రకు అనుమతి ఇవ్వకపోవటంతో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తన తల్లితో కలిసి కొత్త పార్టీ ఏర్పాటు చేసారు. కాంగ్రెస్ పార్టీ ద్వారా వచ్చిన ఎంపీ.. ఎమ్మెల్యే పదవులను వదులుకున్నారు. ఆ ఉప ఎన్నికల్లో జాతీయ రికార్డులను జగన బద్దలు కొట్టారు. ఇక, 2010 లో రోశయ్య స్థానంలో కిరణ్ను ముఖ్యమంత్రిని చేసారు. వైయస్ వివేకాను జగన్కు వ్యతిరేకంగా కిరణ్ కేబినెట్లో మంత్రిని చేసారు. అంతే, జగన్ తన తండ్రి పేరుతో కొత్త పార్టీ స్థాపించారు. ఢిల్లీలోని కాంగ్రెస్ అధినాయకత్వం.. ఏపీ లోని కిరణ్..చంద్రబాబు ఒక్కటయ్యారు. జగన్ పైన కేసులు పెట్టారు. 26 నెలలు జైళ్లో ఉంచారు. జగన్కు మద్దతుగా ఇచ్చిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్..టీడీపీకి రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో దిగారు. ఆ సమయంలో చంద్రబాబు..కిరణ్ పరస్పర సహకారం రెండు సీట్లు మాత్రమే గెలుచుకోగా..ప్రజలు జగన్ వైపు నిలబడి 15 సీట్లలో వైసీపీ అభ్యర్దులను గెలిపించారు. అంతే, ఇక జగన్ పైన కుట్రలు మొదలయ్యాయి. అందులో కేంద్రంలో సోనియా..రాహుల్.. ఏపీలో కిరణ్..చంద్రబాబు..జేడీ లక్ష్మీనారాయణ వీరంతా జగన్ లక్ష్యంగా పని చేసారు.
2014లో ఒంటరి పోరు..
2014లో చంద్రబాబు-మోదీ-పవన్ ఒక్కటయ్యారు. జగన్ ఒంటరి పోరు చేసారు. ఆ ఎన్నికల్లో జగన్ అయిదు లక్షల తేడాతో అధికారం కోల్పోయి..ప్రతిపక్షానికి పరిమితి అయ్యారు. ప్రతిపక్ష నేతగా ఉండగానే టీడీపీ అనేక ఆరోపణలు చేసింది. జగన్ పైన నిరూపణ కానీ లక్ష ఓట్ల అభియోగాలను తీవ్ర తరం చేసింది. కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ పైన జగన్ పైన చర్యలు తీసుకోవాలని అనేక మార్లు ఒత్తిడి తెచ్చింది. జగన్ పార్టీ నుండి గెలిచిన వారిలో 23 మందిని తమ వైపు తిప్పుకొంది. వారిలో నలుగురిని మంత్రులుగా చేసారు. నంద్యాల..కాకినాడ ఎన్నికల్లో ఓడించి నైతికంగా దెబ్బ తీసే ప్రయత్నం చేసింది. ఇక, జగన్ నిర్ణయించుకున్నారు. దెబ్బకు దెబ్బ తీయాలని డిసైడ్ అయ్యారు. పాద యాత్ర ప్రారంభించారు. ప్రజలతో మమేకం అయ్యారు. టీడీపీ వంచన పార్టీ అంటూ..ఒక్క చాన్స్ ఇవ్వాలంటూ అభ్యర్దించారు. తన తండ్రి విశ్వసనీయత ఇప్పుడు జగన్కు కలిసి వచ్చింది. చంద్రబాబును కాదన్నారు..జగన్ను ఏపీ ప్రజలు గద్దెనెక్కించారు. టీడీపీ కలలో కూడా ఊహించని విధంగా షాక్ ఇచ్చారు జగన్.
ఒకే దెబ్బకు ప్రత్యర్ధులందరూ ఔట్...
జగన్ ఈ ఎన్నికల్లో సాధారణ గెలుపు అయితే ఒక రంగా ఉండేది. కానీ, జగన్ కసిని ప్రజలు ఓట్ల రూపంలో చూపించారు . చంద్రబాబును అధికారం నుండి దూరం చేసారు. తన ఎంట్రీతో ఏపీలో కాంగ్రెస్ అడ్రస్ లేకుండా పోయింది. కిరణ్ రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఆయన సోదరుడు పీలేరులో వైసీపీ చేతిలో ఓడారు. గత ఎన్నికల్లో విశాఖలో విజయమ్మ ఓటమికి సహకరించిన సబ్బం హరి ఈ సారి భీమిలిలో వైసీపీ ఓడించింది. లగడపాటి చెప్పిన సర్వేలకు తన ఫలితాలతోనే సమాధానం చెప్పి..ఆయనతోనే అభినందనలు చెప్పించుకున్నారు. తన పైన పదేపదే మాటలు జారే జేసీ బ్రదర్స్కు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు. తనను కేసుల సమయంలో వ్యక్తిగతంగా వేధించిన సీబీఐ మాజీ జేడీని విశాఖలో వైసీపీ అభ్యర్ది ఓడించారు. తన పార్టీలో గెలిచి..టీడీపలోకి వెళ్లి మంత్రులై జగన్ పైనే ఆరోపణలు చేసిన ఆదినారాయణ రెడ్డి..అఖిల ప్రియ..సుజయ రంగారావు..అమరనాధ రెడ్డి ఓడిపోయారు. అసెంబ్లీలో..బయటా జగన్ పైన వ్యక్తిగత ఆరోపణలు చేసే దేవినేని ఉమా..బోండా ఉమా అసెంబ్లీకి దూరమయ్యారు.