ఏపీ రాజ్యసభ: ఈ సారి రెడ్లకు నో ఛాన్స్... నత్వానీకి ఖరారు..జగన్ మదిలో ఆముగ్గురు ఎవరు..?
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో రాజ్యసభ ఎన్నికలపై జోరుగా చర్చ జరుగుతోంది. ఏపీ నుంచి ఈ సారి వైసీపీ కోటాలో నాలుగు రాజ్యసభ సీట్లు ఉన్నందున ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. అయితే ఇప్పటికే జగన్ తనకు ఇష్టులైన ఇద్దరిని పెద్దలసభకు పంపాలని భావిస్తున్నట్లు సమాచారం. ఒక సీటును ప్రముఖ పారిశ్రామికవేత్త ఎంపీ అంబానీ సన్నిహితుడైన పరిమాల్ నత్వానీకి జగన్ కేటాయిస్తున్నట్లు సమాచారం. ఇక మిగిలిన ఒక్క స్థానంకు ఎవరిని ప్రతిపాదిస్తారా అన్నదానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది.
నత్వానీకి సీటు ఖరారు
ఆంధ్రప్రదేశ్లో రాజ్యసభ ఎన్నికల వేడి కనిపిస్తోంది. ఈ సారి ఆంధ్రప్రదేశ్కు నాలుగు సీట్లు దక్కనున్నాయి. అన్నీ కూడా వైసీపీ కోటాలోకే వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఎవరి ప్రయత్నాలు వారు ముమ్మరం చేస్తున్నారు. అయితే జగన్ మాత్రం ఇప్పటికే ఇద్దరిని ఖరారు చేసినట్లు సమాచారం. ఉన్న నాలుగు స్థానాల్లో ఒకటి అంబానీ సన్నిహితుడు నత్వానీకి కేటాయిస్తున్నారు. ఇండిపెండెంట్ అభ్యర్థిగా వైసీపీ మద్దతుతో నత్వానీ ఏపీ నుంచి రాజ్యసభకు పోటీ చేయనున్నారు. జగన్ తనను ఏపీ నుంచి రాజ్యసభకు పంపుతారన్న హామీ ఇచ్చారని నత్వానీ కూడా నిర్థారించారు.మరో మూడు సీట్లపై పోటీ నెలకొంది. ఇక మరో రెండు పేర్లను జగన్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది.
జగన్ మదిలో ఉన్నది వీరే
ఇక ఈ రెండు సీట్లలో సీఎం జగన్ సన్నిహితుడు మోపిదేవి వెంకటరమణను పెద్దల సభకు పంపాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఎమ్మెల్సీ వ్యవస్థను రద్దు చేస్తున్న కారణంగా ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉండి మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న మోపిదేవికి మంత్రి పదవి పోవడం ఖాయం. అయితే పెద్దల సభకు పంపి ఆయనకు న్యాయం చేయాలని సీఎం జగన్ భావిస్తున్నట్లు సమాచారం. అయితే మోపిదేవికి ఆరోగ్య సమస్యలు ఉన్నందున తాను ఆలోచించి చెబుతానని సీఎంతో చెప్పినట్లు సమాచారం. ఒకవేళ మోపిదేవి డ్రాప్ అయితే ఆ సీటును బీద మస్తాన్కు ఇవ్వాలని జగన్ యోచిస్తున్నట్లు సమాచారం. ఇక సార్వత్రిక ఎన్నికలకు ముందు తన ఎంపీ పదవికి రాజీనామా చేసి వైసీపీలో చేరిన పండుల రవీంద్రబాబును పెద్దల సభకు పంపేందుకు జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. పండుల రవీంద్రబాబు ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవారు.
Recommended Video
రెడ్డి సామాజిక వర్గానికి నో ఛాన్స్
ఇదిలా ఉంటే ఈ సారి రాజ్యసభకు రెడ్డి సామాజిక వర్గానికి ఛాన్స్ ఉండదని సమాచారం. ఇప్పటికే రెడ్డి సామాజిక వర్గం నుంచి రాజ్యసభకు ప్రాతినిథ్యం వహిస్తున్నవారిలో విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలు ఉన్నారు. అయితే రెడ్డి సామాజిక వర్గం నుంచి అయోధ్య రామిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డిలు కూడా రాజ్యసభ సీటు ఆశిస్తున్న ఆశావాహుల్లో ఉన్నారు. ఈ సారి మాత్రం బలహీనవర్గాల వారికే రాజ్యసభలో సీఎం జగన్ పెద్ద పీట వేస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే ఒకరు బీసీ సామాజిక వర్గంకు చెందిన మోపీదేవి వెంకటరమణ మరొకరు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన పండుల రవీంద్రబాబు ఉండగా మూడో సీటు మోహన్బాబుకు లేదా ఒక మహిళకు ఇవ్వాలని జగన్ భావిస్తున్నట్లు వైసీపీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.