సీబీఎన్కు కొత్త అర్ధం చెప్పిన జగన్- కరోనాకు భయపడే నాయుడంటూ సెటైర్లు
ఏపీ అసెంబ్లీలో నివర్ తుపానుపై చర్చ ముగింపు సందర్భంగా సీఎం జగన్ ప్రసంగించారు. ఇందులో ఆయన 'నివర్ తుపానుకు సంబంధించిన నష్టంపై ఇంకా అంచనాలు జరుగుతున్నాయని తెలిపారు. డిసెంబరు 15వ తేదీలోగా ఆ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించామన్నారు. ఏ సీజన్లో జరిగిన నష్టానికి అదే సీజన్లో పరిహారం చెల్లిస్తామని సీఎం తెలిపారు. ఆ మేరకు డిసెంబరు 31వ తేదీన పరిహారం చెల్లిస్తామని కూడా చెప్పాం. ఆ డబ్బు వారి చేతుల్లోనే పెట్టబోతున్నాం'అని జగన్ పేర్కొన్నారు.
ఈ సందర్బంగా జగన్ విపక్ష నేత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో జరిగిన పరిణామాలను ప్రస్తావించారు. వాటితో తన ప్రభుత్వాన్ని పోలుస్తూ పలు వ్యాఖ్యలు చేశారు. నెల కూడా తిరక్కముందే రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇస్తున్నామని వర్షాలు, వరదల వల్ల దెబ్బ తిన్న పంటలను కూడా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. రంగు మారిన ధాన్యం కొనుగోలు చేయడం ఒక గొప్ప కార్యక్రమం. ఇది చంద్రబాబు హయాంలో ఏనాడూ అలాంటి ఆలోచన కూడా చేయలేదని జగన్ అన్నారు.
రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటి సారిగా రంగు మారిన ధాన్యం మాత్రమే కాకుండా, మొలకలు వచ్చిన ధాన్యం కూడా వదిలి పెట్టకుండా రైతులకు సహాయం చేయండి అని చెప్పి.. వాటిని కూడా గ్రేడెడ్ పద్ధతిలో కొనుగోలు చేసే పద్ధతికి గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఒక నిర్ణయం తీసుకున్నాం. ఇంత దూరం ఆలోచించి రైతులకు రవ్వంత అయినా కూడా కష్టం కలగకుండా, రైతులకు తోడుగా ఉండే కార్యక్రమం చేస్తా ఉంటే, దానిపై మంత్రి గారు కూడా గొప్పగా చెబుతున్నా కూడా.. వినడం లేదంటూ జగన్ అసహనం వ్యక్తం చేశారు.
తుపాను వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవడంపై చర్చ జరుగుతున్న సందర్భంగా చంద్రబాబు వైఖరిని జగన్ తీవ్రంగా తప్పుబట్టారు. చర్చ జరుగుతున్నప్పుడు ఓ పద్ధతి అనేది ఉండాలని, లేదు.. నాకు ఎటువంటి పద్ధతులు ఉండవు. నేను మాట్లాడేది ఇంతే అనుకుంటే వ్యవస్థ అనేది బతకదు. ఏదైనా విషయం ఉంటే, వారు మాట్లాడడం అయిపోతే మేము మాట్లాడడం మొదలుపెడతాం. ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి నుంచి ఈ రకమైన ప్రకటన వస్తుందని అంతా ఎదురు చూస్తా ఉన్నారు. కాబట్టి వారిని ఇంకా వేచి చూసేలా ఉంచడం సరి కాదు'.
'కానీ సభ జరగనివ్వకూడదు అని చెప్పి ఆయన.. రౌడీయిజమ్ చేసేదీ ఆయనే. మళ్లీ ఆయనకు ఏదో అన్యాయం జరిగిపోతున్నట్లు ఫ్లోర్ మీద కూర్చునేది ఆయనే. రెండూ ఆయనే చేస్తున్న ఈ పరిస్థితిలో ప్రజలకు ఏం మెసేజ్ ఇస్తామని జగన్ ప్రశ్నించారు. కరోనా నేపథ్యంలో హైదరాబాద్లో ఉండిపోయిన చంద్రబాబును ప్రశ్నిస్తూ సీబీఎన్ అంటే కరోనాకు భయపడే నాయుడంటూ జగన్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అసెంబ్లీలో చంద్రబాబు రౌడీఇజాన్ని ఎట్టిపరిస్దితుల్లోనూ సహించబోమన్నారు.