మళ్లీ అనూహ్యంగా తెరపైకి మూడు రాజధానులు- గవర్నర్ ప్రసంగం- మండలిపై ఒత్తిడి వ్యూహం....
ఏపీలో మూడు రాజధానుల ప్రక్రియ ఆలస్యమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ ప్రక్రియను వాయిదా వేసుకున్నట్లు అంతా భావించారు. కానీ మూడు రాజధానుల వ్యవహారం లైవ్ లోనే ఉందని అసెంబ్లీ వేదికగా మరోమారు స్పష్టం చేసింది. గవర్నర్ ప్రసంగంలో మూడు రాజధానుల ఆవశ్యకతను పెట్టడంతో పాటు రేపు అసెంబ్లీలో మరోమారు రాజధాని బిల్లులు ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది.
హడావిడిగా ఏపీ అసెంబ్లీ ఎందుకన్న విపక్షాలు- గవర్నర్ ఆన్ లైన్ ప్రసంగంపైనా విమర్శలు....
సజీవంగానే రాజధాని తరలింపు...
ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటు ప్రక్రియకు గత డిసెంబర్ లో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో తెరలేపిన ప్రభుత్వం.. మండలిలో బిల్లులు సెలక్ట్ కమిటీకి వెళ్లడంతో ఈ నిర్ణయాన్ని తాత్కాలికంగా వాయిదా వేసుకుందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే తాజాగా హైకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్ లో శాసన ప్రక్రియ ద్వారానే రాజధాని తరలింపు ఉంటుందని చెప్పిన ప్రభుత్వం.. అసెంబ్లీ సమావేశాలను ఇందుకు వేదికగా చేసుకోబోతోందని అర్దమవుతోంది. గవర్నర్ ప్రసంగంలో మూడు రాజధానుల ఏర్పాటును ప్రస్తావించడం ద్వారా ఈ వ్యవహారం ఇంకా సజీవంగానే ఉందని ప్రభుత్వం మరోమారు తేల్చిచెప్పింది.
గవర్నర్ ప్రసంగంతో క్లారిటీ...
మూడు రాజధానుల ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని గవర్నర్ హరిచందన్ తన ఆన్ లైన్ ప్రసంగంలో వివరించారు. చట్టసభల రాజధానిగా అమరావతి, కార్యనిర్వాహక రాజధానిగా విశాఖపట్నం, న్యాయ రాజధానిగా కర్నూలు ఏర్పాటు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని గవర్నర్ తెలిపారు. దీంతో మూడు రాజధానుల ఏర్పాటు ప్రక్రియ ఇంకా సజీవంగానే ఉందని ప్రభుత్వం మరోమారు స్పష్టం చేసినట్లయింది. ఇందుకు అనుగుణంగానే బీఏసీలోనూ రాజధాని బిల్లులపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతోందని దీంతో తేలిపోయింది.
Recommended Video
మండలిపై ఒత్తిడి వ్యూహం...
ఇప్పటికే అసెంబ్లీ ఓసారి ఆమోదించి పంపిన రాజధాని బిల్లులను మండలి ఆమోదం లేదా తిరస్కరణ చేయకుండా సెలక్ట్ కమిటీకి పంపడం ద్వారా ఈ వ్యవహారాన్ని సాధ్యమైనంత ఆలస్యం చేయాలని చూస్తోందని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో మరోసారి ఈ బిల్లులను అసెంబ్లీలో ప్రవేశపెట్టడం ద్వారా మండలిపై ఒత్తిడి పెంచేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. అదే సమయంలో రెండు రోజులకే సమావేశాలను కుదించడం ద్వారా మండలి తప్పనిసరిగా ఏదో ఒక నిర్ణయం తీసుకోక తప్పని పరిస్ధితి కల్పించాలనేది ప్రభుత్వ వ్యూహంగా కనిపిస్తోంది. అయితే ఈ విషయాన్ని ముందే గ్రహించిన టీడీపీ ఎమ్మెల్సీలు తొలి రోజు మండలి సమావేశాలు ప్రారంభం కాగానే తమ ఆందోళన ప్రారంభించారు.