మూడు రాజధానులపై జగన్ నెల రోజుల టార్గెట్ - టీడీపీకి కోలుకోలేని దెబ్బ- గవర్నర్ సాయంతో....
ఏపీలో అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా మూడు రాజధానుల ఏర్పాటు కోసం జగన్ సర్కార్ చేస్తున్న ప్రయత్నాలు చివరి దశకు చేరుకున్నాయి. ఇప్పటికే రెండుసార్లు అసెంబ్లీలో సీఆర్డీయే, వికేంద్రీకరణ బిల్లులను ఆమోదించిన సర్కార్.. మండలిలో ప్రవేశపెట్టే అవకాశం లేకపోయినా గవర్నర్ సాయంతో వీటికి ఆమోద ముద్ర వేయించుకునేందుకు కసరత్తు ప్రారంభించింది. దీంతో గవర్నర్ పాత్ర మరోసారి కీలకంగా మారబోతోంది.
జగన్ సర్కారుకు భారీ షాక్- రాజధాని బిల్లుల ఆమోదానికి ప్రయత్నం- బడ్జెట్ బిల్లుకే ఎసరు...
రెండుసార్లు అసెంబ్లీ ఆమోదం...
ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుకు ఉద్దేశించిన రెండు బిల్లులకు అసెంబ్లీలో రెండోసారి ఆమోదం తీసుకోవడం ద్వారా వీటికి చట్టరూపం ఇచ్చే క్రమంలో జగన్ సర్కారు మరో ముందడుగు వేసింది. వీటికి శాసనమండలిలో అడ్డుకునేందుకు టీడీపీ శతవిథాలా ప్రయత్నించినా బిల్లులను ప్రవేశపెట్టకుండా మాత్రమే ఆపగలిగింది. దీంతో ఈ రెండు బిల్లులపై మండలి స్పందన లేనందున తదుపరి ప్రక్రియ ప్రారంభించేందుకు సర్కారు సిద్దమవుతోంది. దీంతో రాజధానుల వ్యవహారం మరోసారి రాష్ట్రంలో కాకరేపే అవకాశాలు కనిపిస్తున్నాయి.
గవర్నర్ ఆమోదంతో బిల్లులు...
ఏపీలో మూడు రాజధానుల బిల్లులపై మండలి స్పందించకుండా ఉండటం ద్వారా ఈ ప్రక్రియ వాయిదా పడుతుందని భావించినా ప్రభుత్వం మాత్రం దీన్ని గవర్నర్ సాయంతో ఆమోద ముద్ర వేయించేందుకు సిద్ధమవుతోంది. ఓసారి సెలక్ట్ కమిటీ పేరుతో, మరోసారి ప్రవేశపెట్టకుండానే మండలి అడ్డుకున్న నేపథ్యంలో వీటిని గవర్నర్ కు నివేదించేందుకు ప్రభుత్లం సిద్ధమవుతోంది. రేపో మాపో ఈ బిల్లులు రాజ్ భవన్ కు చేరడం ఖాయమని తెలుస్తోంది. ఆ తర్వాత గవర్నర్ న్యాయ సలహా తీసుకుని ఆమోదిస్తే ఇక బిల్లులు చట్టంగా మారడం ఖాయంగా తెలుస్తోంది. అదే జరిగితే హైకోర్టుకు హామీ ఇచ్చిన విధంగా శాసన ప్రక్రియ ద్వారానే రాజధాని తరలింపు ఉండబోతున్నట్లు అర్ధమవుతోంది.
బెడిసికొట్టిన టీడీపీ వ్యూహాలు...
శాసన మండలిలో రాజధాని బిల్లులను అడ్డుకుంటే చాలు రాజధాని తరలింపు ఆగిపోతుందని భావించిన టీడీపీకి ప్రభుత్వ వ్యూహం భారీ షాక్ గా మారింది. ఈ ఏడాది జనవరిలో బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపడం ద్వారా తాత్కాలికంగా బ్రేక్ వేయగలిగామన్న సంతోషం టీడీపీకి ఎంతో కాలం నిలవలేదు. దీంతో మరోసారి ఈ బిల్లులను ప్రవేశపెట్టకుండా అడ్డుకుంటే సరిపోతుందని టీడీపీ భావించింది. అయితే గవర్నర్ ను బిల్లులను నేరుగా పంపడం ద్వారా మండలి పాత్ర లేకుండానే వీటికి ఆమోద ముద్ర వేసుకోవాలని ప్రభుత్వం యోచిస్తోంది. అదే జరిగితే అమరావతి ఉద్యమంతో పాటు అసెంబ్లీ, మండలి వేదికగా టీడీపీ సాగించిన పోరుకు అర్ధం లేకుండా పోతుంది. ప్రభుత్వం నేరుగా గవర్నర్ ను ఆశ్రయించే అవకాశం ఉందని తెలిసినా మండలిలో మూడు రాజధానులు ఏర్పాటు బిల్లులను అడ్డుకోవడాన్ని వైసీపీ ప్రజల్లోకి తీసుకెళ్లి ఎండగట్టే అవకాశం దక్కింది.
Recommended Video
గవర్నర్ పాత్రే కీలకం....
ఇప్పటికే కీలకమైన ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ వ్యవహారంలో ప్రభుత్వ ప్రతిపాదనలను ఆమోదించిన గవర్నర్ మూడు రాజధానుల బిల్లుల విషయంలో ఏం చేయబోతున్నారనేది ఉత్కంఠ రేపుతోంది. ప్రభుత్వం నేరుగా ఈ బిల్లులను గవర్నర్ కు పంపబోతోందని తెలిశాక వీటిపై తమ అభ్యంతరాలను ఆయన దృష్టికి తీసుకెళ్లేందుకు టీడీపీ సిద్ధమవుతోంది. అయితే గవర్నర్ టీడీపీ వాదనను పట్టించుకుంటారా లేక మెజారిటీ ప్రభుత్వ వాదనను పరిగణలోకి తీసుకుని బిల్లులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారా అన్న దానిపై చర్చ సాగుతోంది. ఏదైమైనా నెల రోజుల వ్యవధిలో ఈ రెండు బిల్లులకు ఆమోద ముద్ర వేయించుకోవడం ద్వారా పంతం నెగ్గించుకోవాలని జగన్ సర్కార్ భావిస్తోంది.