ఆ విషయంలో జగన్ సర్కార్ , నిమ్మగడ్డ ఏకాభిప్రాయం- కేంద్రం కోర్టులోకి బంతి
ఏపీలో పంచాయతీ ఎన్నికల నిర్వహణపై సుప్రీంకోర్టు తర్వాత పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. నిన్న మొన్నటి వరకూ గర్జించిన గొంతులు మూగబోయాయి. సుప్రీంకోర్టు తీర్పుపై వైసీపీ నేతలు కిక్కురుమనడం లేదు. విపక్షాలు కూడా అధికార వైసీపీపై విరుచుకుపడతాయని భావించినా ఆ స్ధాయిలో విమర్శలూ లేవు. మరోవైపు ఎన్నికలు కావాలంటూ, వద్దంటూ పంతాలకు పోయిన జగన్ సర్కార్, నిమ్మగడ్డ రమేష్ ఇద్దరూ ఓ విషయంలో మాత్రం ఏకాభిప్రాయానికి వచ్చేశారు. విచిత్రంగా ఇద్దరూ అదే డిమాండ్తో కేంద్రానికి రాసిన లేఖలు ఇప్పుడు ఆసక్తి రేపుతున్నాయి.
ఫోటోలు: ఏపీలో 72వ గణతంత్ర వేడుకలు: హాజరైన గవర్నర్ హరిచందన్ సీఎం జగన్
మరోసారి తుపాను ముందు ప్రశాంతత
ఏపీలో పంచాయతీ ఎన్నికల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఇప్పుడు జగన్ సర్కారుతో పాటు నిమ్మగడ్డనూ కొన్ని అంశాల్లో ఇరకాటంలో నెట్టింది. నిన్న మొన్నటి వరకూ ఎన్నికలు నిర్వహించాల్సిందేనని పట్టుబట్టిన నిమ్మగడ్డ, వద్దని పట్టుబట్టిన ప్రభుత్వం కూడా ఇప్పుడు ఎన్నికల నిర్వహణకు వచ్చేసరికి చేతులెత్తేస్తున్న పరిస్దితి కనిపిస్తోంది. దీంతో ఎప్పుడూ లేని విధంగా ఏపీలో ఇప్పుడు తుపాను ముందు ప్రశాంతత కనిపిస్తోంది. ఎన్నికల షెడ్యూల్ కూడా మారడంతో రెండు రోజుల వరకూ ఏమీ చేయలేని పరిస్ధితి. దీంతో ఇరువురూ ఓ అంశంపై తీవ్ర మధనపడుతున్నారు.
ఏపీలో తీవ్ర సిబ్బంది కొరత
ఏపీలో ప్రస్తుతం కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ సాగుతోంది. అదే సమయంలో పంచాయతీ ఎన్నికలు కూడా వచ్చిపడ్డాయి. నాలుగు దేశల్లో జరుగుతున్నా ఎన్నికలకు భారీగా సిబ్బంది అవసరం ఏర్పడింది. అలాగని వ్యాక్సినేషన్ ప్రక్రియను వదిలిపెట్టి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నికల విధుల్లో పాల్గొనే అవకాశం లేదు. దీంతో అదనపు సిబ్బంది కోసం ప్రభుత్వంతో పాటు ఎస్ఈసీ కూడా దారులు వెతుక్కోవాల్సిన పరిస్ధితులు నెలకొన్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులంతా కలిపినా వ్యాక్సినేషన్, పంచాయతీ ఎన్నికలను ఏకకాలంలో నిర్వహించే పరిస్ధితి లేకపోవడమే ఇందుకు కారణం.
జగన్, నిమ్మగడ్డ ఏకాభిప్రాయం
పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలా వద్దా అనే విషయంలో ఇన్నాళ్లూ కారణాలు వెతుక్కుంటూ వాదులాడుకున్న జగన్ సర్కార్తో పాటు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కూడా ఇప్పుడు ఓ విషయంలో మాత్రం ఏకాభిప్రాయంతో కనిపిస్తున్నారు. అదే సిబ్బంది అవసరం. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న సిబ్బంది ఎన్నికల అవసరాలకే సరిపోక నాలుగు విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. అలాంటి సమయంలో అదనపు సిబ్బంది లేకుండా ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని ఇరువురూ చేతులెత్తేస్తున్న పరిస్ధితి కనిపిస్తోంది. దీంతో సిబ్బంది వ్యవహారం తేల్చడానికే తొలి విడత ఎన్నికలకు రెండు రోజుల సమయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
కేంద్రం సాయం కోరిన జగన్, నిమ్మగడ్డ
రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు దాదాపు ఏకాభిప్రాయానికి వచ్చేసిన జగన్ సర్కార్, నిమ్మగడ్డ రమేష్ ఇప్పుడు సిబ్బంది కొరతపై దృష్టిసారించారు. రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్, ఎన్నికలు ఏకకాలంలో జరగాలంటే సిబ్బంది సరిపోరని, కాబట్టి కేంద్రం నుంచి అదనపు సిబ్బందిని, బలగాలను కూడా కేటాయించాలని ఇరువురూ కేంద్రంలోని సంబంధిత శాఖలకు లేఖలు రాశారు. కేంద్రం వీరిద్దరి లేఖలను పరిగణనలోకి తీసుకుని రేపోమాపో తన నిర్ణయం వెల్లడించాల్సి ఉంది. రెండ్రోజుల్లో కేంద్రం నుంచి ఎలాంటి నిర్ణయం రాకపోతే వ్యాక్సినేషన్ లేదా ఎన్నికల్లో ఏదో ఒక దానిపై తీవ్ర ప్రభావం పడక తప్పదని అంచనా వేస్తున్నారు.