ఏపీలో రుణమాఫీని రద్దు చేసిన జగన్ సర్కార్ .. రీజన్ ఇదే
గత ప్రభుత్వ హయాంలో రైతులకు రుణమాఫీ చెల్లిస్తామని రుణమాఫీ ఉత్తర్వులను జారీ చేశారు. అయితే గత ప్రభుత్వం ఇచ్చిన హామీని తాము నెరవేర్చలేమని రైతు రుణమాఫీని జగన్ ప్రభుత్వం రద్దు చేసింది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో మంజూరు చేసిన రుణమాఫీ ఉత్తర్వులను రద్దు చేస్తూ బుధవారం ఆదేశాలిచ్చింది. ఇది సన్నకారు రైతులకు షాకింగ్ న్యూస్ అని చెప్పక తప్పదు .
ఐదు విడతల్లో రుణమాఫీ చేస్తామని టీడీపీ హామీ ..
గతంలో అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వంనాలుగు, ఐదు విడతల మాఫీ కిస్తీలకు రూ.7,959.12 కోట్ల చెల్లింపుల కోసం మార్చి 10న ఇచ్చిన జీవో నెం.38ని ఇచ్చింది. అయితే తాజాగా వైసీపీ ప్రభుత్వం జీవో నెంబర్ 38 ని రద్దు చేస్తూ జీవో నెం.99ని జారీ చేసింది. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ రైతుల రుణాలన్నింటినీ రద్దు చేస్తామని హామీ ఇచ్చింది. ఇక అధికారంలోకి వచ్చిన తర్వాత పలు వడపోతలతో రూ.24,500 కోట్లను ఐదేళ్లల్లో ఐదు విడతల్లో మాఫీ చేస్తామని, రైతులకు పది శాతం వడ్డీతో సొమ్ము చెల్లిస్తామని చెప్పి మాట మార్చింది.
నిధులు లేక చెల్లింపు చెయ్యని గత ప్రభుత్వం
ఒకేసారి రుణమాఫీ చేయాల్సిన చోట ఐదు విడతలుగా రుణమాఫీ చేస్తామని ప్రకటించింది. 2019 ఎన్నికల ముందు వరకు మూడు దఫాలుగా రుణమాఫీ చేసిన టిడిపి ప్రభుత్వం 2019 ఎన్నికలకు ముందు నాలుగో విడత రుణమాఫీ సొమ్ముపై మార్చి 10న ఉత్తర్వులిచ్చింది. అయితే ఆ డబ్బు చెల్లించడానికి సరిపడా నిధులు లేకపోవడంతో చెల్లించలేకపోయింది. ఇక ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో రుణమాఫీ జరగలేదు.
టీడీపీ హయాంలో హామీలకు మా బాధ్యత లేదన్న వైసీపీ ప్రభుత్వం
ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసిపి సర్కార్ , నాలుగు, ఐదు విడతల మాఫీ సొమ్ము రూ.7,959.12 కోట్లు రుణ మాఫీ కింద చెల్లించాల్సిన గత ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చేది లేదని తేల్చి చెప్పింది.టీడీపీ హయాంలో ఇస్తామని చెప్పిన వాటికి మా బాధ్యత లేదని వైసీపీ ప్రభుత్వం తేల్చేసింది. చివరి రెండు విడతల మాఫీ సొమ్ము చెల్లింపులకు గత సర్కారు ఇచ్చిన జీవోను ప్రస్తుత ప్రభుత్వం రద్దు చేసింది. అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పథకం అందుబాటులోకి తీసుకు రానున్న నేపథ్యంలోనే రుణమాఫీ బకాయిలను చెల్లించాలని గత ప్రభుత్వం ఇచ్చిన రుణమాఫీ ఉత్తర్వులను రద్దు చేసినట్లుగా చెబుతోంది.
రుణమాఫీ ఉత్తర్వులు రద్దుపై ప్రతిపక్షాల ఆగ్రహం
ప్రతిపక్ష పార్టీల నేతలు జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రుణమాఫీ చేయకపోవడం వల్ల రైతులు నష్టపోయారని మండిపడుతున్నారు. మొన్నటికి మొన్న కాంగ్రెస్ రుణమాఫీ బకాయిలు చెల్లించాలని హైకోర్టు ను ఆశ్రయించింది. అయితే హైకోర్టు ఆ జీవో రద్దు కాకుంటే బకాయిలు విడుదల చేయాలని ఆదేశించింది. అందుకే జగన్ ప్రభుత్వం రుణమాఫీ ఉత్తర్వులను రద్దు చేస్తూ జీవో జారీ చేసింది. ఈ మేరకు వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య ఆదేశాలిచ్చారు.ఇక టీడీపీ , సీపీఐ సైతం జగన్ తీసుకున్న నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.