జగన్ కు విశాఖ ఎంతెంత దూరం ? వరుస గ్యాస్ లీక్స్ పై ఆందోళన- కావాలనే చేస్తున్నారా ?
విశాఖకు జగన్ ఎంత దగ్గరవుదామని చూస్తుంటే గ్యాస్ లీక్ ఘటనలు అంత దూరం చేసేలా కనిపిస్తున్నాయి. వైసీపీ సర్కారు రాజధాని ప్రకటించగానే అమరావతితో పోలిస్తే విశాఖ అంత సురక్షితం కాదని, ప్రకృతి విపత్తులతో పాటు భద్రతా పరంగా కూడా సమస్యలు తప్పవని విపక్షాలు ఆరోపించాయి. అయితే వాటన్నింటినీ మించి ఇప్పుడు వరుస ప్రమాదాలు చోటు చేసుకుంటుండటం, వాటిని రాజకీయం చేసేందుకు విపక్షాలు రంగంలోకి దిగుతుండటంతో ప్రభుత్వం కూడా ఆలోచనలో పడుతోంది.
టీడీపీ ఎంపీ గల్లా కుటుంబానికి జగన్ సర్కార్ షాక్- అమర్ రాజా ఇన్ ప్రా భూములు వెనక్కి...
విశాఖలో వరుస గ్యాస్ లీక్ లు..
స్టీల్ సిటీగా పేరున్న విశాఖపట్నంలో పారిశ్రామిక వాతావరణం ఎక్కువగా కనిపిస్తుంటుంది. వీటిలో ప్రతీ రోజూ ఎక్కడో చోట చిన్నా, చితకా ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. కానీ అవన్నీ ప్రతిసారీ చర్చకు కూడా రావు. చాలా సందర్భాల్లో అవి జరిగినట్లు కూడా ఎవరికీ తెలియకుండానే సద్దుమణిగి పోతుంటాయి. కానీ తాజాగా వైసీపీ సర్కార్ మూడు రాజధానుల ప్రక్రియలో భాగంగా విశాఖకు కొత్త కార్యనిర్వాహక రాజధానిగా ప్రకటించగానే ఇక్కడ జరిగే ప్రతీ చిన్న విషయం పెద్దదైపోతోంది. తాజాగా చోటు చేసుకున్న రెండు గ్యాస్ లీక్ ప్రమాదాలు పెద్దవే అయినా వీటితో పాటు ఏ పరిశ్రమలో ఏ చిన్న ఘటన జరిగినా దాన్ని విపక్షాలతో పాటు సాధారణ ప్రజలు కూడా భూతద్దంలో చూస్తున్న పరిస్ధితి. దీంతో సహజంగానే ప్రభుత్వం కూడా ఆత్మరక్షణలో పడాల్సిన పరిస్ధితి తలెత్తుతోంది.
విపక్షాల వ్యతిరేకత-తాజా రాజకీయం..
ఏపీలో కీలకమైన పారిశ్రామిక నగరంగా పేరు తెచ్చుకున్న విశాఖలో ఉన్న పరిశ్రమల్లో గతంలో ఎన్నో ప్రమాదాలు జరిగాయి. కానీ వాటన్నింటికంటే జనానికి తాజాగా జరిగిన గ్యాస్ లీక్స్ గుర్తుండిపోయేలా కనిపిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం ప్రమాద తీవ్రత కంటే విపక్షాల రాజకీయమే అన్నట్లుగా పరిస్ధితి మారుతోంది. అమరావతి నుంచి విశాఖకు రాజధాని తరలింపుకు వ్యతిరేకంగా అదే నగరంలో ఉద్యమాలు చేసిన చరిత్ర విపక్షాలది. అంటే విశాఖ రాజధాని చేయాలన్న ప్రభుత్వ ఆలోచనకు వ్యతిరేకంగా విపక్షాలు ప్రచారం చేశాయి. తాజాగా గ్యాస్ లీక్స్ ఘటనలపైనా అదే రాజకీయం. ప్రమాదం జరగ్గానే బాధితుల గురించి ఆలోచించడం మానేసి రాజకీయాలు మొదలుపెట్టేయడం సర్వసాధారణంగా మారుతోంది. దీంతో అసలు సమస్య పక్కదారి పట్టి రాజకీయాలు తెరపైకి వచ్చేస్తున్నాయి. దీంతో ప్రభుత్వం కూడా ఇందులో కుట్ర కోణాలపై దృష్టి పెడుతోంది.
రాజధాని తరలింపుపై ప్రభావం..
విశాఖలో వరుస గ్యాస్ లీక్ ప్రమాదాల కారణంగా ఇప్పటికిప్పుడు జగన్ సర్కార్ ఆలోచనలపై పడే ప్రభావం ఏమీ లేదు. అయితే విశాఖ వాసుల కంటే బయటి ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చే సాధారణ జనానికి, ఉద్యోగులకు గ్యాస్ లీక్స్ ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా అమరావతి నుంచి విశాఖకు తరలివచ్చేందుకు సిద్ధమవుతున్న ఉద్యోగ వర్గాలను విశాఖ ఘటనలు గుబులు రేపుతున్నాయి. దీంతో వీరు ఎప్పటికప్పుడు అక్కడి పరిస్ధితులను తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రభుత్వం త్వరలో రాజధాని తరలింపు ప్రణాళికలను ఆచరణలో పెట్టేందుకు సిద్దమవుతుండటంతో ఇప్పటికే నగరంలో ఇళ్లూ, స్కూళ్లూ వెతుక్కునే పనిలో ఉన్న ఉద్యోగులు తాజా ఘటనలను నిశితంగా గమనిస్తున్నారు.
ఎంత దగ్గరవుదామంటే అంత దూరం..
గతేడాది వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే విశాఖపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించింది. అప్పట్లో రాజధాని ప్రస్తావన రాకముందే జీవీఎంసీ ఎన్నికల కోసమే ప్రభుత్వం విశాఖపై వరాలు కురిపిస్తోందని భావించారు. కానీ ఆ తర్వాత ఏకంగా రాజధాని ప్రకటన రావడం, సీఎం జగన్ స్వయంగా అక్కడికి వెళ్లి ప్రజలతో మమేకం అయ్యేందుకు ప్రయత్నించడం ద్వారా విశాఖపై ప్రభుత్వ వ్యూహం స్పష్టమైంది. తాజాగా విశాఖలో సీఎం క్యాంపు కార్యాలయంతో పాటు నివాసం కోసం ప్రభుత్వాధికారులు, జగన్ సతీమణి భారతి కూడా పలుమార్లు నగరంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. అయితే విశాఖకు జగన్ ఎంత దగ్గరవ్వాలని భావిస్తున్నా.. తాజా ప్రమాదాల కారణంగా అంత దూరం జరగాల్సిన పరిస్ధితులు ఏర్పడుతున్నాయి. అయితే వీటిని ఏమాత్రం లెక్కచేయకుండా ముందుకెళ్లాలని భావిస్తున్న జగన్.. ప్రమాదాలపై విచారణ కమిటీల ఏర్పాటుతో పాటు నిఘా వర్గాల నుంచి ఎప్పటికప్పుడు నగరంలో పరిస్ధితులను ఆరా తీస్తూనే ఉన్నారు.