దేవినేని ఉమపై అట్రాసిటీ, హత్యాయత్నం కేసులు-స్టేషన్లకు తిప్పుతూ-మాజీ మంత్రికి చుక్కలు
టీడీపీకి చెందిన మాజీ మంత్రి దేవినేని ఉమకు జగన్ సర్కార్ చుక్కలు చూపిస్తోంది. గత టీడీపీ ప్రభుత్వంలో ఆయన అక్రమాలపై విమర్శలు చేస్తూ వచ్చిన ప్రభుత్వం.. తాజాగా కృష్ణాజిల్లా కౌండపల్లి అడవుల్లో పర్యటన నేపథ్యంలో ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులతో పాటు హత్యాయత్నం కేసులు కూడా పెట్టింది. ఉమను నిన్న రాత్రి నుంచి జిల్లాలో పలు పోలీసు స్టేషన్లకు తిప్పుతూ పోలీసులు నరక యాతన చూపుతున్నారు.
దేవినేని ఉమకు చుక్కలు
మాజీ మంత్రి దేవినేని ఉమపై నిన్న రాత్ర రాళ్ల దాడి కేసు మర్చిపోకముందే ఆయన్ను టార్గెట్ చేస్తూ ఏపీ ప్రభుత్వం చుక్కలు చూపిస్తోంది. ఆయన వాహనంపై దాడి కేసులో పోలీసుల తీరుపై టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్న నేపథ్యంలోనే పోలీసులు కేసుల నమోదుకు దిగారు. పలు తీవ్ర సెక్షన్ల కింద ఉమపై కేసులు నమోదు చేశారు. దీంతో పాటు ఆయన్ను పలు పోలీసు స్టేషన్లకు తిప్పుతున్నారు. దీంతో టీడీపీ శ్రేణుల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఉమపై అట్రాసిటీ, హత్యాయత్నం కేసులు
దేవినేని ఉమ నిన్న కొండపల్లి ఫారెస్ట్ లో గ్రావెల్ మైనింగ్ జరుగుతుందన్న వార్తల నేపథ్యంలో అక్కడికి నిజనిర్ధారణకు వెళ్లారు. దీంతో ఆయనపై జి.కొండూరు పోలీసులు ఎస్సీ, ఎట్రీ అట్రాసిటీ, హత్యాయత్నం సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. నిన్న అర్ధరాత్రే ఉమను అరెస్టు చేసిన పోలీసులు పెరపారుపూడి పోలీసు స్టేషన్ కు తరలించారు. అక్కడి నుంచి తిరిగి నందివాడ స్టేషన్ కు మార్చారు. టీడీపీ శ్రేణుల నుంచి ఎదురవుతున్న నిరసనల నేపథ్యంలో ఉమను స్టేషన్ల మధ్య తిప్పుతున్నట్లు తెలుస్తోంది.
ఉమ అరెస్ట్ పై విమర్శల వెల్లువ
కొండపల్లి అడవుల్లో గ్రావెల్ మైనింగ్ పై నిజనిర్దారణకు వెళ్లిన మాజీ మంత్రి దేవినేని ఉమపై పోలీసులు హత్యాయత్నం, అట్రాసిటీ కేసులు నమోదు చేయడంపై తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి. ఆయన వాహనంపై రాత్రి జరిగిన రాళ్ల దాడిపై కేసులు నమోదు చేయకుండా ఉమపై ఎదురు కేసులు పెట్టడమేంటని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. పోలీసుల తీరుపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవినేని ఉమను టార్గెట్ చేస్తూ వైసీపీ సర్కార్, పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పటికే డీజీపీకి లేఖ రాయడంతో పాటు తీవ్ర విమర్శలు చేశారు.