వారంలో పీఆర్సీ ప్రకటన- రిపోర్ట్ ఇవ్వకుండా నేరుగానే-జగన్ సర్కార్ సంకేతాలు
ఏపీలో ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటనపై ప్రభుత్వం ఆశలు పెంచుతోంది. గతంలో హామీ ఇచ్చిన విధంగా పీఆర్సీ నివేదిక ఇవ్వాలని, ఆ తర్వాత పీఆర్సీ ప్రకటించాలని ఉద్యోగులు కోరుతున్నారు. దీనిపై ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ మురిగిపోవడంతో ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు ఈ నేపథ్యంలో సీఎం జగన్ వారం పది రోజుల్లో పీఆర్సీ ఇస్తామని తిరుపతిలో ఉద్యోగులకు చెప్పారు. అయినా ఉద్యోగులు మాత్రం దీన్ని నమ్మేందుకు సిద్ధంగా లేరు. దీంతో వారు ఆందోళనలకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో ఉద్యోగుల వ్యవహారాలపై ప్రభుత్వ సలహాదారు అయిన చంద్రశేఖర్ రెడ్డి ఇవాళ మీడియా ముందుకువచ్చారు. తన 36 ఏళ్ల సర్వీసులో ఇంత మంచి ముఖ్యమంత్రిని, ప్రభుత్వాన్ని చూడలేదన్నారు. సీఎం జగన్ వారం రోజుల్లో పీఆర్సీ ఇస్తామని చెప్పినా ఉద్యోగులు ఆందోళనలు చేయడం సరికాదన్నారు. వారం రోజుల్లో పీఆర్సీ వచ్చి తీరుతుందని, ఆలోపు ఉద్యోగులు ఆందోళనలు చేయకుండా సంయమనం పాటించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల 11వ పీఆర్సీ ప్రకటనపై సీఎం జగన్ సానుకూలంగా ఉన్నారని తెలిపారు.
ఇప్పటికే పీఆర్సీ ఛైర్మన్ నివేదికను ప్రభుత్వానికి అందజేశారని చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. పీఆర్సీ ప్రకటనపై సీఎం జగన్ కూడా అధికారులకు ఆదేశాలు ఇచ్చారని, దీనిపై కసరత్తు జరుగుతోందని ఆయన పేర్కొన్నారు. కరోనా వల్ల రాష్ట్ర ప్రభుత్వ ఆదాయంపై తీవ్ర ప్రభావం పడిందని, దీన్ని ఉద్యోగులు కూడా అర్ధం చేసుకుని ప్రభుత్వానికి సహకరించాలన్నారు. వివిధ శాఖల నుంచి ప్రభుత్వానికి 71 సమస్యలపై ప్రతిపాదనలు వచ్చాయని, ఇందులో పీఆర్సీ, సీపీఎస్ రద్దు, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ ప్రధాన సమస్యలని, మిగతావి చిన్న సమస్యలేనని చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు.
Recommended Video
కేంద్ర ప్రభుత్వం కరోనా కారణంగా మూడు డీఏలు పెండింగ్ లో పెట్టిందని, రాష్ట్రం ఐదు డీఏలు పెండింగ్ లో పెట్టిందని, ఇందులో జనవరిలో ఓ డీఏ విడుదలవుతుందని చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. పీఆర్సీ విడుదల తర్వాత డీఏలు కూడా ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు. ఉద్యోగ సంఘ నేతల విమర్శలపై స్పందిస్తూ ఉద్యోగుల కుటుంబ పెద్దగా సీఎంపై కొన్ని విమర్శలు చేసినా, రేపు సమస్యలు పరిష్కారమైతే వారే తిరిగి పాలాభిషేకాలు చేస్తారని చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. గతంలో పీఆర్సీ ఇచ్చిన తర్వాతే ఆన్ లైన్ లో రిపోర్ట్ పెట్టారని ఆయన తెలిపారు. తద్వారా ఈసారి కూడా అలాగే జరుగుతుందని సంకేతాలు ఇచ్చారు.