తప్పుడు వార్తలపై జగన్ కొరడా- చంద్రబాబుతో పాటు రెండు పత్రికలకు పరువునష్టం నోటీసులు..
ఏపీలో జీవో నంబర్ 2430 అమల్లోకి వచ్చాక తొలిసారి రెండు మీడియా సంస్ధలపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. సీఎం జగన్ కు చెందిన సరస్వతీ పవర్ సంస్ధ లీజు పొడిగింపుకు సంబంధించి తప్పుడు వార్తలు ప్రచురించడమే కాకుండా ప్రభుత్వం ఇచ్చిన వివరణను కూడా ప్రచురించేందుకు నిరాకరించడంతో రెండు ప్రధాన పత్రికల యజమాన్యాలకు ప్రభుత్వం పరువునష్టం నోటీసులు పంపుతోంది.
ఆశలపల్లకిలో వైసీపీ నేతలు .. ఆ మంత్రి పదవులపై అందరి దృష్టి .. జగన్ నిర్ణయమేంటో !!
జగన్ సంస్ధపై తప్పుడు వార్తలు..
ప్రభుత్వం తాజాగా సీఎం జగన్ కు చెందిన గుంటూరు జిల్లాలోని సరస్వతీ పవర్ సంస్ధకు సున్నపురాయి గనుల లీజు కేటాయింపు గడువును 50 ఏళ్లకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇది ముఖ్యమంత్రి జగన్ కు ఉద్దేశపూర్వకంగా మేలు చేసేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంగా అభివర్ణిస్తూ రెండు ప్రధాన పత్రికలు కథనాలు ప్రచురించాయి. దీనిపై గనుల శాఖ వివరణ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకే గనుల లీజు పొడిగింపు జరిగిందని, ఇందులో ప్రభుత్వం పాత్ర ఏమీ లేదని, ఎవరికీ ప్రత్యేకంగా మేలు జరగలేదని తేల్చిచెప్పింది.
వివరణ ప్రచురించని మీడియా సంస్ధలు...
సరస్వతీ పవర్ కు గనుల లీజు పొడగింపుపై ప్రభుత్వం ఇచ్చిన వివరణను రెండు ప్రధాన పత్రికలు పట్టించుకోలేదు.దీంతో రెండు మీడియా సంస్ధలకు పరువు నష్టం కింద నోటీసులు జారీ చేస్తున్నట్లు గనులశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదీ ప్రకటించారు. ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వం, గనులశాఖ పరువుకు నష్టం కలిగించేలా వార్తలు ప్రచురించిన రెండు ప్రధాన పత్రికలకు నోటీసులు జారీ చేస్తున్న ప్రభుత్వం 15 రోజుల్లో సంతృప్తికరమైన వివరణ రాకపోతే పరువునష్టం దావా దాఖలు చేయనున్నట్లు ప్రకటించింది. అంతటితో ఆగకుండా జీవో 2430 ప్రకారం సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకోనున్నట్లు గనులశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదీ వెల్లడించారు.
చంద్రబాబుకూ నోటీసులు...
సరస్వతీ పవర్ కు సున్నపురాయి గనుల లీజు పొడిగింపుపై రెండు ప్రధాన పత్రికలు ప్రచురించిన వార్తల ఆధారంగా ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ విమర్శలు చేసిన విపక్ష టీడీపీ అధినేత చంద్రబాబుకూ నోటీసులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. మీడియా సంస్ధలతో పాటు చంద్రబాబు నుంచి వివరణ కోరాలని, సరైన వివరణ రాకపోతే 15 రోజుల్లోగా ముగ్గురిపై సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకుంటామని ఇవాళ ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఈ వ్యవహారం ఎక్కడికి వెళుతుందో అన్న చర్చ సాగుతోంది.