వైఎస్ కుటుంబ విధేయుడికి జగన్ సర్కారు షాక్- బదిలీపై వివాదాస్పద వ్యాఖ్యలకు షోకాజ్...
ఏపీ సీఎం జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలోనే కీలక పదవుల్లో పనిచేసి వైఎస్ కుటుంబానికి వీర విధేయుడిగా పేరుతెచ్చుకున్న ఓ సీనియర్ ఐపీఎస్ అధికారికి తాజాగా జగన్ సర్కారు షోకాజ్ నోటీసులు పంపింది. తన బదిలీపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ప్రభుత్వ వర్గాల్లో కలకలం రేపడంతో అఖిల భారత సర్వీసు అధికారుల నిబంధనల ఉల్లంఘన కింద సంజాయిషీ ఇవ్వాలని ఈ నోటీసుల్లో పేర్కొంది. ఇప్పటికే అధికార వర్గాల్లో ప్రభుత్వంపై అసంతృప్తి పెరుగుతుందని భావిస్తున్న తరుణంలో ఏకంగా వైఎస్ కుటుంబానికి సన్నిహితుడికే షోకాజ్ జారీ చేయడం సంచలనం రేపుతోంది.
వైఎస్ జగన్ దృష్టిలో పడ్డారు: ఏపీ మంత్రివర్గంలోకి ఎంట్రీ ఇచ్చేది వీరిద్దరే!
వైఎస్ హయాంలో మాదిరెడ్డి ప్రతాప్..
1990 బ్యాచ్ ఏపీ క్యాడర్ ఐపీఎస్ అధికారి అయిన మాదిరెడ్డి ప్రతాప్ రెడ్డి తన కెరీర్లో పోలీసు అధికారిగా కంటే పాలనా వ్యవహారాల్లోనే సమర్దుడిగా పేరు తెచ్చుకున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత ప్రీతిపాత్రుడైన ఐపీఎస్ అధికారిగా చెప్పుకునే ప్రతాప్ రెడ్డి అప్పట్లో ఐటీ, ఇన్ ఫ్రా ప్రాజెక్టుల అభివృద్ధిలో ప్రభుత్వానికి మంచి పేరు కూడా తెచ్చిపెట్టారు. వైఎస్ కుటుంబ సభ్యులతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉండేవి. వైఎస్ హెలికాఫ్టర్ ప్రమాదం జరిగిన రోజు ఆ టూర్ లో ప్రతాప్ రెడ్డి కూడా వెళ్లాల్సింది. కానీ తన బదులు సుబ్రహ్మణ్యం వెళ్లి ప్రాణాలు పోగొట్టుకున్నారు. వైఎస్ హఠాన్మరణం తర్వాత మాదిరెడ్డి ప్రతాప్ కూడా తన ప్రాధాన్యం కోల్పోయారు.
జగన్ రాకతో మళ్లీ..
దాదాపు పదేళ్ల విరామం తర్వాత తిరిగి వైసీపీ ప్రభుత్వం కొలువుదీరడంతో ఐపీఎస్ మాదిరెడ్డి ప్రతాప్ కు మంచిరోజులొచ్చాయి. గత ఏడాది కాలంలో ఏపీఐఐసీ ఎండీగా, ఏపీఎస్ఆర్టీసీ ఎండీగా కీలక పోస్టుల్లో ఆయన పనిచేశారు. ఈ రెండు సంస్ధలు తీసుకున్న ఎన్నో నిర్ణయాల్లో ఆయనదే కీలక పాత్ర. ఆర్టీసీలో అయితే ఎలక్ట్రిక్ బస్సులు, డబుల్ డెకర్ బస్సుల కొనుగోలు ప్రతిపాదనలు, కరోనా పేరుతో 7 వేల మంది ఔట్ సోర్సింగ్ సిబ్బంది తొలగింపు వంటి నిర్ణయాలు ఆయన చేసినవే. సీఎంవో అనుమతి లేకుండానే ఈ నిర్ణయాలు అన్నీ తీసుకుని ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టారన్న ఆరోపణలు ఆయనపై వచ్చాయి. దీంతో ప్రభుత్వం ఆయన్ను ఏపీఎస్పీ బెటాలియన్ అదనపు డీజీగా తాజాగా బదిలీ చేసింది.
బదిలీపై వివాదాస్పద వ్యాఖ్యలు...
ఏపీఎఎస్ ఆర్టీసీ ఎండీ పదవి నుంచి బదిలీ చేసి ఏపీఎస్పీ బెటాలియన్ అదనపు డీజీగా పంపడాన్ని ప్రతాప్ జీర్ణించుకోలేకపోయారు. వైఎస్ హయాంలో ప్రభుత్వంలో చక్రం తిప్పిన మాదిరెడ్డి ప్రతాప్ దీన్నో అవమానంగా భావించారు. తన బదిలీని ప్రభుత్వ విజ్ఞతకే వదిలేస్తున్నానని, అసంతృప్తి వ్యక్తం చేస్తూనే స్వాగతిస్తున్నానని వ్యాఖ్యానించారు. వైఎస్ హయాంలో ఐటీ కార్యదర్శిగా పనిచేశానని, అప్పటి అధికారులపై అనేక దర్యాప్తులు జరిగి సీబీఐ కేసులు నమోదయ్యాయని, తనపై మాత్రం ఒక్క దర్యాప్తు కూడా లేదని.. అదీ తన నిబద్ధత అంటూ మాదిరెడ్డి ప్రతాప్ చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వానికి మంట పుట్టించాయి. అంటే వైఎస్ హయాంలో కీలక పదవుల్లో ఉంటూ సీబీఐ దర్యాప్తు ఎదుర్కొన్న వారంతా తప్పులు చేసిన వారే అన్నట్లుగా మాదిరెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయన్న వాదన వినిపించింది. దీంతో ప్రభుత్వం సీరియస్ అయింది. అఖిల భారత సర్వీసు నిబంధనలు ఉల్లంఘించి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంపై వివరణ ఇవ్వాలని షోకాజ్ నోటీసులు పంపింది.
Recommended Video
అసలు కారణమిదే...
వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రయాణించిన హెలికాఫ్టర్లో తాను కూడా వెళ్లాల్సిందని, చివరి నిమిషంలో సుబ్రహ్మణ్యం వెళ్లి చనిపోయారని, తనకిది పునర్జన్మ అని ప్రతాప్ వ్యాఖ్యానించారు. వైఎస్ బతికుంటే రాష్ట్ర విభజన జరిగి ఉండేది కాదంటూ పేర్కొన్నారు. అయితే మాదిరెడ్డి వ్యాఖ్యలు ఎలా ఉన్నా.. ఆర్టీసీలో ఆయన తీసుకున్న నిర్ణయాలు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడంతోనే ఆయనపై బదిలీ వేటు పడిందన్న ప్రచారం సాగుతోంది. ముఖ్యంగా ఆర్టీసీలో జరిగిన కొన్ని డిజిటల్ చెల్లింపుల్లో అక్రమాలు జరిగాయనే వార్తలు రావడం, ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలు వివాదాస్పదం కావడం ఆయనకు చెడ్డ పేరు తెచ్చాయి. దీంతో కొంతకాలంగా మౌనంగా ఉన్నారు. అయితే తాజాగా ప్రభుత్వం తిరిగి తన సొంత శాఖకు సంబంధించిన పోస్టుకు బదిలీ చేయడంతో ఆయనకు చిర్రెత్తుకొచ్చింది. ఇంత విధేయత చూపినా అవమానాలే మిగిలాయన్న కోణంలో ఆయన వ్యాఖ్యలు చేయగా...ప్రభుత్వం కూడా అంతే సీరియస్ గా స్పందించి నోటీసులు పంపింది.