జగన్ సర్కార్ స్వామిభక్తి- ఏపీ గుళ్లలో స్వరూపానంద పుట్టినరోజు జరపాలని ఆదేశాలు
ఏపీలో విశాఖ శారదాపీఠాధిపతి స్వరూపానందకూ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు ఉన్న అవినాభావ సంబంధం తెలిసిందే. జగన్ సీఎం కాకముందు నుంచే విశాఖ పీఠాన్ని పలుమార్లు దర్శించుకోవడం, అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా స్వరూపానంద ఆదేశాలకు అనుగుణంగా నడుచుకోవడం జరుగుతూనే ఉన్నాయి. అయితే వీటన్నింటికీ పరాకాష్టగా జగన్ సర్కారు తీసుకున్న మరో నిర్ణయం వివాదాస్పదమవుతోంది.
ఈ నెల 18న స్వరూపానంద పుట్టినరోజు. ఈ సందర్భంగా ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేనట్లుగా ఓ కొత్త ఆదేశాలు జారీ చేసింది. విశాఖ శారదాపీఠాధిపతి స్వరూపానంద పుట్టినరోజు వేడుకలను ఏపీలోని అన్ని గుళ్లలోనూ అధికారికంగా నిర్వహించాలని దేవాదాయశాఖ తరఫున కమిషనర్ రామచంద్రమోహన్ జారీ చేసిన ఆదేశాలు వివాదాస్పదం అయ్యాయి. శ్రీకాకుళంలోని అరసవిల్లి సూర్యదేవాలయం నుంచి మొదలుపెట్టి ద్వారకాతిరుమల, రామతీర్ధం, సింహాచలం, కనక మహాలక్ష్మి ఆలయం, అన్నవరం, అంతర్వేది, మావుళ్లమ్మ అలయాల ఈవోలకు ఈ మేరకు ఆదేశాలు ఇచ్చారు.
Recommended Video
వాస్తవానికి స్వరూపానంద పుట్టినరోజు వేడుకలను ఏపీలోని గుళ్లలో అధికారికంగా నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ శారదాపీఠం నుంచి ప్రభుత్వానికి ఈ నెల 9న ఓ లేఖ వచ్చింది. ఈ లేఖను జత చేస్తూ ఆలయాల కార్యనిర్వాహణాధికారులకు దేవాదాయశాఖ ఆదేశాలు ఇవ్వడం వివాదం రేపుతోంది. గతంలో ఎప్పుడూ ఇలాంటి సంప్రదాయాలు లేవని, సీఎం మొప్పు కోసం దేవాదాయశాఖ ఇలా చేస్తోందా, లేక ఆయన ఆదేశాల మేరకే చేస్తోందా అన్న చర్చ జరుగుతోంది.