గిరిజన ఉద్యోగులకు జగన్ షాక్ - ఇక వారు అక్కడ పనిచేయాల్సిందే...
దేశవ్యాప్తంగా గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వాలు కోట్లాది రూపాయలు ఖర్చుపెడుతున్నా, గిరిజనుల అభివృద్ధికి భారీ పథకాలు ప్రవేశపెడుతున్నా ఫలితం మాత్రం ఉండటం లేదు. ఏపీలోనూ ఇదే పరిస్ధితి. ప్రభుత్వం గిరిజనులకు రిజర్వేషన్ల దగ్గర నుంచి అన్ని విధాలా ఆదుకునేందుకు పలు సంక్షేమ ఫథకాలు తీసుకొస్తున్నా వారిలో అవగాహన పెంచడంలో ఆ శాఖ ఉద్యోగులే విఫలం అవుతున్నారు. దీంతో గిరిజనుల్లో వెనుకబాటుతనానికి ప్రభుత్వమే కారణమన్న అపప్రద ఎదుర్కోక తప్పడం లేదు. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
ఏపీలోని గిరిజన ప్రాంతాల్లో పనిచేసే ఉద్యోగులు ఇకపై తాము పనిచేసే ప్రాంతాల్లోనే నివాసం ఉండాలని ప్రభుత్వం కీలక ఆదేశాలు ఇచ్చింది. ఇప్పటికే ఈ నిబంధన ఉన్నప్పటికీ ఉద్యోగులు మాత్రం దాన్ని యథేచ్చగా ఉల్లంఘిస్తున్నారు. గిరిజన ప్రాంతాల్లో ఉన్న ఐటీడీఏతో పాటు ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు.. నివాసాలు మాత్రం పక్కనే ఉన్న పట్టణాలు, నగరాల్లో ఉంటున్నాయి.
దీంతో ఇకపై ఇలాంటి చర్యలను సహించబోమని సీఎం జగన్ సంకేతాలు ఇచ్చారు. ప్రభుత్వ పథకాలు పక్కాగా అమలు కావాలంటే గిరిజిన ఉద్యోగులు తాము పనిచేసే చోట ఉండాల్సిందేనని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
వీరితో పాటు గిరిజన ప్రాంతాల్లో ఉద్యోగాలు పొంది సదుపాయాలు, ఇతర కారణాలతో వేరే ప్రాంతాల్లో డిప్యూటేషన్ వేయించుకుని పనిచేస్తున్న మిగిలిన ఉద్యోగులను కూడా తక్షణం ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్లాలని ప్రభుత్వం సూచించింది. ఇలా ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారి జాబితాను 24 గంటల్లో సిద్ధం చేయాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.