అవినీతి నిర్మూలనపై జగన్ కీలక నిర్ణయం- త్వరలో అసెంబ్లీలో బిల్లు...
ఏపీ అధికార యంత్రాంగంలో మితిమీరుతున్న అవినీతికి అడ్డుకట్టే వేసేందుకు మరింత కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం సిద్దం చేస్తున్న ప్రణాళికపై చర్చించేందుకు ఇవాళ సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, ఏసీబీ డీజీ పి ఎస్ ఆర్ ఆంజనేయలు, వివిధ శాఖల ఉన్నతాధికారులు, ఐఐఎం అహ్మదాబాద్ ప్రతినిధులతో సీఎం జగన్ సమావేశమయ్యారు. ఈ భేటీలో జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఇకపై రాష్ట్రంలో అవినీతి పరుల ఆటకట్టించేందుకు వీలుగా ఓ చట్టాన్ని తీసుకురావాలని సీఎం జగన్ నిర్ణయించారు. ఇకపై లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా దొరికితే నిర్ణిష్ట సమయంలో చర్యలు తీసుకునేలా ప్రస్తుత చట్టాల్లో మార్పులు చేస్తూ ఓ కొత్త చట్టాన్ని తీసుకురానున్నారు. ఈ చట్టం ఇప్పటికే అసెంబ్లీ ఆమోదించిన దిశ చట్టం తరహాలో నిర్ణీత సమయంలో దోషులకు శిక్షలు ఖరారు చేసేలా ఉండాలని జగన్ నిర్ణయించారు. ఈ మేరకు బిల్లు తయారు చేయాలని అధికారులకు జగన్ ఆదేశాలు ఇచ్చారు.
తాజా బిల్లులు పలు మార్పులను జగన్ సూచించారు. ఇందులో ప్రస్తుతం 1902 నంబర్కు వచ్చే కాల్స్తో పాటు అవినీతికి సంబంధించిన అన్ని అంశాలూ ఏసీబీకి చెందిన 14400కు బదలాయించనున్నారు. వార్డు, గ్రామ సచివాలయాల నుంచి వచ్చే ఫిర్యాదులు దీనికి అనుసంధానం చేస్తారు. ఎమ్మార్వో, ఎండీవో, సబ్ రిజిస్ట్రార్, మున్సిపల్, టౌన్ ప్లానింగ్ విభాగాల్లో అవినీతిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు జగన్ సూచించారు.
ప్రభుత్వంలోని ప్రతీ విభాగంలోనూ రివర్స్ టెండరింగ్ అమలు చేయాలని ఆదేశాలు ఇచ్చారు. టెండర్ విలువ కోటి దాటిందంటే రివర్స్ టెండరింగ్కు వెళ్లాలని సీఎం సూచించారు. కర్నూలు జిల్లా పిన్నాపురం విద్యుత్ ప్రాజెక్టుతో పాటు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రాజెక్టులోనూ గత ప్రభుత్వానికీ, ఇప్పటి ప్రభుత్వానికీ తేడా స్పష్టమైందని ఈ సందర్భంగా అధికారులకు జగన్ గుర్తుచేశారు.