చంద్రబాబు మరో నిర్ణయానికి జగన్ ఎసరు.. ఉద్యోగుల రిటైర్మెంట్ పై కీలక నిర్ణయం ? త్వరలో ఉత్తర్వులు..
గత టీడీపీ ప్రభుత్వ హయాంలో సీఎంగా చంద్రబాబు తీసుకున్న పలు నిర్ణయాలకు చెక్ పెడుతున్న సీఎం జగన్ మరో కీలక నిర్ణయానికి సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. ఉద్యోగుల విషయంలో ఇప్పటికే పలు సానుకూల నిర్ణయాలు తీసుకుంటున్న జగన్ సర్కార్.. వారికి మరో ఊరట ఇచ్చే దిశగా ఈ నిర్ణయం తీసుకోబోతోంది. ఇది అమలైతే రెండు విధాలుగా ప్రభుత్వానికి, ఉద్యోగులకు ప్రయోజనం కలుగుతుందని తెలుస్తోంది.
2014లో ఏపీ విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం నిధుల కొరత, అప్పుల ఊబిలో కూరుకుపోయి ఉంది. ఉద్యోగులకు కచ్చితంగా జీతాలు ఇస్తారో లేదో కూడా తెలియని పరిస్ధితి. కొత్త నియామకాల గురించి మాట్లాడే పరిస్ధితి లేదు. దీంతో ఉన్న ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును 57 సంవత్సరాల నుంచి 60 ఏళ్లకు పెంచారు. తద్వారా మూడేళ్ల పాటు రిటైర్ అయిన ఉద్యోగులకు పదవీ విరమణ సందర్భంగా ఇచ్చే ప్రయోజనాలు కల్పించే విషయంలో కాస్త ఊరట దక్కింది.
కానీ ఇప్పుడు పరిస్ధితులు మారాయి. రాష్ట్రం కాస్త ఆర్ధికంగా నిలదొక్కుకుంది. గతేడాది అధికారంలోకి రాగానే వైసీపీ ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా రికార్డు స్ధాయిలో లక్షా 27 వేల కొత్త ఉద్యోగాలు కల్పించింది. ఆ తర్వాత కూడా వరుసగా పలు నోటిఫికేషన్లు విడుదల చేస్తోంది. దీంతో వయోభారంతో ప్రభుత్వ ఉద్యోగులను 60 ఏళ్ల వరకూ పని చేయించడం అవసరమా అన్న ప్రశ్న తలెత్తింది. దీనిపై ప్రభుత్వం పునరాలోచన చేస్తోంది. ఉద్యోగుల జీవితాల్లో పెరుగుతున్న ఒత్తిడిని తగ్గించే క్రమంలో తిరిగి రిటైర్మెంట్ వయసును 57 ఏళ్లకు తగ్గించాలని సర్కారు భావిస్తోంది. దీని వల్ల అత్యధిక వేతనాలు పొందుతున్న వృద్ధుల స్ధానంలో లక్షల మంది యువతకు కొత్త ఉద్యోగాలను కల్పించవచ్చనే ఆలోచనతో ఉంది. కాబట్టి రిటైర్మెంట్ వయసు తగ్గింపుపై రెండు మూడు రోజుల్లో దీనిపై ఉత్తర్వులు విడుదల కానున్నట్లు తెలుస్తోంది.