నిమ్మగడ్డకు జగన్ సర్కార్ షాక్- ద్వివేదీ, గిరిజా శంకర్ అభిశంసన వెనక్కి- కేంద్రం చేతుల్లో
ఏపీలో సుప్రీంకోర్టు తీర్పు తర్వాత పంచాయతీ ఎన్నికల నిర్వహణ విషయంలో ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా గతంలో తాను చెప్పినట్లు ఓటర్ల జాబితా పంపని పంచాయతీరాజ్ రాజ్ శాఖకు చెందిన ఇద్దరు సీనియర్లు ఐఏఎస్ అధికారులు గోపాలకృష్ణ ద్వివేదీ, గిరిజా శంకర్లను అభిశంసన చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చారు. అయితే ఈ ఆదేశాలను ప్రభుత్వం తిరస్కరించింది.
ద్వివేదీ, గిరిజాశంకర్ల అభిశంసన
పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం 2021 జనవరి నాటికి నమోదైన ఓటర్లతో జాబితా తయారు చేసి పంపాలని పంచాయతీ రాజ్శాఖకు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారులు గోపాల కృష్ణ ద్వివేదీ, గిరిజా శంకర్లను గతంలో ఎస్ఈసీ నిమ్మగడ్డ కోరారు. అయితే ప్రభుత్వ ఆదేశాలతో వారు మౌనంగా ఉండిపోయారు. దీనిపై తాజాగా సీరియస్ అయిన నిమ్మగడ్డ్ వీరిద్దరిపై అభిశంసన కింద చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రభుత్వానికి ఆదేశాలు పంపారు. దీనిపై ప్రభుత్వం ఇరుకునపడింది. అభిశంసనతో పాటు వారిపై బదిలీ వేటు వేయాలని కూడా ఎస్ఈసీ కోరినా ప్రభుత్వం స్పందించలేదు.
అభిశంసన తిప్పిపంపిన జగన్ సర్కార్
పంచాయతీ రాజ్శాఖకు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారులు గోపాల కృష్ణ ద్వివేదీ, గిరిజా శంకర్లపై జారీ చేసిన అభిశంసన చర్యలను ప్రభుత్వం తాజాగా ఎస్ఈసీ నిమ్మగడ్డకు తిప్పిపంపింది. అఖిల భారత సర్వీసు అధికారులపై అభిశంసన చర్యలు తీసుకునే అధికారం ఎస్ఈసీకి లేదంటూ సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ లేఖ రాసినట్లు తెలుస్తోంది. అధికారుల నుంచి వివరణ కోరకుండా, నోటీసులు జారీ చేయకుండా అభిశంసన చర్యలను జారీ చేయలేరని సీఎస్ ఇందులో చెప్పినట్లు సమాచారం.
అభిశంసన తిరస్కరిస్తున్నామన్న మంత్రి పెద్దిరెడ్డి
మరోవైపు పంచాయతీరాజ్శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా ఈ విషయాన్ని నిర్ధారించారు. చిత్తూరు జిల్లాల్లో మాట్లాడిన మంత్రి పెద్దిరెడ్డి తమ శాఖకు చెందిన ఇద్దరు అధికారులపై అభిశంసన చర్యలు తీసుకోవాలని ఎస్ఈసీ పంపిన ఉత్తర్వులను వెనక్కి పంపుతున్నట్లు నిర్దారించారు. ఈ మేరకు ఎస్ఈసీ రాసిన 9 పేజీల లేఖను తిప్పిపంపుతున్నామన్నారు. ఐఏఎస్ అధికారులు ద్వివేదీ, గిరిజా శంకర్ యథాతథంగా తమ స్ధానాల్లో కొనసాగుతారని స్పష్టం చేశారు. దీంతో ప్రభుత్వం సదరు ఐఏఎస్ల వ్యవహారంలో స్పష్టతతో ఉన్నట్లు తెలుస్తోంది.
నిమ్మగడ్డ ముందున్న ఆప్షన్స్ ఏంటి ?
పంచాయతీ ఎన్నికల కోసం ఓటర్ల జాబితా తయారు చేసి పంపడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ ద్వివేదీ, గిరిజా శంకర్పై అభిశంసన చర్యలకు సిఫార్సు చేస్తూ నిమ్మగడ్డ ఏపీ సర్కారుతో పాటు కేంద్రానికీ ప్రతిపాదనలు పంపారు. ఇప్పుడు అఖిల భారత సర్వీసు అధికారులపై ఎస్ఈసీ చర్యలు తీసుకోలేరంటూ ప్రభుత్వం తిప్పిపంపుతున్న నేపథ్యంలో కేంద్రం వారిపై అభిశంసనను సమర్ధించాలని నిమ్మగడ్డ కోరనున్నారు. ఓసారి కేంద్రం అభిశంసనను సమర్ధిస్తే మాత్రం ఈ ఇద్దరు ఐఏఎస్లకు ఇబ్బందులు తప్పకపోవచ్చు.
అలాగే ప్రభుత్వానికి చుక్కెదురు కావడం ఖాయం. మరి కేంద్రం దీనిపై ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి ఉంది.
Recommended Video