జగన్ సర్కార్ విదేశీ అప్పుపై దుమారం- వ్యతిరేకిస్తున్న ఆర్బీఐ.. కేంద్రం కరుణిస్తుందా ?
గతేడాది ఏపీలో వైసీపీ సర్కారు కొలువుదీరిన కొత్తలో సీఎం జగన్ అమెరికాతో పాటు పలు దేశాల్లో పర్యటించారు. వైసీపీకి సన్నిహితంగా ఉండే కొందరు ప్రవాసాంధ్రుల సాయంతో ఏపీలో భారీ పెట్టుబడులకు ప్రతిపాదన పెట్టారు. వారు కూడా సరేనన్నారు. ఆ తర్వాత ప్రైవేటు వ్యక్తుల నుంచి రాష్ట్రాలు నిధులు తీసుకునేందుకు వెసులుబాటు లేకపోవడంతో చివరికి ఓ ట్రస్టు ఏర్పాటు చేసి అదే మొత్తాన్ని అప్పు రూపంలో ప్రభుత్వానికి ఇచ్చేలా ఒప్పించారు. దీనికీ ఆర్బీఐ కొర్రీలు పెట్టింది. దీంతో ఈ వ్యవహారం ఇప్పుడు కేంద్రం కోర్టులో ఉంది.
సీఎం జగన్ కు ఏపీ డాక్టర్ల సంఘం లేఖ- సుధాకర్ ఉదంతం తర్వాత అవే డిమాండ్లతో..
విదేశీ అప్పు ప్రయత్నాలు..
వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో సీఎం జగన్ తనకున్న పలుకుబడితో అమెరికాలోని ప్రవాసాంధ్రులను ఏపీలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఆహ్వానించారు. వారి నుంచి సానుకూల స్పందన వ్యక్తమైంది. రూ.7500 కోట్ల మేర భారీ పెట్టుబడులకు రంగం సిద్ధమైంది. అయితే విదేశాల్లోని వ్యక్తుల నుంచి ప్రభుత్వాలు నేరుగా పెట్టుబడులు లేదా అప్పులు తీసుకునేందుకు మన దేశంలో ఫెరా నిబంధనలు అనుమతించవు. అయితే ప్రైవేటు ట్రస్టు ఏర్పాటు చేసి నిధులు తీసుకునేందుకు అవకాశం ఉందని భావించి ఏపీ ప్రభుత్వం ఆ దిశలో ప్రయత్నాలు చేసింది. గతంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చిన వారితో ఓ ట్రస్టు ఏర్పాటు చేయించి వారి నుంచే అప్పు రూపంలో ఈ నిధులు తీసుకునేలా ప్రయత్నాలు చేసింది.
ఫెరా నిబంధనల పేరుతో ఆర్బీఐ కొర్రీలు..
మన దేశంలో ప్రభుత్వాలు విదేశీ వ్యక్తుల నుంచి లేదా ట్రస్టుల నుంచి పెట్టుబడులు కానీ అప్పులు కానీ తీసుకునేందుకు ఫెరా నిబంధనలు అనుమతించడం లేదు. ఇలా విదేశీ అప్పులు తీసుకుంటే అక్కడి కరెన్సీకి, మన కరెన్సీకి మధ్య ఉన్న వ్యత్యాసం కారణంగా వాటి చెల్లింపు సమయంలో విదేశీ మారక ద్రవ్యం భారీగా కోల్పోతుండటమే ఇందుకు కారణం. దీంతో ఏపీ సర్కారు విదేశాల నుంచి తీసుకోవాలని భావించిన రూ.7500 కోట్ల అప్పుకూ ఈ బాధలు తప్పలేదు. గతంలోనూ వివిధ రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చిన ఇలాంటి ప్రతిపాదనలను కేంద్రం కూడా తిరస్కరించింది. దీంతో ఈసారి ఆర్బీఐ పెట్టిన కొర్రీలను కేంద్రం కాదనే పరిస్ధితి కనిపించడం లేదు.
కేంద్రంతో లాబీయింగ్..
ఫెరా నిబందనల పేరుతో విదేశాల నుంచి తీసుకునే అవకాశం ఉన్న భారీ అప్పును ఆర్బీఐ వ్యతిరేకిస్తుండటంతో ప్రస్తుత పరిస్ధితులను, రాష్ట్ర ప్రభుత్వ ఆర్ధిక పరిస్ధితిని దృష్టిలో ఉంచుకుని మినహాయింపు ఇవ్వాలని తాజాగా ఢిల్లీ పర్యటనలో ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కేంద్రంలోని పెద్దలను కోరారు. అయితే ఫెరా నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్న ఈ ప్రతిపాదనను తమ స్ధాయిలో ఆమోదించలేమని ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ సహా మిగతా కేంద్రమంత్రులు, అధికారులు కూడా నిస్సహాయత వ్యక్తం చేశారు. దీంతో ఈ వ్యవహారం ఇప్పట్లో తేలేలా కనిపించడం లేదు. కేంద్రం కూడా దీనికి ప్రత్యామ్నాయంగా నాబార్డు రుణాలు తీసుకోవాలని సూచిస్తోంది. నాబార్డు రుణాల్లో మినహాయింపులు కూడా ఎక్కువగా ఉంటాయని, విదేశీ మారకద్రవ్య సమస్యలు ఉండబోవని చెబుతోంది. కానీ ఇప్పటికే దేశీయంగా గతంలో చంద్రబాబు ప్రభుత్వం చేసిన అఫ్పులే ఎక్కువ కావడంతో మళ్లీ ఇంత భారీ అప్పు పుట్టే అవకాశాలు లేవు.
Recommended Video
త్వరలో ఢిల్లీకి జగన్..
విదేశీ ట్రస్టు నుంచి వేల కోట్ల రుణం తీసుకునేందుకు అనుమతించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా మినహాయింపు ఇవ్వాల్సి ఉంటుంది. మిగతా విషయాల్లో ఎలాగో కేంద్రంతో రాజీపడుతున్న సీఎం జగన్... ఈ ప్రతిపాదనను నేరుగా ప్రధాని మోడీ దృష్టికి తీసుకెళ్లి తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు త్వరలో జగన్ ఢిల్లీ పర్యటన ఉంటుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఆర్ధిక మంత్రి బుగ్గన లాబీయింగ్ ఫలించకపోవడంతో ఇక నేరుగా జగనే రంగంలోకి దిగి ప్రధాని వద్ద ఈ ప్రతిపాదనకు ఆమోదముద్ర వేయించుకునేందుకు ప్రయత్నిస్తారని తెలుస్తోంది. అయితే ప్రస్తుతం కరోనా సంక్షోభంతో అన్ని రాష్ట్రాలూ అప్పుల్లో కూరుకుపోయాయి. ఏపీకి మాత్రమే మినహాయింపు ఇస్తే మిగతా రాష్ట్రాల నుంచి కూడా ఇదే డిమాండ్ తలెత్తే అవకాశం ఉండటంతో ప్రధాని దీనిపై ఏ నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.