పాలనపై పట్టు బిగిస్తున్న జగన్.. నిన్న ఐఏఎస్.. నేడు ఐపీఎస్ల ట్రాన్స్ఫర్.. ఎవరిని ఎక్కడ నియమించారంటే
అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాలనపై పట్టు బిగిస్తున్నారు. ప్రభుత్వ వ్యవహారాల్లో తనదైన ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్న ఆయన.. ఇందులో భాగంగా అన్ని శాఖలను ప్రక్షాళన చేస్తున్నారు. ప్రమాణ స్వీకారం చేసిన రోజునే చాలా మంది అధికారులకు స్థానచలనం కల్పించిన జగన్.. శనివారం ఒకేసారి 47మంది ఐఏఎస్లను బదిలీ చేశారు. తాజాగా ఆదివారం 22 మంది ఐపీఎస్లను ట్రాన్స్ఫర్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఉత్తర్వులు జారీ చేశారు.
గుంటూర్ రేంజ్ కమిషనర్ ఆర్ కే మీనా
పోస్టింగ్ కోసం వేచి చూస్తున్న 1987 బ్యాచ్కు చెందిన ఐపీఎస్ ఏఆర్ అనురాథ రాష్ట్ర విపత్తులు, అగ్నిమాపక శాఖ డీజీపీగా నియమించారు. ఆ స్థానంలో ఉన్న సత్యనారాయణను డీజీపీ ర్యాంక్ ఎక్స్ క్యాడర్ పోస్ట్ సృష్టించి పీటీఓ ఐజీగా అపాయింట్ చేశారు. పోస్టింగ్ కోసం వేచిచూస్తున్న ఏడీజీపీ ఎన్ బాలసుబ్రహ్మణ్యంను సాధారణ పరిపాలన శాఖకు, రోడ్ సేఫ్టీ ఏడీజీపీ శ్రీధర్ రావును పోలీసు సంక్షేమం, క్రీడల ఏడీజీగా, గుంటూర్ రేంజ్ కమిషనర్ ఆర్ కే మీనాను విశాఖ పోలీస్ కమిషనర్గా బదిలీ చేశారు. మహేష్ చంద్రలడ్డాకు పోలీస్ పర్సనల్ ఐజీ, వినీత్ బ్రిజ్లాల్కు గుంటూర్ రేంజ్ ఐజీ, బీ శ్రీనివాసులుకు ఏపీఎస్బీ ఐజీ బాధ్యతలు అప్పజెప్పారు. టెక్నికల్ సర్వీసెస్ ఐజీ సీహెచ్ శ్రీకాంత్ను ఇంటలిజెన్స్ డీఐజీగా, జి పాలరాజుకు టెక్నికల్ సర్వీసెస్ డీఐగా ప్రభుత్వం నియమించింది.
ఇంటలిజెన్స్ ఎస్పీగా కె.వి. మోహన్రావు
విశాఖ రేంజ్ డీఐజీగా ఎల్.కె.వి రంగారావు, అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్ ఐజీ ఎస్ హరికృష్ణ, ఇంటలిజెన్స్ ఎస్పీగా కె.వి. మోహన్రావు, సీఐడీ ఎస్పీగా జి.వి.కె. అశోక్ కుమార్కు బాధ్యతలు అప్పగించారు. సర్వశ్రేష్ఠ త్రిపాఠీని ఏపీఎస్పీ బెటాలియన్ అనంతరం కమాండెంట్గా, కోయ ప్రవీణ్ను పోలీస్ హెడ్ క్వార్టర్స్, రైల్వే ఎస్పీగా విక్రాంత్ పాటిల్, విశాఖ సిటీ శాంతిభద్రతల డీసీపీగా ఎస్ రంగారెడ్డి, విజయవాడ రైల్వే ఎస్పీగా నారాయణ్ నాయక్, ఎం.దీపికను కర్నూలు ఏఎస్పీ, జి ఆంజనేయులనుకు పోలీస్ హెడ్ క్వార్టర్స్కు ట్రాన్స్ఫర్ చేస్తారు.
అనుకూలంగా అధికారులకు కీలక పోస్టులు
అధికారం చేపట్టిన నాటి నుంచి అధికారుల వ్యవహారశైలిని సమీక్షిస్తున్న సీఎం జగన్ వారి పనితీరును బట్టి బదిలీలు చేసినట్లు తెలుస్తోంది. గతంలో వైసీపీకి వ్యతిరేకంగా పనిచేసినవారికి దూరంగా పెట్టడంతో పాటు పాలనలో తనకు అన్నివిధాలా సహాయసహకారాలు అందించే వారికి కీలక పోస్టుల్లో నియమించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా వివాదాస్పదులుగా పేరున్న అధికారులను పక్కన బెట్టిన జగన్.. తనకు అనుకూలంగా ఉండే ఆఫీసర్లను అందలం ఎక్కించినట్లు తెలుస్తోంది.