ఆర్డినెన్స్ సక్రమమే, సంస్కరణల కోసమే నిమ్మగడ్డ తొలగింపు.. హైకోర్టులో జగన్ సర్కార్ కౌంటర్...
ఏఫీ ఎన్నికల కమిషనర్ పదవి నుంచి తనను తొలగిస్తూ నిమ్మగడ్డ రమేష్ కుమార్ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై ఏపీ ప్రభుత్వం ఇవాళ కౌంటర్ అఫిడవిట్ వేసింది. ఇందులో నిమ్మగడ్డ తొలగింపు కోసం తాము తీసుకొచ్చిన ఆర్డినెన్స్... ఎన్నికల సంస్కరణల్లో భాగమేనని ప్రభుత్వం తేల్చిచెప్పింది. ఇందులో ఎలాంటి దురుద్దేశాలూ లేవని పేర్కొంది. ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా మార్చేందుకు తమ ప్రభుత్వం పంచాయతీ రాజ్ చట్టంలోనూ పలు సవరణలు చేసినట్లు ప్రభుత్వం కౌంటర్ లో గుర్తు చేసింది.
నిమ్మగడ్డ పిటిషన్ పై కౌంటర్...
తన తొలగింపును సవాలు చేస్తూ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ హైకోర్టులో దాఖలు చేసిన రిట్ పిటిషన్ కు ఏపీ ప్రభుత్ం తరఫున పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదీ ఇవాళ కౌంటర్ దాఖలు చేశారు. ఇందులో నిమ్మగడ్డ తొలగింపుకు దారి తీసిన కారణాలతో పాటు ప్రభుత్వం చేపట్టిన ఎన్నికల సంస్కణలను సుదీర్ఘంగా వివరించారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్ లో పలు తప్పుడు అభియోగాలున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. తన తొలగింపు కోసమే ఏపీ ప్రభుత్వం ఆర్డినెన్స్ తెచ్చిందనడాన్ని తప్పుబట్టింది. ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకే ఆర్డినెన్స్ తీసుకొచ్చినట్లు ప్రభుత్వం పేర్కొంది.
ఎన్నికల సంస్కరణల్లో భాగమే..
ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ తొలగింపు ఎన్నికల ప్రక్రియ సజావుగా, పారదర్శకంగా సాగేందుకు ప్రభుత్వం తీసుకున్న పలు చర్యల్లో భాగమేనని కౌంటర్ అఫిడవిట్ లో పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కాకముందే పంచాయతీరాజ్ చట్టంలో చేసిన సవరణలను, తాజా ఆర్డినెన్స్ ను కలిపి ప్రస్తావిస్తూ ఇవన్నీ ఎన్నికల సంస్కరణలుగా ప్రభుత్వం పేర్కొంది. ఆర్టికల్ 243 ప్రకారం ఎన్నికల కమిషనర్ పదవీకాలాన్ని నిర్ణయించే అధికారం గవర్నర్ కు ఉందని, దాన్ని సర్వీస్ రూల్స్ తో కలిపి చూడాల్సిన అవసరం లేదని ప్రభుత్వం కౌంటర్ లో పేర్కొంది.
ఎన్నికల కమిషన్ సంస్కరణ...
రాష్ట్ర ఎన్నికల కమిషన్ లో పాలనా పరమైన సంస్కరణలు తీసుకొచ్చేందుకు వీలుగానే ఆర్డినెన్స్ తీసుకొచ్చామని, దీన్ని రాజ్యాంగ పదవిలో ఉన్న గవర్నర్ కూడా ఆమోదం తెలిపారని ప్రభుత్వం కౌంటర్ లో ప్రస్తావించింది. ఓసారి గవర్నర్ ఆమోదం లభించాక ఆర్డినెన్స్ ను ప్రశ్నించడం, దానికి దురుద్దేశాలు ఆపాదించడం సరికాదని ప్రభుత్వం తెలిపింది. 2000 సంవత్సరం తర్వాత ఏపీలో జరిగిన స్ధానిక సంస్ధల ఎన్నికల్లో పలు ఇబ్బందులు తలెత్తాయని, అందుకే కమిషనర్ గా హైకోర్టు జడ్జి స్ధాయి వ్యక్తి ఉండాలనే మార్పులు చేశామని ప్రభుత్వం తెలిపింది. ఇవి కేవలం నిమ్మగడ్డ రమేష్ కుమార్ నో, ప్రస్తుత కమిషనర్ నో ఉద్దేశించి తీసుకొచ్చిన సంస్కరణలు కాదని, భవిష్యత్తులోనూ ఇవి కొనసాగుతాయని పేర్కొంది.
Recommended Video
నిమ్మగడ్డ నిష్పాక్షిక ఎన్నికలు నిర్వహించలేరు....
కరోనా విషయంలో నిమ్మగడ్డ ప్రభుత్వాన్ని సంప్రదించలేదని, ఎన్నికలు వాయిదా పడినా కోడ్ కొనసాగుతుందని నిమ్మగడ్డ ప్రకటించడం సరికాదని ప్రభుత్వం గుర్తుచేసింది. అలాగే స్ధానిక ఎన్నికల వాయిదా నిర్ణయం మీడియా తర్వాతే ప్రభుత్వానికి చేరిన విషయాన్నీ ప్రస్తావించింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ ను, తన తొలగింపును హైకోర్టులో సవాలు చేసిన తర్వాత నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆధ్వర్యంలో ఎన్నికలు నిష్పాక్షికంగా జరుగుతాయని తాము అనుకోవడం లేదని ప్రభుత్వం అఫిడవిట్ లో పేర్కొంది. స్ధానిక ఎన్నికల వాయిదా తర్వాత తనకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి బెదిరింపులొస్తున్నాయనే పేరుతో ఆయన కేంద్ర సాయం కోరడమే ఇందుకు నిదర్శనమని అఫిడవిట్ లో పేర్కొన్నారు. కాబట్టి స్ధానిక ఎన్నికలను సైతం కేంద్ర ఎన్నికల సంఘం లేదా ముగ్గురు సభ్యుల రాష్ట్ర ఎన్నికల సంఘం ద్వారా జరిపించాలని కౌంటర్ లో ప్రభుత్వం హైకోర్టును కోరింది.
కాబట్టి ఎన్నికల వాయిదా తర్వాత నిమ్మగడ్డ చేపట్టిన చర్యలు సరికాదని, ప్రభుత్వ ఆర్డినెన్స్ రాజ్యాంగ పరిధిలోనే ఉన్నందున నిమ్మగడ్డ పిటిషన్ తిరస్కరించాలని హైకోర్టును ప్రభుత్వం కోరింది.