సుప్రీం తీర్పుకు కట్డుబడతాం- అమలుపై చర్చిస్తున్నాం- జగన్ సర్కార్ రియాక్షన్
ఏపీలో పంచాయతీ ఎన్నికల నిర్వహణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో వైసీపీ సర్కారు కచ్చితంగా ఎన్నికలకు సహకరించాల్సిన పరిస్ధితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఎన్నికలకు సర్కారు సహకరిస్తుందా లేక ఇంకా అడ్డుకునేందుకు దారులు వెతుకుతుందా అన్న చర్చ సాగుతోంది. ఇందులో ఉద్యోగ సంఘాల పాత్ర ఎలా ఉండబోతోందన్న చర్చ కూడా జరుగుతోంది. మరోవైపు సుప్రీం తీర్పుపై సీఎం జగన్.. తన క్యాంపు ఆఫీసులో మంత్రులు, డీజీపీ, ఏజీతో కీలక చర్చలు కూడా జరిపారు. అనంతరం సచివాలయంలో మాట్లాడిన మంత్రులు పెద్దిరెడ్డి, కన్నబాబు సుప్రీంతీర్పుకు కట్టుబడి ఉంటామన్నారు.
Recommended Video
జగన్ సర్కార్ ఫస్ట్ రియాక్షన్ ఇదే
ఏపీలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాల్సిందేనంటూ సుప్రీంకోర్టు ఇవాళ ఇచ్చిన తీర్పుపై ప్రభుత్వం తొలిసారిగా స్పందించింది. సీఎం జగన్తో సుప్రీంకోర్టు తీర్పు, అనంతర పరిణామాలపై చర్చించిన మంత్రులు అనంతరం స్పందించారు. పంచాయతీ పోరుపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు కట్టుబడతామని మంత్రి కన్నబాబు తెలిపారు. అత్యున్నత న్యాయస్ధానంపై తమకు గౌరవం ఉందన్నారు. దీంతో ప్రభుత్వం ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డకు సహకరించబోతోందని స్పష్టం చేసినట్లయింది. అదే జరిగితే ఇక రాష్ట్రంలో స్ధానిక సంస్ధల ఎన్నికల విషయంలోజరుగుతున్న చర్చకు తెరపడినట్లే భావించవచ్చు.
ప్రజారోగ్యంతో నిమ్మగడ్డ చెలగాటం
పంచాయతీ ఎన్నికలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు కట్టుబడి ఉంటామని చెప్పిన మంత్రి కన్నబాబు.. తిరిగి ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ను టార్గెట్ చేశారు. నిమ్మగడ్డ వ్యక్తిగత పట్టుదలకు, ఓ పార్టీ కుట్రకు తాజా పరిణామాలు నిదర్శమన్నారు. వ్యక్తిగత ప్రతిష్ట కోసం నిమ్మగడ్డ ప్రజారోగ్యంతో చెలగాటం ఆడుతున్నారన్నారు. ఈ వ్యాఖ్యల ద్వారా మంత్రి కన్నబాబు.. ఎన్నికలకు సహకరిస్తాం కానీ నిమ్మగడ్డతో పోరు కొనసాగుతుందని మరోసారి తేల్చిచెప్పినట్లయింది. అలాగే చంద్రబాబు, నిమ్మగడ్డ వ్యక్తిగత ప్రతిష్ట కోసం కరోనాను కూడా లెక్కచేయకుండా ఎన్నికల కోసం వెళ్తున్నారన్న విషయాన్ని ప్రజల్లోకి కూడా తీసుకెళ్లాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
సుప్రీం తీర్పుపై సర్కారు న్యాయసలహా
సుప్రీంకోర్టు తీర్పుపై పంచాయతీరాజ్శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా స్పందించారు. సుప్రీం తీర్పు రాగానే సీఎం జగన్తో భేటీ అయి కీలక చర్చల్లో పాల్గొన్నారు. ఈ భేటీలో ఏజీ శ్రీరాం సుబ్రహ్మణ్యంతోనూ సీఎం, మంత్రి పెద్దిరెడ్డి చర్చించారు. అడ్వకేట్ జనరల్తో తదుపరి చర్చలు కూడా జరుగుతున్నట్లు ఆయన తెలిపారు. సుప్రీం తీర్పు పూర్తి సారాంశాన్ని ఏజీ పరిశీలిస్తున్నారని, ఆయన సలహా మేరకు ప్రభుత్వం తదుపరి నిర్ణయం తీసుకుంటుందని పెద్దిరెడ్డి తెలిపారు. దీంతో సుప్రీంతీర్పుకు కట్టుబడుతూనే అమలుపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.