జగన్ గొప్ప మనసు .. నాడు వైఎస్ తో పాటు చనిపోయిన ఐఏఎస్ కుమార్తెకు గ్రూప్1 జాబ్ ఇచ్చిన జగన్ సర్కార్
వైసీపీ అధినేత , ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన మార్క్ పాలనతోనే కాదు , తన సంచలన నిర్ణయాలతోనూ అందరితో గ్రేట్ అనిపించుకుంటున్నారు . ఎప్పుడో పదేళ్ల నాడు తన తండ్రి వై ఎస్సార్ మరణించిన ఘటనలో ప్రాణాలు కోల్పోయిన ఐఏఎస్ కుటుంబాన్ని గుర్తు పెట్టుకుని మరీ జగన్ ఇప్పుడు వారికి బాసటగా నిలిచారు. తండ్రితో పాటు హెలికాఫ్టర్ ప్రమాదంలో మృతి చెందిన ఐఏఎస్ అధికారి సుబ్రహ్మణ్యం కుమార్తెకు గ్రూప్ 1 జాబ్ ఇచ్చి ఆ కుటుంబానికి భరోసా ఇచ్చారు ఏపీ సీఎం జగన్.
వైఎస్ తో పాటు చనిపోయిన సుబ్రహ్మణ్యం కుటుంబానికి జగన్ భరోసా .. నేడు గ్రూప్ 1 అధికారిణిగా అవకాశం
దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి 2009లో ఉమ్మడి ఏపీకి వరుసగా రెండో పర్యాయం సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరం రచ్చబండ కార్యక్రమానికి వెళుతూ నల్లమల ఫారెస్ట్ లో హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించారు. ఆ ప్రమాదంలో వైఎస్ తో పాటు అప్పుడు ఆయనకు కార్యదర్శిగా పనిచేస్తున్న సీనియర్ ఐఏఎస్ అధికారి సుబ్రహ్మణ్యం కూడా ప్రాణాలు కోల్పోయారు. ఇక తండ్రి అంత్యక్రియలు ముగిశాక సుబ్రహ్మణ్యం కుటుంబాన్ని పరామర్శించి కుటుంబానికి అండగా ఉంటానని చెప్పారు జగన్ . ఎప్పుడో పదేళ్ళ క్రితం ఆయన అన్న మాటకు కట్టుబడి నేడు సీఎం అయిన తర్వాత సుబ్రహ్మణ్యం కుటుంబాన్ని ఆదుకోటానికి ఆయన కుమార్తె సింధుకు గ్రూప్ 1 అధికారిణిగా అవకాశం కల్పించి సంచలన నిర్ణయం తీసుకున్నారు.
ఎగ్జిక్యూటివ్ విభాగంలో డిప్యూటీ కలెక్టర్ గా ఉద్యోగం .. ఉత్తర్వులు జారీ
ఇక జగన్ తీసుకున్న నిర్ణయంతో సింధూను గ్రూప్ 1 అధికారిణిగా నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన సింధూ సుబ్రహ్మణ్యానికి గ్రూప్ 1 ఉద్యోగమిస్తూ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మన్మోహన్ సింగ్ గురువారం ఆదేశాలు జారీ చేశారు. ప్రత్యేక కేసు కింద పరిగణిస్తూ ఆమెకు ఏపీ సివిల్ సర్వీసెస్ ఎగ్జిక్యూటివ్ విభాగంలో డిప్యూటీ కలెక్టర్ గా ఉద్యోగం ఇస్తున్నట్టు ప్రభుత్వం ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది.
ఐఏఎస్ సుబ్రహ్మణ్యం కుటుంబాన్ని గాలికి వదిలేసిన గత పాలకులు .. జగన్ నిర్ణయంపై అధికార వర్గాల్లో హర్షం
ప్రమాదంలో మరణించే అధికారుల కుటుంబాలకు బాసట అందించే క్రమంలో వారి పిల్లలకు వారి విద్యార్హతలను బట్టి ప్రభుత్వం ఉద్యోగాలను ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ నిబంధన మేరకే చాలా మంది ఐఏఎస్ - ఐపీఎస్ అధికారుల కుటుంబాలకు బాసటగా నిలిచిన ప్రభుత్వాలు వారి పిల్లలకు సర్కారీ కొలువులను అందించాయి. అదే క్రమంలో సింధూకు అవకాశం కల్పించినా జగన్ పదేళ్ళ నాటి మాట గుర్తు పెట్టుకుని ఆ ఐఏఎస్ కుటుంబానికి బాసటగా నిలవటం అందరి మన్నన పొందుతుంది. అయితే వైఎస్ తో మరణించిన సుబ్రహ్మణ్యం కుటుంబానికి బాసటగా నిలిచే విషయంలో నాటి రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి సర్కారులతో పాటు గడచిన ఐదేళ్ల పాటు ఏపీని పాలించిన చంద్రబాబునాయుడు సర్కార్ కూడా దృష్టి సారించలేదు . కానీ నేడు జగన్ సింధు కు ఉద్యోగం ఇచ్చి అండగా నిలవటం మాత్రం అధికార వర్గాల్లో చర్చకు దారి తీస్తుంది.