chandrababu:జగన్ సర్కార్ వేధింపులపై చంద్రబాబు గుస్సా, సుప్రీంకోర్టు వరకు వెళతాం..
జగన్ సర్కార్ వేధింపులపై కోర్టులో పోరాడుతామని టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. రెండోరోజు చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా టీడీపీ శ్రేణులతో సమావేశమయ్యారు. తమ వేధింపుల గురించి పుంగనూరు టీడీపీ నేతలు చంద్రబాబుకు వివరించారు. టీడీపీ కార్యకర్తలను వేధించడం సరికాదని చంద్రబాబు అన్నారు. అక్రమ కేసులపై స్థానిక కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు పోరాటం చేస్తామని చెప్పారు.
అట్రాసిటీ కేసులు..
చిత్తూరు జిల్లాలో చంద్రబాబు రెండోరోజు పర్యటన కొనసాగుతుంది. పుంగనూరులో పార్టీ నేతలతో చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వేధింపుల గురించి చంద్రబాబుకు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ కేసులు పెడుతున్నారని చెప్పారు. మరికొందరిపై రౌడీ షీట్ తెరిచారని సభ వేదికపై చంద్రబాబుకు తెలిపారు. టీడీపీ శ్రేణుల ఫిర్యాదుపై చంద్రబాబు స్పందించారు. అధికార వైసీపీ తీరు సరిగాలేదని విమర్శించారు. ప్రతిపక్షాలను వేధించడం మానుకోవాలని హితవు పలికారు.
ఆల్ ఆర్ ఈక్వల్
చట్ట ముందు అందరూ సమానమేనని చంద్రబాబు చెప్పారు. అట్రాసిటీ కేసులు ఎలా పెడతారని ప్రశ్నించారు. రౌడీ షీట్కు సంబంధించి పత్రాలను నిపుణులు పరిశీలిస్తారని చెప్పారు. దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని చెప్పారు. రౌడీ షీట్కు సంబంధించి నిపుణులు పరిశీలించి.. కోర్టులను ఆశ్రయిస్తామని చెప్పారు. స్థానిక కోర్టు, సెషన్స్ కోర్టు, హైకోర్టు అవసరమైతే సుప్రీంకోర్టు వరకు వెళతామని చంద్రబాబు స్పష్టంచేశారు.
అధికారులా..?
టీడీపీ శ్రేణులపై కేసులు పెట్టినవారిని వదిలిపెట్టబోమని చంద్రబాబు హెచ్చరించారు. తమ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టినా పోలీసులు, రెవెన్యూ సిబ్బందిపై తిరిగి కేసులు పెడతామని తేల్చిచెప్పారు. ఇవాళ అధికారంతో సీఎం జగన్ చెప్పినట్టు నడుచుకుంటున్నారని.. ఈ రోజు గడిస్తే మిగిలిదీ రేపేనని గుర్తుచేశారు. ఎల్లుండి సంగతి ఏంటి అని ప్రశ్నించారు. అధికారులు, పోలీసులు కూడా ప్రభుత్వానికి తొత్తుల్లా వ్యవహరించొద్దని సూచించారు.
సమానత్వం ఏదీ...
చట్టం ముందు అందరూ సమానులేనని చంద్రబాబు తెలిపారు. వైఎస్ఆర్ సీఎంగా ఉన్న సమయంలో జగన్ అవినీతికి పాల్పడ్డాడని గుర్తుచేశారు. చేసిన తప్పుకు 16 నెలలు జైలు శిక్ష అనుభవించాడని పేర్కొన్నారు. తర్వాత ఎలాగోలా అధికారంలోకి వచ్చారని తెలిపారు. ఇటీవల తాను సీఎం అని, కోర్టుకు రావడం వీలుకావడం లేదని జగన్ కోర్టు దృష్టికి తీసుకొచ్చిన విషయాన్ని చంద్రబాబు గుర్తుచేశారు. చట్టం ముందు అందరూ సమానమేనని.. కోర్టుకు రావాల్సిందేనని న్యాయస్థానం స్పష్టంచేసింది. దీంతో కోర్టుల వద్ద తమ పర బేధం లేదని, అందరూ సమానమేననే విషయాన్ని ప్రజలు గుర్తించాల్సిన అవసరం ఉందని చంద్రబాబు అన్నారు.