జగన్ ప్రభుత్వం ఉండేది మూడున్నారేళ్లేనా: మోదీ మాస్టర్ ప్లాన్: ముఖ్యమంత్రి సైతం సై..!
Recommended Video
ఏపీలో వైసీపీ తొలి సారి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. తొమ్మదేళ్ల పోరాటంతో జగన్ ముఖ్యమంత్రి అయ్యారు. సరిగ్గా ఆయన ప్రమాణ స్వీకారం చేసి నెల రోజులు పూర్తయింది. తిరిగి 2024 ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పని చేయాలని జగన్ ఇప్పటికే పార్టీ నేతలకు పదే పదే చెబుతున్నారు. అయితే, కేంద్రం ఆలోచన మరోలా ఉంది. రెండో సారి మోదీ ప్రధాని అయిన తరువాత ఆలోచనలు మారిపోతున్నాయి. ఫలితంగా ఏపీలో అయిదేళ్ల పాటు జగన్ ప్రభుత్వం కొనసాగే అవకాశాలు కనిపించటం లేదు. మూడున్నారేళ్లకే ముగించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. దీనికి ఏపీ ముఖ్యమంత్రి జగన్ సైతం సై అంటున్నారు. అంటే 2024లో కాకుండా ముందుగానే ఎన్నికలు రానున్నాయి.
జగన్ ప్రభుత్వం మూడున్నారేళ్లే..
2019లో అంటే రెండు నెలల క్రితం ఏపీలో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ఏప్రిల్ 23న ఫలితాలు వెల్లడయ్యాయి. ఏపీ లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. జూన్ 30న ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణ స్వీకారం చేసారు. ప్రభుత్వం ఏర్పాటైన తరువాత అయిదేళ్ల పాటు అధికారంలో కొనసాగుతుంది. జగన్ సైతం అదే భావించారు. జగన్ మాత్రమే కాదు.. ఏపీ ప్రజలు అవే అంచనాలతో ఉన్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత జగన్ సైతం ఇప్పటి నుండే 2024 ఎన్నికలు సమాయత్తం కావాలని..ఇంత కంటే అధిక సంఖ్యలో సీట్లు గెలవాలని నిర్ధేశించారు. ఈ అయిదే ళ్ల కాలంలో ప్రజలకు ఇచ్చిన ప్రతీ హామీ నిలబెట్టుకోవాలని నిర్ధేశించారు. ఇక..అయిదేళ్లు కాదు..30 ఏళ్లు తాను సీఎంగా ఉండాలని కోరిక అని..అదే విధంగా తాను లేకపోయినా తన ఫొటో ప్రజల ఇళ్లల్లో ఉండాలనే తన ఆకాంక్ష అని అనేక మార్లు చెప్పుకొచ్చారు. కానీ, పరిణామాలు మారుతున్నాయి. జగన్ అయిదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉండే అవకాశాలు కనిపించటం లేదు. ఖచ్చితంగా మూడున్నారేళ్లకే తొలి దఫా పాలన ముగించే పరిస్థితి కనిపిస్తోంది.
ప్రధాని మోదీ మాస్టర్ ప్లాన్..
కేంద్రంలో మోదీ రెండో సారి ప్రధానిగా పగ్గాలు చేపట్టారు. వాస్తవంగా కేంద్రంలో..ఏపీలో తిరిగి ఒకే సారి ఎన్నికలు జరగాలి. కానీ, ప్రధాని మోదీ ఒకే దేశం..ఒకే ఎన్నిక నినాదం తెర మీదకు తెచ్చారు. అన్ని పార్టీలతో సమావేశం ఏర్పాటు చేసారు. ప్రతిపాదన కాదు..ఆచరణ దిశగా అడుగులు వేస్తున్నారు. 2025 నాటికి ప్రధాని మోదీకి 75 సంవత్సరాల వయసు వస్తోంది. ఆ వయసు వస్తే బీజేపీ సిద్దాంతం ప్రకారం ఆయన ప్రధానిగా కొనసాగలేరు. దీంతో.. 2022-2023 నాటికి తన ప్రతిపాదన అమలు చేసి..మరో విడత బీజేపీని కేంద్రంలో అధికారంలోకి తీసుకొచ్చి క్రియాశీలక రాజకీయా ల నుండి రిటైర్ కావాలని యోచిస్తున్నారు. ఇందు కోసం త్వరలోనే బిల్లును ప్రతిపాదించి..ఆమోదించుకొనే దిశగా అడుగులు వేస్తున్నారు. తృణమూల్, వామపక్షలు వంటివి నో చెబుతున్నా...పెద్దగా వ్యతిరేక లేదు. దీంతో.. మోదీ సైతం ప్రస్తుతం ఏర్పడిన ప్రభుత్వాలను ఒప్పించి 2022 చివర్లో లేదా 2023 తొలి త్రైమాసికం లోనే ఎన్నికలు దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్ర- లోక్సభ ఎన్నికలు నిర్వహించే దిశగా కసరత్తు జరుగుతోంది.
ఏపీ ముఖ్యమంత్రి సైతం సై..
ప్రధాని మోదీ ఆలోచనలకు..ముందుగానే ఎన్నికలకు వెళ్లాలనే జమిలి ఎన్నికల ప్రతిపాదనకు ఇప్పటికే ఏపీ ముఖ్యమంత్రి జగన్ సై అన్నారు. మోదీ ఆలోచనలపైన పూర్తి అవగాహన ఉండటంతో..ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన జగన్ ఆ మరుసటి క్షణం నుండే తన హామీలు అమలు పైన దృష్టి సారించారు. తనకు అయిదేళ్ల కాల పరిమితి లేదని..మూడున్నారేళ్ల పాలనకే సిద్దపడుతున్న జగన్..తిరిగి ఎన్నికల్లో గెలుపు కోసం ఈ మూడున్నారేళ్లను సద్వినియోగం చేసుకోవాలని వ్యూహాలు సిద్దం చేస్తున్నారు. ఇందులో భాగంగానే తొలి నెల రోజుల పాలనలోనే అనేక హామీలు అమలు..కొత్త వరాలు.. నిర్ణయాల ప్రకటన వంటివి అమలు చేస్తున్నారు. అయితే, పోలవరం పైన అటు కేంద్రం డీపీఆర్కు ఆమోదం తెలపటం..అదే విధంగా కేసీఆర్ కేసుల ఉప సంహరణకు ముందుకు రావటంతో 2021 నాటికి ప్రాజెక్టు పూర్తి చేయాలనే ప్రణాళిక సిద్దం చేసారు. దీంతో..ఇప్పుడు 2022-2023 ఎన్నికల కోసం ఏపీలో ఇప్పటి నుండి రాజకీయ యుద్దం మొదలయ్యే అవకాశం కనిపిస్తోంది.