జగన్ మరో కీలక నిర్ణయం: రూ.1000 కోట్లు విలువ చేసే ఆ పనులకు బ్రేక్
ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక గత ప్రభుత్వంలో తీసుకున్న ప్రతి నిర్ణయంపై సమీక్షలు జరిపి అందులో అవకతవకలు జరిగి ఉంటే వాటిని తీవ్రంగా పరిగణిస్తోంది. ఇందులో భాగంగానే గత ప్రభుత్వ హయాంలో తీసుకున్న నిర్ణయాలకు బ్రేకులు వేస్తోంది. తాజాగా 13 జిల్లాల్లోని ఆయా పంచాయతీల్లో 3543 రోడ్ల నిర్మాణ పనులను నిలిపివేస్తూ ఆదేశాలు జారీచేసింది. ఇప్పటివరకు ఆ పనులు ప్రారంభం కానందున వాటిని నిలిపివేయాలంటూ జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పనుల విలువ దాదాపు రూ.1,031.17 కోట్లు అని తెలుస్తోంది.
ప్రస్తుతం జరుగుతున్న అన్ని ప్రాజెక్టులపై క్షుణ్ణంగా పరిశీలించి ఒక నివేదిక ప్రభుత్వానికి సమర్పించాలని కోరుతూ నిపుణులతో కూడిన కమిటీని సర్కార్ నియమించింది. ఎఫ్ఆర్బీఎం నిబంధనల్లో సడలింపు ఇస్తూ గత ప్రభుత్వం ఈ పనులకు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. దీంతో రాష్ట్ర ఖజానాపై భారం పడుతోందని ప్రభుత్వం భావిస్తోంది. ఏప్రిల్ 1, 2019కి ముందు రోడ్డు నిర్మాణపనులకు ఇచ్చిన అనుమతులను నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ప్రభుత్వం సూచించింది. ఒకవేళ ఇప్పటికే పనులు ప్రారంభం అయి వాటి ఖర్చుల విలువ అసలైన ధర కంటే 25శాతం తక్కువగా ఉంటే వెంటనే నిలిపివేయాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది. వీటికి డబ్బులు కూడా చెల్లించేది లేదని ప్రభుత్వం తెలిపింది.
ప్రభుత్వ ఆదేశాలతో పంచాయతీరాజ్ చీఫ్ ఇంజినీర్ 3543 పనులకు సంబంధించి వివరాలను పొందుపర్చారు. వీటి విలువ రూ.1031.17 కోట్లు ఉండొచ్చని చెబుతున్నారు. ఈ పనులన్నీ ఏప్రిల్ 1, 2019కి ముందు అప్పటి చంద్రబాబు ప్రభుత్వం హయాంలో అనుమతులు పొందినవే అని నివేదికలో తెలిపారు. ఇవి ఇంకా ప్రారంభం కాలేదని స్పష్టం చేశారు చీఫ్ ఇంజినీర్. ఇందులో భాగంగానే ప్రభుత్వం ఆ పనులన్నిటినీ రద్దు చేస్తూ జీవో విడుదల చేసింది.