రంగుపడుద్ది: తెరపైకి కొత్త వివాదం: ఉమ వర్సెస్ వైసీపీ
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కరోనావేళ వేడెక్కుతున్నాయి. రాష్ట్రం కరోనావైరస్ బారిన పడి అల్లాడుతుండగా అధికార ప్రతిపక్ష పార్టీల నాయకులు ఈ సమయంలో రాజకీయాలు మాట్లాడుతూ ఒకరిపై ఒకరు విమర్శలకు దిగుతున్నారు. రాష్ట్ర మాజీ ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ వ్యవహారం నుంచి ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగులు వేయడం వరకు అన్నిటిపై ఇటు అధికారం అటు ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకున్నాయి. ఇక కరోనావైరస్ పై ముఖ్యమంత్రి చేస్తున్న ప్రకటనలపై ప్రధాన ప్రతిపక్షనేత చంద్రబాబు నుంచి పార్టీలో ఇతర నేతల వరకు విమర్శలు గుప్పించారు. ఇక ప్రభుత్వ పథకాలపై కూడా ప్రతిపక్షం విమర్శలు గుప్పించింది. ఇలా ఎక్కడా తగ్గడం లేదు. తాజాగా టీడీపీ నేత మాజీ మంత్రి దేవినేని ఉమ ట్విటర్ వేదికగా ప్రభుత్వంపైకి మరో అస్త్రం వదిలారు.
ఆరోగ్యశ్రీ సంస్కరణల్లో భాగంగా వెయ్యి రూపాయలు ఖర్చు దాటిన ప్రతి వ్యాధికి ఉచితంగా చికిత్స అందించాలనే ఉద్దేశంతో పశ్చిమగోదావరిలో రాష్ట్ర ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టు ప్రారంభించింది. ఈ నెలలో ప్రతి మండలానికి అంబులెన్స్ కేటాయించాలనేది ప్రభుత్వ లక్ష్యం. ఇందుకోసం ఇప్పటికే పెద్ద సంఖ్యలో అంబులెన్స్లను కొనుగోలు చేశారు. అవి ఇప్పటికే విజయవాడకు చేరుకున్నాయి. ఇక వీటిని ప్రారంభించడం లాంఛనమే. కరోనా కారణంగా ఇప్పటి వరకు ఈ కార్యక్రమంపై నిర్ణయం తీసుకోలేదు. ఈ సమయంలో దేవినేని ఉమ చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది.
మాజీ మంత్రి దేవినేని ఉమ మరోమారు ఫైర్ అయ్యారు. ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. అయితే ఇది నేరుగా కాకపోయినా సోషల్ మీడియా ద్వారా అంటే ట్విటర్ వేదికగా ఈ విమర్శలు చేశారు. ప్రజాధనంతో కొనుగోలు చేసిన ఈ అంబులెన్స్లని వైసీపీ రంగులు వెయ్యడానికి విజయవాడలోని మెడికల్ కాలేజీలో కొన్ని నెలలుగా ఉంచారంటూ ఆ అంబులెన్స్లు ఉన్న ఫోటోను ట్వీట్ చేశారు. అంతేకాదు కరోనా వైరస్ కష్టకాలంలో కూడా వైసీపీకి ఆ పార్టీనాయకులకు రంగుల పబ్లిసిటీ పిచ్చి తగ్గలేదంటూ విమర్శించారు.
Recommended Video
ప్రజాధనంతో కొనుగోలు చేసిన ఈ అంబులెన్సులని వైసీపీ రంగులు వెయ్యడానికి కొన్ని నెలలుగా విజయవాడ లోని మెడికల్ కాలేజీలో పెట్టి ఉంచారు , కరోనా వైరస్ క్లిష్ట సమయాల్లో కూడా మీకు మీ పార్టీ నాయకులకి ఈ రంగుల పబ్లిసిటీ పిచ్చి ఏంటి ముఖ్యమంత్రి @ysjagan గారు pic.twitter.com/FsU5SV6K31
— Devineni Uma (@DevineniUma) April 29, 2020
పంచాయతీ కార్యాలయాలకు వైసీపీ రంగులు వేయడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వాటిని తొలిగించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని స్పష్టం చేసింది. అయితే ప్రభుత్వం ఆ రంగులకు కొత్త విశ్లేషణ పరమార్థం ఇది అని జోడిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో అంబులెన్సులకు సైతం ప్రభుత్వం నిజంగా వైసీపీ జెండా రంగులు వేయబోతోందా..అనేది ఇప్పుడు హాట్టాపిక్గా మారింది.