పోలవరం గురించి అడిగితే ప్రభుత్వం పారిపోతోంది: దేవినేని ఫైర్
పోలవరం పనులు ఎందుకు ఆపివేశారని మాజీ మంత్రి టీడీపీ నేత దేవినేని ఉమ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అసెంబ్లీలో టీడీపీని టార్గెట్ చేసేందుకు వెచ్చించిన సమయం పోలవరంపై చర్చించి ఉంటే బాగుండేదని వైసీపీ ప్రభుత్వానికి హితవు పలికారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక పోలవరం పనులు నిలిచిపోయాయని ఆరోపించిన దేవినేని ఉమ... పోలవరంపై ఎక్కడ చర్చ జరపాల్సి వస్తుందో అని ప్రభుత్వం పారిపోయిందని అన్నారు.
Recommended Video
నదుల అనుసంధానంను ఒక ప్రణాళిక ప్రకారం రాష్ట్ర రైతాంగం ముందుకు చంద్రబాబు నాయుడు తీసుకొచ్చారని చెప్పిన దేవినేని... ముఖ్యమంత్రి జగన్ ఓర్వలేకపోతున్నారని అన్నారు. వంశధార స్టేజ్ టూ ఫేజ్టూకు రూ.వెయ్యి కోట్లు ఖర్చుపెట్టినట్లు చెప్పిన దేవినేని.. అక్కడి నిర్వాసితులకు రూ.400 కోట్లు ఖర్చుపెట్టామని గుర్తు చేశారు. వంశధార కింద రెండు పంటలు వేయిస్తే చంద్రబాబు సర్కార్ను ప్రశంసించాల్సిందిపోయి ఆయన్ను, అచ్చెన్నాయుడును దూషించేందుకే సమయం వెచ్చించారని అన్నారు. ఆ రోజు జరిగిన మంచిని ప్రస్తుతం సీఎంఓలో ఉన్న ధనుంజయరెడ్డిని అడిగితే తెలుస్తుందని దేవినేని అన్నారు.
వంశధార, నాగావళి, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకాలను ఎందుకు నిలిపివేశారని ప్రశ్నించారు. సెంట్రల్ బోర్డు ఆఫ్ ఇరిగేషన్ అండ్ పవర్ 2018లో బెస్ట్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్టు అవార్డు పోలవరం ప్రాజెక్టుకు ఇచ్చారని దేవినేని గుర్తు చేశారు. మొత్తం 16 జాతీయ ప్రాజెక్టులు పోటీలో నిలవగా పోలవరం ప్రాజెక్టుకు తొలి స్థానం దక్కిందన్నారు. 24 గంటల్లో 32వేల 100 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వేసినందుకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో పోలవరంకు స్థానం దక్కిందన్నారు. రెండు నెలలుగా కాంక్రీట్ ఎందుకు వేయడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ రెండు నెలల్లో అడ్డం పడకపోతే కాంక్రీట్ పని దాదాపుగా పూర్తయిపోయేదని అన్నారు. ప్రభుత్వం కక్షగట్టే పోలవరం ప్రాజెక్టు పనులను నిలిపివేసిందని దేవినేని విమర్శించారు. రీటెండరింగ్ అంటూ పనులు ఆపే ప్రయత్నం ప్రభుత్వం చేస్తోందని దేవినేని దుయ్యబట్టారు.