చంద్రబాబు తొలి లేఖ తిరస్కరించిన జగన్ ప్రభుత్వం...ప్రజావేదిక స్వాధీనానికి ఆదేశం
ఏపీ రాజకీయాల్లో చర్యకు ప్రతిచర్య ప్రారంభమైందా..? చంద్రబాబు హయాంలో జరిగిన కట్టడాలపై జగన్ ప్రభుత్వం దృష్టి సారించిందా...? నిబంధనలకు వ్యతిరేకంగా ఉంటే వాటిని తొలగించేందుకు చర్యలు ప్రారంభించిందా..? ఇందులో భాగంగానే చంద్రబాబు ప్రధాన ప్రతిపక్షనేతగా ఏపీ సీఎం జగన్కు రాసిన మొదటి లేఖను తిరస్కరించారా..?
చంద్రబాబు తొలి లేఖను తిరస్కరించిన జగన్
ఏపీ ప్రతిపక్షనేత మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకు గట్టి షాక్ ఇచ్చింది జగన్ ప్రభుత్వం. తన హయాంలో నిర్మించిన ప్రజావేదిక తనకు కేటాయించాలంటూ సీఎం జగన్కు ప్రతిపక్ష నాయకుడి హోదాలో చంద్రబాబు లేఖ రాశారు. అయితే ఆ లేఖను జగన్ తిరస్కరించారు. దీంతో సీఆర్డీఏ అధికారులు ఉండవల్లిలో ఉన్న ప్రజావేదికను స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం మధ్యాహ్నం గుంటూరు జిల్లా రెవిన్యూ అధికారులు ప్రజావేదికను తమ స్వాధీనంలోకి తీసుకున్నారు. అయితే అందులో టీడీపీకి సంబంధించిన సామగ్రి ఉండటంతో వెంటనే తీసుకెళ్లాల్సిందిగా వారికి ఆదేశాలు జారీ చేశారు.
ఈ నెల 24 ప్రజావేదికలో కలెక్టర్ల సమావేశం
ఇదిలా ఉంటే కరకట్టపై నిబంధనలకు వ్యతిరేకంగా నిర్మించిన అక్రమకట్టడాలను కూల్చివేస్తామని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలు చేసిన రెండు రోజుల్లోనే ప్రభుత్వం ప్రజావేదికను స్వాధీనం చేసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. చంద్రబాబు నాయుడు ఉండవల్లిలోని తన నివాసం పక్కనే ప్రజావేదికను నిర్మించుకున్నారు. అందులోనే పార్టీ కార్యక్రమాలు, ప్రభుత్వ అధికారిక సమావేశాలు నిర్వహించేవారు. అయితే ప్రజావేదిక ప్రభుత్వానికి సంబంధించింది కనుక అది ప్రభుత్వానికి తిరిగి కేటాయించాలని వైసీపీ నేతలు సీఎస్ సుబ్రహ్మణ్యంను కలిసి విజ్ఞప్తి చేశారు. వైసీపీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం సీఎస్ను కలిసి ప్రజావేదికను తమకు కేటాయించాలని కోరారు. ప్రజావేదికలో సమావేశాలు నిర్వహిస్తామని జగన్ పార్టీ అధ్యక్షుడి హోదాలో హాజరవుతారని తెలిపారు. దీంతో అక్కడ ట్రాఫిక్ సమస్య కూడా ఉండదని స్పష్టం చేశారు. ఈ నెల 24 ప్రజావేదికలో కలెక్టర్ల సమావేశాన్ని సీఎం జగన్ నిర్వహించబోతున్నారు.
అత్యంత విశాలమైన గదులతో ప్రజావేదిక భవనం నిర్మాణం
ప్రజావేదిక తమకు కేటాయించాలని ప్రతిపక్ష నాయకుడు లేఖ రాయడంపై ఎంపీ విజయసాయిరెడ్డి సైటైర్లు వేశారు. ప్రజా సమస్యలపై బాబు తొలిలేఖ రాస్తారనుకుంటే... ప్రజావేదిక తనకు కేటాయించాలంటూ రాయడం విడ్డూరంగా ఉందంటూ విజయ్సాయిరెడ్డి ట్వీట్ చేశారు. ఇదిలా ఉంటే నాడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రభుత్వం నిధులతో తన ఇంటికి పక్కనే ప్రజావేదికను నిర్మించారు. సువిశాలమైన గదులు, అత్యాధునిక టెక్నాలజీతో దీన్ని నిర్మించారు. ఒకే సారం వెయ్యి మంది కూర్చునే సదుపాయం ఇందులో ఉంది.